కేసీఆర్‌ తన ఫామ్ హౌస్‌లో తాంత్రిక పూజలు చేస్తున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు చేసిన విమర్శలపై కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆయన్ని అలా వదిలేయకండీరా బాబు అంటూ సెటైర్లు పేల్చారు. ఎర్రగడ్డలో బెడ్‌ రెడీగా ఉందని జాయిన్ చేయాలంటూ ట్వీట్ చేశారు. 


బీజేపీ, బీఆర్‌ఎస్ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. మునుగోడు ఉపఎన్నికల వేళ ఇది తారాస్థాయికి చేరింది. ఉదయం ట్విట్టర్ వేదికగా కేసీఆర్‌పై బండి సంజయ్‌ హాట్ కామెంట్స్ చేశారు. ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌ తాంత్రిక పూజలు చేస్తున్నారని ఆరోపిస్తే దానికి మంత్రి కేటీఆర్‌ గట్టిగా సమాధానం ఇచ్చారు. "ఈ లవంగం గారిని ఇలాగే వదిలెయ్యకండి రా బీజేపీ బాబులు. పిచ్చి ముదిరి తొందర్లో కరవడం మొదలు పెడతారేమో; మతి లేని మాటలతో సమాజానికి ప్రమాదకరంగా తయారయ్యారు. ఎర్రగడ్డలో బెడ్ తయారుగ ఉంది. తొందరగా తీసుకెళ్లి వైద్యం చేయించుకోండి" అని ట్విట్టర్‌లో పోస్టు చేశారు. 






బండి సంజయ్ ఏమన్నారంటే...


సీఎం కేసీఆర్ క్షుద్రపూజలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. తాంత్రికుడి సలహా మేరకే టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్ గా మార్చారన్నారు. తాంత్రికుడి సూచనతోనే సచివాలయానికి వెళ్లడం లేదని, ఫాంహౌజ్ లో నిత్యం నల్ల పిల్లితో క్షుద్ర పూజలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయం తనకు ఓ స్వామిజీ తెలిపారని కేసీఆర్ చేస్తోన్న పనులు, వాస్తవాలన్నీ రాష్ట్ర ప్రజలందరికీ  తెలియాలనే ఉద్దేశంతోనే ఈ విషయం చెబుతున్నానన్నారు. స్వామిజీలు, వేద పండితులతోపాటు సమాజ హితం కోరే వాళ్లంతా కేసీఆర్ క్షుద్ర పూజల నుంచి తెలంగాణను కాపాడాలని వేడుకుంటున్నట్లు తెలిపారు.  బీజేపీ ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్, తమిళనాడు సహ ఇంఛార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి, శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్ తో కలిసి బండి సంజయ్ సమక్షంలో మలక్ పేట నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు బీజేపీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు బండి సంజయ్. 


రాజ్‌గోపాల్‌రెడ్డిని బ్లాక్ చేసిన కేటీఆర్!


మొన్న కేటీఆర్‌ తనపై చేసిన కామెంట్స్‌కు రాజగోపాల్‌రెడ్డి స్పందించారు. కాంట్రాక్ట్‌ కోసమే బీజేపీలో చేరారని చేసిన ఆరోపణలపై స్పందించారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన రాజగోపాల్‌రెడ్డి... కేటీఆర్‌కు ట్యాగ్ చేసేందుకు ప్రయత్నించారు. అయితే రాజగోపాల్‌రెడ్డిని కేటీఆర్ బ్లాక్ చేసిన సంగతి బయటపడింది. వెంటనే ఆ స్క్రీన్‌షాట్‌ను సోషల్ మీడియాలో పెట్టి మరింత గట్టి విమర్శలు చేశారు. ఆరోపణలు చేసి పారిపోవడం కాదని విమర్శించారు.