వివేక హత్య కేసులో కీలక పరిణామం జరిగింది. ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ను రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది. మే ఐదు లోపు సీబీఐ కోర్టు ముందు లొంగిపోవాలని ఆదేశాలు ఇచ్చింది. జులై 1న దర్యాప్తు పూర్తి చేసి గంగిరెడ్డికి బెయిల్ మంజూరు చేయాలని సిబిఐ కోర్టుకు హైకోర్టు ఆదేశించింది.


ఈ బెయిల్ రద్దు రెండు నెలలు మాత్రమే వర్తిస్తుందని హైకోర్టు చెప్పింది. ఈ రెండు నెలల్లో దర్యాప్తు పూర్తి చేయాలని ఆదేశించింది. జూన్ 30 వరకు మాత్రమే గంగిరెడ్డి బెయిల్ రద్దు పరిమితి అని తేల్చి చెప్పింది. జులై 1న గంగిరెడ్డికి బెయిల్ మంజూరు చేయాలని సీబీఐ కోర్టును ఆదేశించింది. లక్షన్నర షూరిటీతో బెయిల్ ఇవ్వాలని స్పష్టంగా వివరించింది. 


2019మార్చి 15న హత్య జరిగింది. అనంతరం ఆయన్ని సిట్ అధికారులు అరెస్టు చేశారు. అయితే ఆరు నెలల్లోపు ఛార్జ్‌షీట్ దాఖలు చేయని కారణంగా గంగిరెడ్డి 2019 అక్టోబర్‌లో డిఫాల్ట్ బెయిల్ పొందారు.  ఈ బెయిల్‌ను  పులివెందులకోర్టు మంజూరు చేసింది. 


తర్వాత కేసు టేకప్ చేసిన సీబీఐ గంగిరెడ్డి బెయిల్ రద్దు కోసం ఎంతగానో ప్రయత్నిస్తోంది. గంగిరెడ్డి ఏ1గా ఉన్నాడని కేసులో ఆయనదే ప్రధాన పాత్ర అని  2021లో సిబిఐ చార్జిషీట్ కూడా వేసింది. చాలా కీలకమైన నిందితుడిగా ఉన్న గంగిరెడ్డి బయట ఉంటే కేసు జాప్యమవుతుందని... సాక్షులు కూడా ప్రభావితం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాదించింది. 


ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై వాదనలు బుధవారమే పూర్తైనా తీర్పును గురువారానికి వాయిదా వేస్తున్నట్టు కోర్టు తెలిపింది. వివేక కేసులో గంగిరెడ్డి కీలకమైన వ్యక్తి అని ఆయన బెయిల్ రద్దు  చేయాలని సీబీఐ కోరింది. ఆయన సాక్షులను ప్రభావితం చేస్తున్నారని వాదించింది. అసలు హత్యకు కుట్ర చేసిందే ఆయనని విన్నవించుకుంది.  


వివేక వద్ద డ్రైవర్‌గా పని చేసిన తాను హత్య చేయలేనని... 40 కోట్లు ఇస్తానంటూ దస్తగిరి వాంగ్మూలంలో చెప్పినట్టు సీబీఐ తెలిపింది. డీఫాల్డ్ బెయిల్‌ ను మెరిట్ ఆధారంగా రద్దు చేయాలని సునీత వాదించారు. 


అన్ని వర్గాల వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోనుందో మరికాసేపట్లో తేలనుంది. ఇప్పటికే గంగిరెడ్డి బెయిల్ రద్దు విషయంలో చాలా కోర్టుల్లో సీబీఐకి ఎదురు దెబ్బ తగిలింది. ఇదే విషయాన్ని కోర్టు దృష్టికి గంగిరెడ్డి తరఫున న్యాయవాదులు తీసుకెళ్లారు. ఈ హత్యతో గంగిరెడ్డికి సంబంధం లేదని చెప్పారు.  ముగ్గురు వాదనలు విన్న హైకోర్టు షరతులతో గంగిరెడ్డి బెయిల్ రద్దు చేసింది. 


అవినాష్ పిటిషన్‌పై ఏం చేస్తారో?


ఇప్పటికే ఈ కేసులో ముందస్తు బెయిల్‌ కోసం అవినాష్ రెడ్డి కొన్ని వారాల నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. అది అనేకరకాలైన మలుపులు తిరిగి చివరకు తెలంగాణ హైకోర్టుకు వచ్చింది. మూడు రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ పిటిషన్ విచారణ ఈ సాయంత్రం 3.30కు జరగనుంది. మంగళవారమే దీన్ని విచారించాల్సి ఉన్నప్పటికీ సుప్రీంకోర్టును నుంచి లిఖితపూర్వక ఆదేశాలు లాదేని బుధవారానికి వాయిదా పడింది. అయితే బుధవారం నాడు ఈ పిటిషన్ లిస్ట్ కానుందను గురువారానికి వాయిదా వేశారు. ఇవాళ 3.30 కి విచారణ చేపడతామని కోర్టు సమాచారం ఇచ్చింది.