ఆగస్టు 9న ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెళ్లి గడ్డపై లక్షమందితో దండు కట్టి దళిత, గిరిజన దండోరా మోగిస్తామని.. రేవంత్ రెడ్డి చెప్పారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు పథకంపై మాట్లాడారు. 118 నియోజక వర్గాల్లో ఉన్న దళితుల పరిస్థితి ఏంటని ప్రభుత్వన్ని రేవంత్ రెడ్డి నిలదీశారు.

రాష్ట్ర వ్వాప్తంగా కోటి ముప్పై ఐదు లక్షల మంది దళిత, గిరిజనులకు కూడా దళిత బంధు ఇవ్వాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. దళితులను మోసం చేసి ఓట్లను కొల్లగొడతామంటే ఊరుకోమని హెచ్చరించారు. ఆగస్ట్ 9 నుంచి సెప్టెంబర్ 17 వరకు దళిత గిరిజన దండోరా మోగిస్తామని వెల్లడించారు. దళిత, గిరిజనులకు కూడా దళిత బంధు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఉప ఎన్నికలు వచ్చినప్పుడే కేసీఆర్ పథకాలంటూ ప్రజల్లోకి వస్తున్నారని మండిపడ్డారు. అయితే హుజూరాబాద్ ఎన్నికల్లో కేసిఆర్ చేస్తున్న కుట్రను ఎండగడతామని తెలిపారు.

కాంగ్రెస్ జెండా దించకుండా మోసిన వారే నా బంధువులు..

కాంగ్రెస్‌ జెండా దించకుండా మోసిన వారే తన బంధువులని రేవంత్ రెడ్డి చెప్పారు. రాజకీయ ప్రయోజనాల కోసం సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వలేదని, ఏపీలో పార్టీని చంపుకొని ఇచ్చారన్నారు. ధనిక రాష్ట్రంగా కేసీఆర్‌ చేతిలో పెడితే దివాళా తెలంగాణగా మార్చారని ఆరోపించారు.  

ఇంద్రవెళ్లి నుంచే కాంగ్రెస్ పార్టీ బలోపేతం

మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావును సికింద్రాబాద్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా రేవంత్‌రెడ్డి కలిశారు.  అనంతరం చిరాన్‌ పోర్ట్‌ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మంచిర్యాల జిల్లా కాంగ్రెస్‌ పార్టీ సమావేశానికి రేవంత్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మంచిర్యాల జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షురాలు సురేఖతో పాటు పలువురు కాంగ్రెస్‌ నేతలు రేవంత్‌రెడ్డికి స్వాగతం పలికారు. తనకు ప్రేమ్‌సాగర్‌రావుతో ఎలాంటి విభేదాలు లేవని రేవంత్ రెడ్డి అన్నారు.  ప్రేమ్‌ సాగర్‌రావు తనకు సోదరుడి లాంటి వాడని చెప్పారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి నుంచి కాంగ్రెస్‌పార్టీ బలోపేతం కోసం కదంతొక్కుతామని రేవంత్ ప్రకటించారు.

తెలంగాణ దళిత బంధు పథకం పైలెట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఆ నియోజవర్గ పరిధిలోని దళితులతో ప్రగతి భవన్‌లో ఈ నెల 26న అవగాహన సదస్సు జరగనుంది. పథకం అమలు, పర్యవేక్షణ, నిర్వహణ, విజయం సాధించే దిశగా తీసుకోవాల్సిన కార్యాచరణపై సీఎం సదస్సులో మాట్లాడతారు. ఈ అవగాహన సదస్సుకు హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని ప్రతీ గ్రామం, ప్రతీ మున్సిపాలిటీ నుంచి నలుగురు చొప్పున మొత్తం 412 మంది దళిత పురుషులు, మహిళలు హాజ‌రుకానున్నారు. 

Also Read: KCR: ఈటలది చిన్న ముచ్చట.. అయ్యేది లే.. పొయ్యేది లే.. మీరైతే రండి