ఏపీ కాలుష్య నియంత్రణ మండలిలో 29 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ మేరకు  పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఆర్థికశాఖ మానవ వనరుల విభాగం ముఖ్యకార్యదర్శి ఆగస్టు 16న ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీచేశారు. ప్రభుత్వం అనుమతి తెలిపిన పోస్టుల్లో అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్ - 21 పోస్టులు, గ్రేడ్-2 అనలిస్ట్ - 8 పోస్టులు ఉన్నాయి.  ఏపీపీఎస్సీ ద్వారా ఈ పోస్టులు భర్తీ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


కాంట్రాక్టు ఉద్యోగుల ఐదేళ్ల నిబంధన తొలగింపు..
కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణలో 5 ఏళ్ల నిబంధనను తొలగిస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు. 2014 జూన్ 2 నాటికి 5 ఏళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించేందుకు గత కేబినెట్ సమావేశంలో  నిర్ణయం తీసుకున్నారని, అయితే ఇప్పుడు ఆ నిబంధనను తొలగిస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. దీనికి సంబంధించిన దస్త్రంపై ముఖ్యమంత్రి జగన్ సంతకం కూడా చేశారని మరో నాలుగైదు రోజుల్లోనే దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడతాయని వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేయకపోయినా 5 ఏళ్ల నిబంధనను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.


ఏపీ విద్యుత్ ఉద్యోగులకు రివైజ్డ్ పేస్కేళ్లు ఖరారు..
ఏపీ విద్యుత్తు ఉద్యోగుల రివైజ్డ్ పేస్కేళ్లను యాజమాన్యం ఖరారు చేసింది. ఈ మేరకు మాస్టర్ స్కేల్‌తో కూడిన పీఆర్‌సీ ఒప్పందంపై ఐకాస సంతకాలు చేసింది. కొత్త పీఆర్‌సీ ప్రకారం 8 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని నిర్ణయించింది. ఒప్పందం ప్రకారం 2022 ఏప్రిల్ నుంచి కొత్త పీఆర్‌సీ అమల్లోకి రానుంది. పీఆర్‌సీ బకాయిలను 12 వాయిదాల్లో చెల్లిస్తామని యాజమాన్యాలు ప్రకటించాయి. పే స్కేళ్లలో లోటుపాట్లను సరిచేసేందుకు ట్రాన్స్‌కో జేఎండీ సారథ్యంలో కమిటీని నియమించారు.


ఇదిలా ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే విద్యుత్‌ ఉద్యోగులకు కూడా కనీసం 23 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని ప్రభుత్వాన్ని విద్యుత్ ఉద్యోగ  సంఘ నేతలు కోరుతున్నారు.  విద్యుత్‌ ఉద్యోగులకు ప్రకటించిన 8శాతం ఫిట్‌మెంట్‌ను స్ట్రగుల్‌ కమిటీ అంగీకరించడం లేదని చెబుతున్నారు.  విద్యుత్ ఉద్యోగుల డిమాండ్ల పైన ప్రభుత్వంలో సంఘాలతో చర్చలు చేసింది. పర్సనల్‌ పే నెలకు రూ.2.40 లక్షల నుంచి రూ.2.49 లక్షల దాకా చెల్లించడంతో పాటు ఫిట్‌మెంట్‌ 7 శాతానికి.. మాస్టర్‌ స్కేల్‌పై 3.2 శాతం పెంపుదలకు యాజమాన్యం ఆమోదించింది. యాజమాన్యం చేసిన ప్రతిపాదనలకు జేఏసీ అంగీకరిస్తే, క్యాడర్‌ స్కేల్‌ ఉద్యోగులకు పర్సనల్‌ పే అమలు విషయంలో ముఖ్యమంత్రితో మాట్లాడతామని తెలిపింది. అందుకు జేఏసీ నేతలు అంగీకరించారు. దీంతో సమ్మె నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. 


ALSO READ:


తగ్గేది లేదంటున్న ఏపీ విద్యుత్ ఉద్యోగులు - ప్రభుత్వం ఏం చేయబోతోంది?
విద్యుత్‌ ఉద్యోగులకు మెరుగైన వేతన సవరణ చేయాలని, కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్‌ చేయాలన్న డిమాండ్‌లతో ఆగస్టు 17వ తేదీన విద్యుత్‌ సౌధ వద్ద తలపెట్టిన మహాధర్నాను తాత్కాలికంగా వాయిదా వేశారు విద్యుత్ ఉద్యోగ సంగ నేతలు.  పోలీసులు ఈ ధర్నాకు అనుమతి నిరాకరించారని అందుకే  తాత్కాలికందా వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. ధర్నాకు అనుమతించేలా పోలీసులను ఆదేశించాలని హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేస్తున్నామని ఉద్యోగ నేతలు తెలిపారు.  కోర్టు నుంచి ఆదేశాలు వచ్చాక స్ట్రగుల్‌ కమిటీ ధర్నా నిర్వహిస్తుందని.. అనంతరం మహాధర్నా తేదీని ప్రకటిస్తామన్నారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..