Telangana Elections :  తెలంగాణ రాజకీయ పార్టీలు వచ్చే వారమే ఎన్నికల నోటిఫికేషన్ అన్నంత కంగారు పడిపోతున్నాయి. అభ్యర్థుల జాబితాలను వడపోస్తున్నాయి. ప్రచార కార్యక్రమలను జోరుగా నిర్వహిస్తున్నారు  2018లో జరిగిన ఎన్నికలను సమయానికి ఓ నాలుగైదు రోజులు అటూ ఇటూగా షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. అప్పట్లో అక్టోబర్ ఆరో తేదీన  షెడ్యూల్ ప్రకటించారు. డిసెండర్ మొదటి వారంలో పోలింగ్ జరిగింది. ఆ ప్రకారం చూస్తే ఇంకా పోలింగ్ కు మూడు నెలల గడవు ఉంది. షెడ్యూల్ రావడానికి ఇంకా రెండు నెలల గడువు ఉంది. కానీ రాజకీయ పార్టీలు మరో వారంలో నోటిఫికేషన్ వచ్చేస్తుందన్నట్లుగా హడావుడి పడుతున్నాయి.  గతంలో కాదని.. ముందే  ఈ సారి ఈసీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తుందని రాజకీయ పార్టీలన్నీ గట్టిగా నమ్ముతూండటమే కారణం. 


సెప్టెంబర్‌లో ఎన్నికల షెడ్యూల్ వచ్చేస్తుందా ?


సెప్టెంబర్ లో ఎన్నికల షెడ్యూల్ వస్తుందని అక్టోబర్‌లో పోలింగ్ ఉటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమ పార్టీ నేతలకు చెప్పారు.  ఆ ప్రకారం ఎన్నికలకు సిద్ధమవ్వాలన్న సంకేతాలు కూడా పంపారు. అయితే ఒక్క కేటీఆర్ కే ఇలాంటి కాన్ఫిడెన్షియల్ సమాచారం అందిందా లేకపోతే.. పార్టీ నేతలు రిలాక్స్ కాకుండా అలా చెప్పారా అన్నది మాత్రం ఎవరిక తెలియదు. కానీ బీఆర్ఎస్ పార్టీ సన్నాహాలు చూస్తూంటే..  ఏ క్షణమైనా నోటిఫికేషన్ వస్తుందన్నట్లుగా చేస్తున్నారు. పథకాలను శరవేగంగా ప్రారంభించేస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చినా కోడ్ అడ్డంకి రాకుండా ఉండటానికి అది  పాత పథకం అని వాదించడానికి అవకాశం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 


అభ్యర్థుల జాబితా ప్రకటిస్తామంటున్న అన్ని పార్టీలు


ఇక అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థులపై కసరత్తు ఓ రేంజ్ లో చేస్తున్నాయి. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఇప్పటికే తుది  లిస్ట్ తో రెడీగా ఉన్నారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇటీవల ఎన్నికల కమిటీ సమావేశాన్ని నిర్వహించింది. అభ్యర్థుల ఎంపికపై చర్చలు జరిపారు. దరఖాస్తులు తీసుకోవాలని నిర్ణయించారు. నిజానికి  కాంగ్రెస్ పార్టీ  నేతలు బ్యాక్ ఎండ్ లో  అభ్యర్థుల జాబితాను ఫైనల్ చేసుకున్నారని చెబుతున్నారు. దరఖాస్తులు అన్నీ ఫార్మలిటీనేనని చెబుతున్నారు. మరో వైపు భారతీయ జనతా పార్టీ కూడా హై అలర్ట్ లో ఉంది. పార్టీ ముఖ్య నేతలందర్నీ.. . హైకమండ్ ఢిల్లీ పిలిపించింది. ఎన్నికలు ముందే వస్తాయని ... ఏం చేయాలో చెప్పి పంపే అవకాశం ఉందని  చెబుతున్నారు. 


రెండు నెలల ముందే ఈసీ షెడ్యూల్ ఇస్తుందా ?


ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు పదవి కాలం జనవరి రెండో వారంతో ముగుస్తుంది.  రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఆరు నెలలకు మందుగా ఎన్నికల ప్రక్రియ ప్రారంభించి నిర్వహించవచ్చు. ఆ ప్రకారం చూసుకుంటే.. ఇప్పుడు ఈసీకి ఎన్నికిల షెడ్యూల్ ఇవ్వడానికి అన్ని రకాల హక్కులు ఉన్నాయి. వాతావరణ పరిస్థితులు.. ఇతర కారణాలను చెప్పి.. ముందే నిర్వహించవచ్చు. ముందే  నిర్వహించినా.. పాత అసెంబ్లీల పదవి కాలం జనవరి వరకూ ఉంటుంది.  కానీ అధికార పార్టీ గెలిస్తే సమస్య ఉండదు..  కానీ ఓడిపోతే మాత్రం ప్రజాదరణ కోల్పోయినందున ముందే  రాజీనామా చేయాల్సి వస్తుంది.  


ప్రస్తుత రాజకీయ పార్టీల సన్నద్ధద చూస్తూంటే .. వచ్చే  నెలలోనే ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని పూర్తి స్థాయిలో నమ్మవచ్చు.