Telangana minister Jupally Krishna Rao | హైదరాబాద్ లోని బాలానగర్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో కల్తీ కల్లు ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆ ఘటనకు బాధ్యులైన ఎక్సైజ్ అధికారిని సస్పెండ్ చేయడంతో పాటు కల్లు దుకాణాలను సీజ్ చేసినట్లు తెలిపారు. కాల్వ గట్లపై, ప్రభుత్వ స్థలాల్లో, తాటి చెట్లను నాటుతామని గౌడ సోదరులకు శుభవార్త చెప్పారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తో కలిసి వికారాబాద్ పట్టణంలో నూతనంగా నిర్మించిన ఎక్సైజ్ స్టేషన్ భవనాన్ని ప్రొహిబీషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి (బీజేపీ), చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ దశరథ్ పాల్గొన్నారు.
కల్తీ కల్లు ఘటనలకు చెక్ పెడతాం
మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ. బాలానగర్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో జరిగిన కల్తీ కేసు నిందితులను ఎక్సైజ్ శాఖ అధికారులు వెంటనే అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. కల్తీ కల్లు ఘటనలను ఉపేక్షించేది లేదు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఇకనైనా వీటికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. కల్తీ కల్లు ఘటనలు అరికట్టడానికి శాశ్వత పరిష్కారం దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
గౌడ సోదరులు, కల్లు గీత కార్మికుల సంక్షేమం, జీవన ఉపాధి కోసం పెద్ద ఎత్తున ఈత, తాటి చెట్లను నాటే కార్యక్రమం చేపడుతాం. తెలంగాణలో ప్రభుత్వ స్థలాల్లో, కాల్వ గట్లపై ఈత, తాటి చెట్లను నాటుతాం. ఇందుకోసం సీఎం రేవంత్ రెడ్డితో సంప్రదించి ఎక్సైజ్ శాఖకు అదనపు నిధులు కేటాయించాలని కోరతాం. ఈత, తాటి ఉప ఉత్పత్తులైన నీరా లాంటి వాటి విక్రయాలకు ప్రోత్సాహాన్ని అందిస్తాం.
డ్రగ్స్పై ఉక్కుపాదం మోపుతామన్న మంత్రి జూపల్లి
మాదక ద్రవ్యాలు జీవితానికి, సమాజానికి చాలా హానికరం. మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతాం. త్వరలోనే రాష్ట్రస్థాయి సమీక్ష నిర్వహిస్తాం. నిందితులపై కేసులు నమోదు చేసి, రిమాండ్ కు పంపి చేతులు దులుపుకుంటే సరిపోదు. ఆయా కేసుల్లో పకడ్బందీగా విచారణ చేపట్టి నిందితులకు శిక్ష పడేలా చేయాలి. మాదక ద్రవ్యాల ఉత్పత్తి, సరఫరా, రవాణాపై ఎక్సైజ్ శాఖ, పోలీస్ అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలి. డ్రగ్స్, మత్తు పదార్థాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి?, దాని వెనుక ఎవరు ఉన్నారు, మూలాలు ఎక్కడ ఉన్నాయో అన్వేషిస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఈ విషయంలో ఎక్సైజ్ శాఖ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఉంటుంది
మాదక ద్రవ్యాలు, కల్తీ లాంటి కేసుల్లో నిందితులకు శిక్షలు పడకపోవడానికి కారణం ఏంటి. దీనికి అధికారులే బాధ్యత వహించాలి. ఎక్సైజ్ శాఖ కేసుల్లో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చూస్తూ సహించేది లేదు. వికారాబాద్ జిల్లాను పర్యాటకం ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నాం. అనంతగిరి ప్రాంతంలో అద్బుతమైన అటవీ సంపద ఉంది. నేచర్ వెల్ నెస్ సెంటర్ ను అద్భుతంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం చర్యలు చేపడుతుందని’ పేర్కొన్నారు.