తెలంగాణలో సర్కారు కొలువుల కోసం సన్నద్దమవుతున్న నిరుద్యోగ యువతకు కొత్త కష్టం వచ్చి పడింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహిస్తున్న నియామక పరీక్షలు అభ్యర్థులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఒకే రోజు మూడు పరీక్షలు నిర్వహిస్తుండడంతో ఎన్నో ఆశలతో సన్నద్ధమైన అభ్యర్థులు నష్టపోయే పరిస్థితి తలెత్తింది. ఫిబ్రవరి 26న జరిగే పరీక్షలను చూస్తే రెండు, మూడు పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఏదో ఒక పరీక్షకే పరిమితమవాల్సిన పరిస్థితి నెలకొంది. పరీక్షల వివరాల్లోకి వెళితే..



➥  ఫిబ్రవరి 26న తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ డీఏఓ (డివిజనల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌) ఉద్యోగ అర్హత పరీక్ష నిర్వహిస్తోంది. 53 డీఏఓ ఉద్యోగ ఖాళీల భర్తీకి దాదాపు పదిహేనేళ్ల తర్వాత ప్రకటన వెలువడింది. ఈ పరీక్షకు 1.06 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఆర్థిక శాఖకు అనుబంధంగా ఉన్న ఈ పోస్టులు అత్యంత కీలకమైనవి. ఈ పరీక్షను ఫిబ్రవరి 26న ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. పరీక్ష తేదీకి వారం ముందు హాల్‌­టికెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో పెట్టనుంది. 

➥ అయితే అదే రోజున కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి పరీక్షలు జరగనున్నాయి. ఇక కేంద్రీయ విద్యాలయాల్లో ప్రైమరీ టీచర్‌ (పీఆర్‌టీ) ఉద్యోగ అర్హత పరీక్ష నిర్వహిస్తున్నారు. అదే రోజున 

➥  స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ జూనియర్‌ ఇంజినీర్‌ పేపర్‌–2 పరీక్షను సైతం ఫిబ్రవరి 26నే నిర్వహిస్తున్నారు. 

➥ మరోవైపు ఎయిర్ పోర్ట్‌లో ఖాళీల భర్తీకి సైతం ఫిబ్రవరి 26నే పరీక్ష నిర్వహిస్తున్నారు. ఢిల్లీ ఎయిమ్స్‌లో నిర్వహించే నియామక పరీక్ష చివరిరోజు పరీక్షలు కూడా ఫిబ్రవరి 26తో ముగుస్తున్నాయి. 


ఇలా ఒకేరోజు అన్ని పరీక్షలు నిర్వహిస్తుండటం అభ్యర్థులకు నష్టమని అభ్యర్థులు వాపోతున్నారు. ఒకేరోజు రాయడం కూడా వీలు కాదని వెల్లడించారు. అందుకే డీఏవో పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థులు కోరుతున్నారు. సాధారణంగా ఉద్యోగ పరీక్షల నిర్వహణ విషయంలో రాష్ట్రాలు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. కేంద్రీయ నియామక సంస్థలు నిర్వహించే ఉద్యోగ పరీక్షల తేదీలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాష్ట్ర స్థాయి ఉద్యో­గాల భర్తీకి పరీక్షలు నిర్వహించాలని ఉద్యోగరంగ నిపుణులు చెపుతున్నారు. ఒకవేళ ముందస్తుగా రాష్ట్ర నియామక సంస్థలు పరీక్షల తేదీలను ప్రకటిస్తే.. అవసరమైన పక్షంలో అభ్యర్థుల ప్రయోజనాల రీత్యా వాటిని మార్పు చేయడం మంచిదని వారు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 26న జరిగే డీఏఓ, పీఆర్‌టీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు డీఏఓ పరీక్ష తేదీలో మార్పు చేయాలని కోరుతున్నారు.


Also Read:


SSC Exams: సీజీఎల్‌, సీహెచ్‌ఎస్‌ఎల్‌ పరీక్షల తేదీలు ఖరారు! షెడ్యూలు ఇదే!
కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి గతేడాది కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్(సీజీఎల్), కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ పరీక్ష (సీహెచ్‌ఎస్‌ఎల్)కు నోటిఫికేషన్‌ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే సీజీఎల్ టైర్-1 పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు సంబంధించిన టైర్-2 పరీక్ష తేదీలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఫిబ్రవరి 6న ప్రకటించింది. వీటిలో గ్రూప్-బి, గ్రూప్-సి విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి టైర్-2 పరీక్షను మార్చి 2 నుంచి 7 వరకు నిర్వహించనున్నట్లు ఎస్‌ఎస్‌సీ ఫిబ్రవరి 6న ప్రకటించింది.
పరీక్షల షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...