Bandi Sanjay : సీఎం కేసీఆర్ క్షుద్రపూజలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. తాంత్రికుడి సలహా మేరకే టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్ గా మార్చారన్నారు. తాంత్రికుడి సూచనతోనే సచివాలయానికి వెళ్లడం లేదని, ఫాంహౌజ్ లో నిత్యం నల్ల పిల్లితో క్షుద్ర పూజలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయం తనకు ఓ స్వామిజీ తెలిపారని కేసీఆర్ చేస్తోన్న పనులు, వాస్తవాలన్నీ రాష్ట్ర ప్రజలందరికీ  తెలియాలనే ఉద్దేశంతోనే ఈ విషయం చెబుతున్నానన్నారు. స్వామిజీలు, వేద పండితులతోపాటు సమాజ హితం కోరే వాళ్లంతా కేసీఆర్ క్షుద్ర పూజల నుంచి తెలంగాణను కాపాడాలని వేడుకుంటున్నట్లు తెలిపారు.  బీజేపీ ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్, తమిళనాడు సహ ఇంఛార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి, శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్ తో కలిసి బండి సంజయ్ సమక్షంలో మలక్ పేట నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు బీజేపీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు బండి సంజయ్. 


మునుగోడులో బీజేపీ విజయం ఖాయం 


 "మునుగోడు ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు బీజేపీ అధిష్టానం ఖరారు చేసిందని బండి సంజయ్ తెలిపారు. ఎమ్మెల్యే పదవీ కాలం ఉన్నప్పటికీ మునుగోడు అభివృద్ధి కోసం, కేసీఆర్ కుటుంబ అవినీతి పాలనకు వ్యతిరేకంగా పదవికి రాజీనామా చేసి బీజేపీ అభ్యర్థిగా రాజగోపాల్ రెడ్డి పోటీ చేస్తున్నారని గుర్తుచేశారు. మునుగోడు ప్రజల ఆశీర్వాదంతో బీజేపీ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలవడం ఖాయమన్నారు. "- బండి సంజయ్ 


తాంత్రికుడి సూచనలో బీఆర్ఎస్ 


"ఈరోజు ఉదయమే ఓ స్వామిజీ కలిసిండు. సర్వేజనా సుఖినోభవ అనే ధర్మాన్ని నమ్ముకుని మంచి జరగాలని పూజలు చేసే వ్యక్తి ఆయన. మొన్న ఆయన దగ్గరకు ఓ తాంత్రికుడు వచ్చి అసలు విషయం చెప్పిండట. కేసీఆర్ స్వలాభం కోసం ఎంతకైనా దిగజారుతాడని చెప్పిండు. ఏమైంది స్వామీజీ అని అడిగిన. ఆయనేమన్నడంటే టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా ఎందుకు మార్చిండో తెలుసా? ఓ తాంత్రికుడి సూచనల మేరకే కేసీఆర్ టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చిండని చెప్పిండు. దానికి ముహూర్తం పెట్టింది కూడా ఆ తాంత్రికుడే అని చెప్పారు. కేసీఆర్ కు ప్రజల మీద, దేవుడి మీద నమ్మకం లేదు. తాంత్రికుడిని నమ్ముకుని దయ్యాల పూజలు, క్షుద్ర పూజలు చేస్తున్నారు. సీఎం అయిన కొన్నాళ్ల తరువాత ఇబ్బందులొస్తే తాంత్రికుడి సూచనతో అసలు సచివాలయానికే పోలేదు. అయినా జీహెచ్ఎంసీ, దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికల్లో ఓడిపోయిండు. మళ్లీ తాంత్రికుడి వద్దకు పోతే సచివాలయ వైబ్రేషన్స్ ఇంకా నీ మీద పడుతున్నయని చెప్పిండట. ఆయన సూచనతో సచివాలయాన్ని కూల్చేసి ప్రజల సొమ్ముతో కొత్త సచివాలయాన్ని కడుతున్నారు.  


నల్ల పిల్లితో పూజలు 


కేసీఆర్ ఫాంహౌజ్ లో సకుటుంబ సమేతంగా తాంత్రిక పూజలు చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. ఆ పూజల అనంతరం వాటిని కాళేశ్వరం నీళ్లలో కలిపారన్నారు. పైకి మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించేందుకు వెళుతున్నానని చెప్తున్నారని విమర్శించారు. ప్రతి 3 నెలలకోసారి నల్ల పిల్లితో పూజలు చేస్తున్నారని ఆరోపించారు. ఫాంహౌజ్ లో ఒక యువకుడు అనుమానాస్పదంగా చనిపోయారన్నారు. ఆ కేసు ఏమైందో కూడా తెలియదని విమర్శించారు. క్షుద్ర పూజలు చేసినంత మాత్రాన మంచి జరుగుతుందా? తాంత్రికుడి మాటలు నమ్మి పూజలు చేసి డబ్బులు పంచినంత మాత్రాన గెలుస్తాననుకోవడం మూర్ఖత్వం అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ భూములను కబ్జా చేసి అవినీతి, అక్రమాలు చేసి కోట్లు సంపాదిస్తుంటే ఈడీ, సీబీఐ చూస్తూ ఊరుకుంటదా? అని ప్రశ్నించారు. లిక్కర్ స్కాంలో, చీకోటి పత్తాల స్కాంలో, డ్రగ్స్ కేసులో తన కుటుంబానికి సంబంధం లేదని కేసీఆర్ ఎందుకు చెప్పలేకపోతున్నారన్నారు. 2014 ఎన్నికల్లో సీఎం, మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సమర్పించిన అఫిడవిట్లలో ఉన్న ఆస్తులెన్ని? ఇప్పుడు సంపాదించినవన్నో దమ్ముంటే బయటపెట్టాలని బండి సంజయ్ సవాల్ చేశారు.