Telangana News Today | హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా "ఫ్యూచర్ సిటీ"ని ఏర్పాటు చేస్తోంది. దీని అభివృద్ధి చర్యలలో భాగంగా ఏకంగా 1000 ఎకరాల్లో ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్ సిటీ (E-City)ని అభివృద్ధి చేయనున్నట్లు తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. ఎలక్ట్రానిక్స్ మానుఫ్యాక్చరింగ్ హబ్గా రాష్ట్రాన్ని మార్చాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుంది. ఇందులో భాగంగా ఎలక్ట్రానిక్ సిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. ఫార్మా సిటీతో పాటు స్కిల్ యూనివర్సిటీ సైతం రాష్ట్ర ప్రభుత్వం డెవలప్ చేస్తోంది.
ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు
తెలంగాణలో రూ.300 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు సయుక్తంగా ముందుకొచ్చిన టెలికాం ఉత్పత్తుల సంస్థలు సిరా నెట్ వర్క్స్(తైవాన్), ఎల్ సీజీసీ రెజల్యూట్ గ్రూప్ (తెలంగాణ) ప్రతినిధులతో మంత్రి శ్రీధర్ బాబు రాష్ట్ర సచివాలయంలో ఇటీవల సమావేశమయ్యారు. ఎలక్ట్రానిక్ పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను శ్రీధర్ బాబు వారికి వివరించారు. ఎలక్ట్రానిక్ తరహ పరిశ్రమలు ఏర్పాటులో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్న పారిశ్రామికవేత్తలకు ఇబ్బందులు కలగకుండా సంబంధిత అధికారులతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తామన్నారు.
ఆ పారిశ్రామికవేత్తలకు మరిన్ని ప్రోత్సాహకాలు
రాష్ట్రంలోని టైర్ -2, టైర్ -3 నగరాలు, పట్టణాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తామని శ్రీధర్ బాబు చెప్పారు. ఆయా ప్రాంతాల్లో పారిశ్రామిక వేత్తల అవసరాలకు అనుగుణంగా వారికి అవసరమైన మౌలిక సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యయ్యేందుకు ముందుకొచ్చిన సిరా నెట్ వర్క్స్, ఎల్ సీజీసీ రెజల్యూట్ గ్రూప్ ప్రతినిధులకు మంత్రి శ్రీధర్ బాబు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున ప్రోత్సహకాలతో పాటు అన్ని రకాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
సిరా నెట్ వర్క్స్, ఎల్ సీజీసీ రెజల్యూట్ గ్రూప్ సంయుక్తంగా పెట్టుబడులు
సుమారు 10 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ఈ పరిశ్రమ ద్వారా 2500 మంది యువతకు ఉద్యోగాలు వస్తాయి. ఇక్కడ మల్టీ లేయర్ నెట్వర్కింగ్ సొల్యూషన్స్, 5జీ నెట్ వర్క్స్, సర్వర్స్ తదితర టెలికాం ఉత్పత్తులను తయారు చేస్తారని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఈ పెట్టుబడితో ఇండియా, తైవాన్ దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రెండు సంస్థల ప్రతినిధులతో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్న సమావేశంలో టీ ఫైబర్ ఎండీ వేణు ప్రసాద్, టీజీఐసీసీ సీఈవో మధుసూదన్, సిరా నెట్వర్క్స్ ప్రతినిధులు చుయాన్, జాయ్ భట్టాచార్య, డౌగియాస్, ఎల్ సీజీసీ రెజల్యూట్ గ్రూప్ ప్రతినిధులు రణ్విందర్ సింగ్, గీతాంజలి సభర్వాల్ తదితరులు పాల్గొన్నారు.