వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై నేడు విచారణ జరిగింది. తనపై తీవ్రమైన చర్యలు తీసుకోకుండా సీబీఐని ఆదేశించాలని ఎంపీ అవినాశ్ రెడ్డి ఈ పిటిషన్ లో కోరారు. కోర్టులో విచారణ సందర్భంగా అవినాష్ రెడ్డిని విచారణ చేసి రికార్డ్ చేసిన ఆడియోలు, వీడియోలను హార్డ్ డిస్క్ లో కోర్ట్ ముందు సీబీఐ అధికారులు ఉంచారు. దాదాపు 10 డాక్యుమెంట్లు, 35 సాక్షుల వాంగ్మూలాలు, కొన్ని ఫోటోలను సమర్పించారు. హత్యా సమయంలో సాక్ష్యాల ధ్వంసంలో అవినాష్ రెడ్డి పాత్ర ఉందని సీబీఐ అధికారులు కోర్టుకు తెలిపారు. తీవ్ర చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు ఇవ్వవద్దని సీబీఐ అధికారులు కోర్టును కోరారు. అయితే తీర్పును రిజర్వ్‌ చేసిన ధర్మాసనం, తమ తీర్పు వెల్లడించేవరకు అవినాష్‌ రెడ్డిని అరెస్ట్‌ చేయవద్దని సీబీఐని ఆదేశించింది.


గత విచారణలో ఏం జరిగిందంటే..


వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తనను అరెస్ట్ చేయవద్దంటూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై గత విచారణలో భాగంగా సీబీఐ కీలక విషయాలను వెల్లడించింది. ప్రస్తుతం టెక్నికల్‌గా వైఎస్ ఆవినాష్ రెడ్డి సాక్షిగానే ఉన్నారని సీబీఐ తెలిపింది. అవసరం అయితే అదుపులోకి తీసుకుంటామని గత విచారణ సందర్భంగా న్యాయమూర్తికి తెలిపింది. ఇప్పటికే మూడు సార్లు అవినాష్ రెడ్డిని ప్రశ్నించామని ప్రతీ సారి వీడియో రికార్డ్ చేశామని సీబీఐ అధికారులు న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. ఆడియో, వీడియో రికార్డుల హార్డ్ డిస్క్‌ను  సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌ హైకోర్టుకు తెచ్చారు. హార్డ్‌ డిస్క్‌, కేసు ఫైల్ ఇప్పుడే ఇచ్చేందుకు తాము సిద్ధమని తెలిపారు. 


వైఎస్ అవినాష్ విచారణ మొత్తాన్ని రికార్డ్ చేశామన్న సీబీఐ                         


వైఎస్ వివేకా హత్య కేసులో అవినాష్‌ రెడ్డికి సంబందించిన  వివరాలు, హార్డ్ డిస్క్‌ను సోమవారం (మార్చి 13) సీల్డ్ కవర్‌లో ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. సోమవారం వరకు అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని అవినాష్‌ న్యాయవాది ఈ సందర్భంగా కోరారు. ఈ సందర్బంగా అవినాష్‌రెడ్డి.. సాక్షా? నిందితుడా? అని సీబీఐని హైకోర్టు ప్రశ్నించింది. అవినాష్‌ రెడ్డికి సీఆర్‌పీసీ 160 నోటీసు ఇచ్చామని.. అవసరమైతే అవినాష్‌ రెడ్డి, భాస్కర్‌ రెడ్డిని అదుపులోకి తీసుకుంటామని తెలిపింది. దీంతో సోమవారం వరకు అవినాష్‌ను అరెస్టు చేయవద్దని సీబీఐకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అవసరమైతే మంగళవారం మరోసారి అవినాష్‌ విచారణకు హాజరవుతారని హైకోర్టు తెలిపింది. 


విచారణ సోమవారానికి (మార్చి 13) వాయిదా


అయితే చెప్పింది చెప్పినట్లు వాంగ్మూలం చేస్తున్నారన్న నమ్మకం లేదని.. అవినాష్‌ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. విచారణ వీడియో రికార్డింగ్‌ చేస్తున్నామని  సీబీఐ తరఫు లాయర్ స్పష్టం చేశారు. వీడియో రికార్డింగ్‌ ఏ దశలో ఉందో తెలపాలని.. కేసుకు సంబంధించిన పూర్తి ఫైల్‌ను సోమవారం సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. పిటిషన్‌లో తన పేరు ప్రస్తావించినందున తన వాదనలు కూడా వినాలని సునీత కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.