Telangana News: 2050 నాటికి తెలంగాణ మొత్తం పారిశ్రామిక వృద్ధి జరగాలనే భవిష్యత్తు లక్ష్యంతో మెగా మాస్టర్ పాలసీ రూపొందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణను మూడు క్లస్టర్లుగా విభజించనున్నామని తెలిపారు. ఔటర్‌ రింగ్ రోడ్డు (Outer Ring Road) లోపల ప్రాంతం అర్బన్‌ క్లస్టర్‌గా, ఓఆర్‌ఆర్‌ - ఆర్ఆర్‌ఆర్‌ (Regional Ring Road) మధ్య ప్రాంతాన్ని సెమీ అర్బన్‌ క్లస్టర్‌గా, ఆర్‌ఆర్‌ఆర్‌ అవతలి ప్రాంతాన్ని రూరల్‌ క్లస్టర్‌గా విభజించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్ ఒక్కచోటే పారిశ్రామిక అభివృద్ధి కేంద్రీకృతం కాకుండా.. తెలంగాణలోని అన్ని ప్రాంతాలు హైదరాబాద్ తరహాలోనే అభివృద్ధి చెందాలన్నారు. గ్రామీణ ప్రాంతాలకు పరిశ్రమలు విస్తరించాలనేది తమ లక్ష్యమన్నారు. పారిశ్రామికంగా అన్ని రంగాలు అభివృద్ధి చెందేలా ఫ్రెండ్లీ పాలసీని అమలు చేసేందుకు ఔత్సాహికులు, పారిశ్రామికవేత్తలు సహకరించాలని రేవంత్ రెడ్డి కోరారు. 


రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ఫ్రెండ్లీ పాలసీ 
సెక్రెటేరియట్‌లో భారత పారిశ్రామిక సమాఖ్య (సీఐఐ) ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి శనివారం సమావేశమయ్యారు. తెలంగాణ ప్రాంతంలో 1994 నుంచి 2004 వరకు పరిశ్రమల అభివృద్ధికి అనుసరించిన ఫార్ములా ఒకలా ఉంటే..  2004 నుంచి 2014 వరకు అది మరో మెట్టుకు చేరుకుందన్నారు. రాబోయే రోజుల్లో ఇది నెక్స్ట్ లెవల్ డెవెలప్ మెంట్ కు చేరుకోవాలనే లక్ష్యంతో  ప్రభుత్వం పని చేస్తుందన్నారు. పరిశ్రమల అభివృద్ధికి.. పెట్టుబడులను ఆహ్వానించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ఫ్రెండ్లీ పాలసీని అనుసరిస్తుందన్నారు. పారిశ్రామిక అభివృద్ధి విషయంలో అపోహలు, అనుమానాలకు తావు లేదన్నారు. పారిశ్రామికవేత్తలు తెలంగాణలో పెట్టే ప్రతి పైసా పెట్టుబడికి రక్షణ కల్పిస్తామని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ ప్రజల సంక్షేమం, గ్రామీణ ప్రాంతాల ప్రయోజనాలకే పెద్దపీట వేస్తుందనే ఆలోచనలకు భిన్నంగా కొత్త పాలసీని అనుసరిస్తామని స్పష్టం చేశారు. 


ఫార్మా విలేజీలను డెవెలప్ చేస్తామన్న రేవంత్
ఫార్మాసిటీగా కాకుండా ఫార్మా విలేజీలను డెవెలప్ చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఓఆర్ఆర్ పై 14 రేడియల్ రోడ్లు ఉన్నాయి. వీటికి 12 జాతీయ రహదారుల కనెక్టివిటీ ఉందని.. వీటికి అందుబాటులో ఉండేలా దాదాపు వెయ్యి నుంచి 3 వేల ఎకరాలకో ఫార్మా విలేజీని అభివృద్ధి చేస్తామన్నారు. కాలుష్యం లేకుండా, పరిశ్రమలతో పాటు స్కూల్స్, హాస్పిటల్స్, అన్ని మౌలిక సదుపాయాలుండేలా వీటిని  డెవెలప్ చేస్తామన్నారు.


జహీరాబాద్ లో  ఐటీ, ఫార్మా, హెల్త్ తో పాటు ఫుడ్ ప్రాసెసింగ్, స్పోర్ట్స్,  ఆటోమొబైల్, ఆర్గానిక్ క్లస్టర్లుగా అక్కడ పరిశ్రమల ఏర్పాటు జరగాలని ఆకాంక్సించారు. రక్షణ రంగం, నావికా రంగానికి అవసరమైన పరికరాల తయారీ, ఉత్పత్తికి హైదరాబాద్ లో అపారమైన అవకాశాలున్నాయని, పారిశ్రామికవేత్తలు వీటిపై దృష్టి కేంద్రీకరించాలని అన్నారు. కొత్తగా సోలార్ పవర్ పాలసీని రూపొందిస్తామని, సోలార్ ఎనర్జీ పరిశ్రమలకు తగిన ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. 24 గంటల పాటు తాను ఆఫీసు లేదా క్యాంపు కార్యాలయంలో అందరికీ అందుబాటులో ఉంటానని, తనతో మాట్లాడి నిర్ణయాలు తీసుకోవాలని పారిశ్రామికవేత్తలను, పెట్టుబడిదారులను ఆహ్వానించారు. 


తెలంగాణలో 35 లక్షల నిరుద్యోగులు
రాష్ట్రంలో సుమారు 35 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని, వీరిని తాము భారంగా భావించటం లేదన్నారు. వీరందరినీ పరిశ్రమల అభివృద్ధిలో పాలుపంచుకునే మానవ వనరులుగా భావిస్తున్నామని తెలిపారు. యువతీ యువకులకు స్కిల్స్ నేర్పించేందుకు స్కిల్ యూనివర్సిటీలను నెలకొల్పుతామని అన్నారు. స్కిల్ యూనివర్సిటీల్లో డిగ్రీలు పొందిన యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయని, పోటీ ప్రపంచంలో ఎక్కడైనా నిలదొక్కుకునే సామర్థ్యం వాళ్ల సొంతమవుతుందని అన్నారు.  ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సీఎం  ప్రిన్సిపల్ సెక్రెటరీ శేషాద్రి, ఐటి ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్  రంజన్, సిఎం స్పెషల్ సెక్రెటరీ అజిత్ రెడ్డి, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ప్రతినిధులు పాల్గొన్నారు.