బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మంత్రి కేటీఆర్‌కు సవాలు విసిరారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్ (ఐటీఐఆర్) అంశంపై చర్చకు రావాలని డిమాండ్ చేశారు. ఐటీఐఆర్‌ ప్రాజెక్టుపై మంత్రి కేటీఆర్‌తో చర్చకు తాను రెడీ అని చెప్పారు. ఐటీఐఆర్‌పై బీఆర్ఎస్ ప్రభుత్వం శ్వేత పత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆ ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి అసలు ఎలాంటి తప్పు లేదని చెప్పారు. ఐటీఐఆర్‌కు ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ నిధులనే కేంద్రం మంజూరు చేసిందని రఘునందనరావు చెప్పుకొచ్చారు. మంగళవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీపైన బీఆర్ఎస్ నాయకులు మాటల దాడి పెంచుతున్నారని విమర్శించారు.


ప్రాజెక్టుల విషయంలో సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సమర్పించకపోతే కేంద్ర ప్రభుత్వం నిధులు ఎలా కేటాయిస్తదని రఘునందనరావు ప్రశ్నించారు. తెలంగాణలో హైవేలు, రైల్వేలు అభివృద్దికి కేంద్రం రెడీగా ఉందని చెప్పారు. హైదరాబాద్ కు రావాల్సిన ఐటీఐఆర్‌ ప్రాజెక్టుపై బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రాన్ని అనవసరంగా బదనాం చేస్తోందని అన్నారు. ఐటీఐఆర్ అంటే భవనాలు కాదని, పెట్టుబడులు ఆకర్షించటానికి రోడ్లు, మెట్రో రైలును అభివృద్ధి చేయటం అని చెప్పుకొచ్చారు. ఐటీఐఆర్‌ను రెండు విడతల్లో అభివృద్ధి చేయాలని ఆప్పటి భారత ప్రభుత్వం నిర్ణయించిందని గుర్తు చేశారు. మహాత్మాగాంధీ బస్ స్టేషన్ నుంచి ఫలక్ నుమా వైపుగా మెట్రో రాకపోవటానికి మజ్లిస్ పార్టీ, బీఆర్ఎస్‌ పార్టీలే కారణమని ఆరోపించారు. ఐటీఐఆర్ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన ఒక్క పని కూడా చెయ్యలేదని ఎమ్మెల్యే రఘునందనరావు నిందించారు.


సిరిసిల్ల, సిద్ధిపేట ప్రాంతాల్లో తన పరపతి, పలుకుబడి ఏంటనేది వచ్చే ఎన్నికల్లో చూపిస్తానని అన్నారు. దమ్ముంటే దుబ్బాకకు రావాలని మంత్రి కేటీఆర్‌ కు సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో ఎంఐఎం 50 సీట్లలో కాకుండా 119 సీట్లలో పోటీ చేయాలని సవాలు విసిరారు. 15 సీట్లు గెలిచి మళ్ళీ బీఆర్ఎస్ కింద పనిచేస్తానని అక్బరుద్దీన్ ఒవైసీ అనడం సిగ్గుచేటని అన్నారు.


తెలంగాణకు చెందిన హోం గార్డ్ నుంచి సీనియర్ ఐపీఎస్‌లు.. సీఎం కేసీఆర్ ఏం చేస్తున్నారో ఆలోచన చేయాలని రఘునందనరావు సూచించారు. అసెంబ్లీలో తమకు కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. తాను వకీల్ సాబ్ నే.. తెలంగాణ ఉద్యమంలో ఇబ్బందులు పడుతున్న ఉద్యమ కారుల కోసం పనిచేసిన వ్యక్తినని అన్నారు. తెలంగాణ మొత్తం మా కుటుంబం అని చెప్పుకునే కేటీఆర్ ఉద్యమంలో వీరమరణం పొందిన అమరుల కుటుంబాలను ఎందుకు ఆదుకోవడం లేదని ప్రశ్నించారు. పోలీసు కిష్టయ్య, డీఎస్పీ నళిని, శ్రీకాంతాచారి కుటుంబం తెలంగాణ కుటుంబం కాదా అని ఎమ్మెల్యే రఘునందనరావు నిలదీశారు.


ఐపీఎస్‌ల బదిలీలపైనా విమర్శలు
93 మంది ఐపీఎస్ ట్రాన్స్‌ఫర్‌లు జరగ్గా తెలంగాణ ఐపీఎస్ అధికారులకు ఒక్కరికి కూడా ప్రాధాన్యం ఉన్న పోస్టు ఇవ్వలేదని రఘునందన్ రావు ఆరోపించారు. తమకు అనుకూలంగా ఉన్న వారిని, గట్టిగా మాట్లాడే విపక్షాల నేతలను అరెస్టు చేసేందుకు మంచి పోస్ట్ ఇచ్చారన్నారు. స్టీఫెన్ రవీంద్ర తెలంగాణ ఉద్యమంలో జై తెలంగాణ అన్న వారిని రబ్బరు బుల్లెట్లతో కాల్చిన వ్యక్తి అని గుర్తు చేశారు. ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్ బిహార్ వ్యక్తి అని, ఆంధ్రా వాళ్ళు అంటే కాదని తాము వాదించామని అన్నారు. కాని ఇప్పుడు తమకు అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు.