ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు గుడ్‌ న్యూస్. డీఎస్సీ కోసం అవసరమయ్యే టెట్‌ నోటిఫికేషన్‌ను విద్యాశాఖ విడుదల చేసింది. మార్చి 26 నుంచి ఏప్రిల్‌ 16వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు దాఖలు చేసుకోవచ్చు. జూన్‌ 12 టెట్‌ నిర్వహిస్తారు. 


టెట్‌ కు అవసరమైన ఏర్పాట్లు చకచకా పూర్తి చేస్తున్నట్టు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. 2015డిసెంబల్‌ 23న టెట్‌కు సంబంధించిన రెండు సవరణలు చేసింది ప్రభుత్వం. బీఈడీ పూర్తి చేసిన వాళ్లు కూడా ఎస్జీటీకి అర్హమైన పేపర్‌-1 కూడా రాసుకోవచ్చని తెలిపింది. ఉద్యోగం వచ్చిన తర్వాత బ్రిడ్జ్‌ కోర్సు పూర్తి చేయాలని చెప్పింది. అది ఆరునెలలు ఉంటుంది. ఒకసారి టెట్‌లో అర్హత మార్కులు సాధిస్తే అది జీవితాంతం వర్తిస్తుందని కూడా సవరించింది.


ఈ మధ్య జరిగిన శాసన సభ సమావేశాల్లో తెలంగాణ వ్యాప్తంగా 13 వేలకు పైగా ఉపాధ్యాయ ఉద్యోగాలు ఖాళీలు గుర్తించామని వాటిని భర్తీ చేస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. అప్పటి నుంచి ఉద్యోగార్థుల్లో ఆశలు చిగురించాయి. కోచింగ్ సెంటర్‌లు కిటకిటలాడటం మొదలయ్యాయి. ఇప్పుడు టెట్ నోటిఫికేషన్ రావడంతో ప్రిపరేషన్ మరింత ఊపందుకోనుంది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత టెట్‌ నిర్వహించడం ఇది మూడోసారి. 


ఇప్పటి వరకు బీఈడీ చేసిన వాళ్లు ఆరు నుంచి పది తరగతుల వరకు బోధించేందుకు అర్హులగా ఉండే వాళ్లు 2008 నుంచి ఈ విధానం అమల్లోకి వచ్చింది. అందుకే వాళ్లు రెండో పేపర్‌ మాత్రమే రాసేవాళ్లు. కానీ ఈ మధ్య కాలంలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు కూడా బీఈడీ చేసిన వాళ్లు బోధించవచ్చని నిర్ణయించింది. అంటే ఎస్జీటీ పోస్టులకు కూడా వీళ్లు అర్హులని తేల్చింది ప్రభుత్వం. దీనికి ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ అభ్యర్థులు ఆరునెలల బ్రిడ్జి కోర్సు పూర్తి చేయాల్సి ఉంటుంది. అందుకే ఇకపై మొదటి పేపర్‌ కూడా రాసేందుకు బీఈడీ చేసే వాళ్లు అర్హులు అవుతారు. 


ఒకసారి టెట్‌ అర్హత సాధిస్తే ఏడేళ్ల వరకు అది చెల్లుబాటు అయ్యేది. ఆ తర్వాత మళ్లీ పరీక్ష రాయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు టెట్‌ను జీవితాంతం విలువ ఉండేలా నిబంధనలు మార్చారు. 2011 ఫిబ్రవరి 11 నుంచి ఈ మార్పులు అమల్లోకి వచ్చాయి. అప్పటి నుంచి జరిగిన టెట్‌లో అర్హత సాధించిన వాళ్లంతా జీవితాంతం డీఎస్సీ రాసుకోవడానికి వాళ్ల వాళ్ల రిజర్వేషన్ల బట్టి అర్హులు అవుతారు. 


టెట్‌ 150 మార్కుల పరీక్ష. టెట్ రాసిన వాళ్లు ఓపెన్ కేటగిరీ విద్యార్థులు 90 మార్కులు అంటే అరవై శాతం, బీసీలు 75 మార్కులు అంటే యాభై శాతం, ఎస్సీఎస్టీ, దివ్యాంగులు 60 మార్కులు అంటే నలభై శాతం వస్తే చాలు. ఈ మార్కులు డీఎస్సీలో ఇరవై శాతం వెయిటేజ్‌ ఇచ్చి ర్యాంకులు కేటాయిస్తారు.