Telangana Government: తెలంగాణ ప్రభుత్వ బదిలీలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యాయుల బదిలీల్లో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై మంగళవారం రోజు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. జీవో 317తో బదిలీ అయిన ఉపాధ్యాయులకు పూర్వ జిల్లా సర్వీసును కూడా పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈనెల 12వ తేదీ నుంచి 14 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు.  


ఇటీవలే ఉపాధ్యాయ ఖాలీల జాబితా వెల్లడి


తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ప్రస్తుతం ఉన్న ఉపాధ్యాయ ఖాళీలతో పాటు ప్రధానోపాధ్యాయులుగా, స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు పొందేందుకు సీనియారిటీ జాబితాను జనవరి 27న సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారులు (డీఈఓలు) ప్రకటించారు. విద్యాశాఖ బదిలీలకు సంబంధించిన మార్గ దర్శకాలపై జనవరి 26న జీఓ కూడా జారీ చేశారు. ఇటీవల జరిగిన డీఈఓల సమావేశంలో ఇచ్చిన కాలపట్టిక, మార్గదర్శకాల్లోని అంశాలే జీఓలో ఉన్నాయి. బదిలీల కోసం జనవరి 28 నుంచి మూడ్రోజులపాటు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించారు. రాష్ట్రంలో 2015 జులైలో చివరి సారిగా పదోన్నతులు, బదిలీలు ఒకేసారి జరపగా...మళ్లీ ఏడున్నర సంవత్సరాల తర్వాత ఆ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. 2018లో బదిలీలు మాత్రమే చేశారు. ఈసారి మొత్తం 9,700 మందికి పదోన్నతులు దక్కనున్నాయి. మరో 30 వేల మంది బదిలీ కానున్నారు. మొత్తం 37 రోజులపాటు కొనసాగనున్న ఈ ప్రక్రియను పర్యవేక్షించేందుకు సీనియర్ అధికారులను నియమించారు.  


ప్రధానోపాధ్యాయుల ఖాళీలివి...



  • మల్టీ జోన్‌-1లోని 19 జిల్లాల్లో 2,420 మంది ప్రధానోపాధ్యాయులు ఉండాలి. అందులో 1096 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

  • మల్టీ జోన్‌-2లో 14 జిల్లాల పరిధిలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్తు పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయుల మంజూరు పోస్టులు 1966 ఉండగా.. అందులో 906 ఖాళీగా ఉన్నాయి. వీటిని ప్రస్తుతం స్కూల్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న వారికి పదోన్నతులు ఇచ్చి భర్తీ చేయనున్నారు.



317 జీఓ ఉపాధ్యాయులకు నిరాశే..



గత సంవత్సరం జనవరిలో 317 జీఓ ద్వారా కొత్త జిల్లాల వారీగా ఉపాధ్యాయులను కేటాయించారు. ఆ క్రమంలో దాదాపు 25 వేల మంది ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు బదిలీ అయ్యారు. బదిలీకి కనీస స్టేషన్ సర్వీస్ రెండు సంవత్సరాలు కాకుండా జీరో సర్వీస్‌తో 317 జీఓ బాధితులకు కూడా దరఖాస్తుకు అవకాశం కల్పించాలని పలు సంఘాలు విద్యాశాఖకు విన్నవించినా పట్టించుకోలేదు. దాంతో ఇప్పటి వరకు ఉన్న ఆశ ఆ ఉపాధ్యాయుల్లో ఆవిరైపోయింది. అందరికీ అవకాశం ఇస్తే మారుమూల పాఠశాలల్లో పనిచేసే వారు ఉండరని ప్రభుత్వం భావించినట్లు తెలిసింది. ఉపాధ్యాయ సంఘాలు మాత్రం ఈ విద్యా సంవత్సరం పూర్తయ్యే వరకు పని చేసే చోటే ఉంటారని, ఆ తర్వాత టీచర్స్ రిక్రూట్‌మెంట్ టెస్టు(టీఆర్‌టీ) ద్వారా కొత్త ఉపాధ్యాయులు వస్తారు కదా అని చెప్పినా ప్రభుత్వం తిరస్కరించింది. దీంతో ప్రకటన వచ్చిన వెంటనే కొంతమంది ఉపాధ్యాయులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ విషయంపై స్పందించిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో తాజాగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది.