Prajapalana Applications On Road: తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలు కోసం స్వీకరించిన ప్రజాపాలన దరఖాస్తులు రోడ్డుపాలయ్యాయి.  హైదరాబాద్‌లోని బాలానగర్‌ ఫ్లైఓవర్‌పై... ర్యాపిడో బైక్‌పై అప్లికేషన్లు తీసుకెళ్తుండగా.. దరఖాస్తులన్నీ కిందపడి గాలికి ఎగిరిపోయాయి. రోడ్లుపై ప్రజాపాలన దరఖాస్తులు  కనిపించడంతో ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. అవన్నీ హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌కు చెందిన ప్రజాపాలన దరఖాస్తులుగా సమాచారం. బాలానగర్‌ ఫ్లైఓవర్‌పై చిందరవందరగా  పడి ఉండటం చూసి... వాహనదారులు అవాక్కయ్యారు.  పేదలు.. తమకు మంచి జరగుతుందన్నఆతృతతో ఆరు గ్యారెంటీల కోసం పెట్టుకున్న దరఖాస్తులను రోడ్డుపాలు  చేస్తున్నారని... ఒక్కటి మిస్సైనా.. అర్హులకు అన్యాయం జరిగినట్టే అని ఆరోపిస్తున్నారు.


అసలు ఏం జరిగిందంటే...? 


ప్రజాపాలన దరఖాస్తులను కంప్యూటరీకరించే పనిని కూకట్‌పల్లిలోని ప్రైవేట్‌ ఏజెన్సీకి అప్పగించారు ప్రభుత్వ అధికారులు. దీంతో ధరఖాస్తులన్నీ ప్రైవేట్‌ ఏజెన్సీకి  తరలిస్తున్నారు. ఈ క్రమంలో... బాలానగర్‌ ఫ్లైఓవర్‌పై ఓ యువకుడు AP39HH 6455 నెంబర్‌ గల స్కూటీపై అట్టపెట్టెలో వేలాది దరఖాస్తులను కుక్కి తీసుకెళ్తున్నాడు. నిన్న  (సోమవారం) సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో అట్టపెట్టె తాడు తెగిపోవడంతో... అందులోని కాగితాలన్నీ రోడ్డుపై గాలికి కొట్టుకుపోయాయి. బైక్‌ నడుపుతున్న  యువకుడి ముందు, వెనక వెళ్తున్న వాహనదారులు ఒక్కసారిగా వాహనాలు ఆపి... ర్యాపిడో బైక్‌పై వెళ్తున్న యువకుడికి విషయం చెప్పారు. అప్పటికే ప్రజాపాలన  దరఖాస్తులన్నీ రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. ఆ అప్టికేషన్లన్నీ ఏరి.. మళ్లీ అట్టపట్టెలో పెట్టారు అక్కడున్నవారంతా. ఆ దరఖాస్తులను చూస్తే... అవన్నీ  హయత్‌నగర్‌కు చెందిన ప్రజాపాలన దరఖాస్తులుగా గుర్తించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో జాగ్రత్తగా కంప్యూటరీకరించాల్సిన దరఖాస్తులను... ప్రైవేట్‌ ఏజెన్సీకి అప్పజెప్పిన  అధికారి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు.


తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గత నెల (డిసెంబర్‌) 28వ తేదీ నుంచి ఈనెల (జనవరి) 6వ తేదీ వరకు కాంగ్రెస్‌ సర్కారు ఆరు గ్యారెంటీల కోసం కోట్లాది మంది నిరుపేదల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. ప్రజలు పెద్ద సంఖ్యలో క్యూ లైన్లలో నిలబడి మరీ దరఖాస్తులు సమర్పించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 24 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తుల్లోని వివరాలన్నింటినీ ఈనెల (జనవరి) 17వ తేదీలోపు కంప్యూటరీకరిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనూ అధికారులు ఆ ప్రక్రియ చేపట్టారు. జీహెచ్‌ఎంసీ (GHMC) వ్యాప్తంగా 3,500 మంది ఆపరేటర్లకు శిక్షణ ఇచ్చామని, ఎక్కడికక్కడ జోనల్‌, సర్కిల్‌ కార్యాలయాల్లో కంప్యూటరీకరిస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. మరి... ప్రభుత్వ కార్యాలయాల్లో జరగాల్సిన కంప్యూటరైజేషన్‌ను ప్రైవేట్‌ ఏజెన్సీకి ఎందుకు ఇచ్చినట్టు..? అన్నది తేలాల్సి ఉంది.


గతంలో కూకట్‌పల్లి జోనల్‌ పరిధిలో డిప్యూటీ కమిషనర్‌గా పనిచేసిన రవీందర్‌కుమార్‌ కొంతకాలం కిందట ఎల్బీనగర్‌ జోన్‌కు బదిలీ అయ్యారు. ప్రస్తుతం హయత్‌నగర్‌ సర్కిల్‌ డీసీగా వ్యవహరిస్తున్నారు. తన పరిధిలోని ప్రజాపాలన దరఖాస్తు ఫారాలను తన కార్యాలయంలోనే కంప్యూటరీకరించాల్సి ఉంది. కానీ... ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో వాటిని పెట్టి చేతులు దులుపుకోవాలని చూశారు. ఇందులో భాగంగా కూకట్‌పల్లి సంగీత్‌నగర్‌ దగ్గర ఒక ప్రైవేటు ఏజెన్సీతో ఒప్పందం కుదుర్చుకొన్నట్టు సమాచారం. అంతేకాదు.. చాలా జాగ్రతగా అధికారులు గానీ, సిబ్బందితో గానీ పంపాల్సిన ప్రజాపాలన ఫారాలను... చాలా నిర్లక్ష్యంగా ర్యాపిడో బైక్‌ బుక్‌ చేసి తరలిస్తుండటం వివాదాస్పదమైంది. 


అట్టపెట్టెలో ప్రజాపాలన దరఖాస్తు కుక్కి... ఒక ర్యాపిడీ బైక్‌ బుక్‌ చేసి... కూకట్‌పల్లిలోని ప్రైవేట్‌ ఏజెన్సీకి తీసుకెళ్తుండగా... బాలానగర్‌ ఫ్లైఓవర్‌పై ఈ సంఘటన జరిగింది. అవి ప్రజాపాలన దరఖాస్తులని ర్యాపిడో బైకిస్టుకు కూడా తెలీదు. రోడ్డుపై పడ్డ కొన్ని దరఖాస్తులను అక్కడున్న వాహనదారులు ఏరి తీసుకొచ్చి ఇచ్చారు గానీ... ఎన్ని దరఖాస్తులు గాలికి కొట్టుకుపోయాయో మాత్రం తెలియడం లేదు. కోటి ఆశలతో.. ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందుతాయన్న ఆతృతతో.. ఎంతో కష్టపడి దరఖాస్తు చేసుకున్న నిరుపేదల సంగతి ఇప్పుడు అయోమయంగా మారింది. హయత్‌నగర్‌కు చెందిన వారిలో ఎవరి దరఖాస్తు మిస్సయిందో ఏమో తెలియాల్సి ఉంది.