హైదరాబాద్: భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సుస్థిరాభివృద్దే లక్ష్యంగా జపాన్ లోని "కితాక్యూషూ సిటీ" స్ఫూర్తితో తెలంగాణ (Telangana)లో 80 ఎకరాల్లో ఎకో టౌన్ (Eco Town)ను అభివృద్ధి చేయనున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Sridhar Babu) ప్రకటించారు. తెలంగాణ, కితాక్యూషూ నగరం మధ్య కుదిరిన ఒప్పందం ఇందుకు మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. టీహబ్ లో "ఫ్రం కితాక్యూషూ టూ తెలంగాణ: కేటలైసింగ్ సస్టైనబుల్ ఇండస్ట్రియల్ గ్రోత్ (From Kitakyushu to Telangana: Catalysing Sustainable Industrial Growth)" అనే అంశంపై సోమవారం రాష్ట్ర ప్రభుత్వం, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ(CIII) సంయుక్తంగా ఏర్పాటు చేసిన సదస్సుకు మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
మరిన్ని కంపెనీల పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సాహం"తెలంగాణ రైజింగ్ 2047" అనే లక్ష్యంతో అంతర్జాతీయ భాగస్వామ్యాల ద్వారా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో గ్లోబల్ లీడర్ గా మార్చాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం సంకల్పం. ఏడాదిన్నరలో రాష్ట్రానికి సుమారు రూ. 3 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేసింది. మైక్రోసాఫ్ట్, అమెజాన్ లాంటి అంతర్జాతీయ స్థాయి కంపెనీలు హైదరాబాద్ లో తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. జపాన్ కంపెనీలు తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టేలా ప్రత్యేకంగా ప్రోత్సహిస్తున్నాం. ఇప్పటికే తెలంగాణకు చెందిన 50 మంది యువతకు జపాన్ లో ఉపాధి అవకాశాలు లభించాయి. మరికొందరికి ఉద్యోగాలు దక్కేలా టాంకాం లాంటి ప్రభుత్వ సంస్థల ద్వారా జపనీస్ భాషను నేర్పిస్తాం. భవిష్యత్తులో నెట్ జీరో లక్ష్యాలు, సర్క్యులర్ ఎకానమీ, రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్, డిజిటల్ ఇన్నోవేషన్, క్లీన్ టెక్నాలజీస్ తదితర అంశాల్లో జపాన్ లోని కితాక్యూషూ నగరంతో కలిసి మా ప్రభుత్వం పని చేస్తుందని’ శ్రీధర్ బాబు అన్నారు.
పర్యావరణహితంగా ఫ్యూచర్ సిటీతెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయనున్న ఫ్యూచర్ సిటీ (Furure City)ని పర్యావరణహితంగా తీర్చి దిద్దేందుకు ఇండస్ట్రియల్ జోన్స్ ఏర్పాటు, అత్యాధునిక వాటర్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్, జీరో వేస్ట్ డిజైన్ పద్ధతులకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. తెలంగాణ, కితాక్యూషూ నగరం మధ్య సత్సంబంధాలు మరింత పెరిగేలా హైదరాబాద్ నుంచి నేరుగా విమాన సర్వీసులను నడిపేందుకు అవకాశాలపై అధ్యయనం చేయిస్తామన్నారు.
రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అనుకూలమైన పరిస్థితులకు వారికి వివరించి, ఇక్కడ పెట్టుబడులు పెట్టేలా జపాన్ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని మంత్రి శ్రీధర్ బాబు కోరారు. కార్యక్రమంలో టీజీఐఐసీ ఎండీ ఎండీ విష్ణువర్ధన్ రెడ్డి, టీజీఐఐసీ సీఈవో మధుసూదన్, కితాక్యూషూ సిటీ మేయర్ కజుహిసా టకేచీ, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్, రాష్ట్ర ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ సెల్ డైరెక్టర్ అవినాష్, సీఐఐ తెలంగాణ ఛైర్మన్ శివ ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.