ప్రగతిలో దేశంలోని అన్ని ప్రాంతాల కంటే తెలంగాణ టాప్‌లో ఉందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వివిధ రంగాల్లో సాధించిన ప్రగతిని వివరిస్తూ తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖచిత్రం 2022 (Telangana Socio-Economic Outlook 2022) పేరుతో ఓ నివేదికను విడుదల చేసింది. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత సాధించిన ఘనతలు, చేపట్టిన పథకాలు, ప్రాజెక్టులను సమగ్రంగా వివరించింది. అన్ని విభాగాల్లో జాతీయ సగటు కంటే ముందంజలో ఉన్నామంటూ ఘనంగా ప్రకటించుకుంది. 


కేసీఆర్‌ ప్రభుత్వం విడుదల చేసిన నివేదికలో తలసరి ఆదాయంలో తమకు తిరుగు లేదని చెబుతోంది. 2020-21 సంవత్సరంలో తెలంగాణ తలసరి ఆదాయం 2.29 లక్షలు ఉన్నట్టు నివేదికలో పేర్కొంది. రాష్ట్రం ఏర్పడిన సంవత్సరం నుంచి తెలంగాణ తలసరి ఆదాయం స్థిరంగా కొనసాగుతోందని ప్రకటించింది. అదే టైంలోజాతీయ సగటు కంటే ఎక్కువగా ఉన్నట్టు కూడా లెక్కలతో వివరించింది. ప్రతి సంవత్సరం దేశ, రాష్ట్ర తలసరి ఆదాయంల మధ్య వ్యత్యాసం కూడా పెరిగిందని తెలిపింది. 


2014-15లో తెలంగాణ తలసరి ఆదాయం జాతీయ తలసరి ఆదాయం కంటే 1.43 రెట్లు పెరగ్గా... ఇది 2020-21 నాటికి 1.86 రెట్లు పెరిగింది. 2020-21 సంవత్సరంలో దేశ నామమాత్రపు తలసరి ఆదాయంలో భారీ క్షీణత ఉంటే.. తెలంగాణలో మాత్రం 1.6 శాతం పెరిగిందనట్టు లెక్కలు చూపిస్తున్నాయి. జాతీయ తలసరి ఆదాయ వృద్ధి రేటు కంటే దాదాపు 0.7 శాతం ఎక్కువగా అంటే 18.8 శాతం తెలంగాణ తలసరి ఆదాయంలో అత్యధిక పెరుగుదల సాధించిందని నివేదికలో పేర్కొంది.  


2020-21కి చెందిన తలసరి ఆదాయాన్ని జిల్లాల వారీగా వివరించింది. ఇందులో రంగారెడ్డి టాప్‌ప్లేస్‌లో ఉంటే... వికారాబాద్‌ చివరి స్థానంలో ఉంది. మొత్తం తెలంగాణ తలసరి ఆదాయం చూసుకుంటే... 2.79లక్షలుగా ప్రభుత్వం పేర్కొంది. టీఎస్‌డీపీఎస్‌ ప్రకటించిన వివరాల ప్రకారం ప్రజల తలసరి ఆదాయం ఎనిమిదేళ్లలో రెట్టింపు అయింది. 2020-21లో తెలంగాణలో తలసరి ఆదాయం 2.79 లక్షలుగా నమోదైంది. అదే టైంలో జాతీయ సగటు తలసరి ఆదాయం 1.27 లక్షలుగా ఉంది. 


జిల్లాల వారీగా తలసరి ఆదాయం పరిశీలిస్తే... రంగారెడ్డి జిల్లాలో రూ.6.59 లక్షలతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది. పక్కనే ఉన్న వికారాబాద్‌ జిల్లా రూ.1.32 లక్షలతో కనిష్ట స్థానంలో ఉంది. రంగారెడ్డి తర్వాత రూ.3.51 లక్షలతో హైదరాబాద్‌ జిల్లా రెండో స్థానంలో ఉంటే... మూడోస్థానంలో మల్కాజ్‌గిరి ఉంది. జాతీయ తలసరి ఆదాయం కంటే ఒక్క రంగారెడ్డి రంగారెడ్డి జిల్లా పెర్‌ క్యాపిటా ఇన్‌కం 5.2 రెట్లు ఎక్కువ. కరోనా టైంలో కూడా 17 జల్లాలు తలసరి ఆదాయాన్ని వృద్ధి చేసుకున్నాయి. సిద్దిపేట, మహబూబ్‌నగర్‌ జిల్లాలు తమ తలసరి ఆదాయంలో రెండు అంకెల వృద్దిని సాధించాయి. 


జిల్లాలవారీగా తలసరి ఆదాయం ఇలా ఉంది. 
రంగారెడ్డి - రూ. 6.59 లక్షలు
హైదారబాద్‌ -రూ. 3.51 లక్షలు
మేడ్చల్‌-మల్కాజ్‌గిరి -రూ. 2.40 లక్షలు
మెదక్‌ -రూ. 2.30 లక్షలు
మహబూబ్‌నగర్‌ -రూ. 2.23 లక్షలు
యాదాద్రి భువనగిరి -రూ. 2.22 లక్షలు
సిద్దిపేట -రూ. 2.19 లక్షలు
జయశంకర్‌ భూపాలపల్లి -రూ. 2.14 లక్షలు
సంగారెడ్డి -రూ. 2.05 లక్షలు
నల్లగొండ -రూ. 2.01 లక్షలు
కరీంనగర్‌ -రూ. 1.91 లక్షలు
సూర్యాపేట -రూ. 1.84 లక్షలు
భద్రాది కొత్తగూడెం -రూ. 1.83 లక్షలు 
ఖమ్మం -రూ. 1.83 లక్షలు
నిర్మల్‌ -రూ. 1.79 లక్షలు
అదిలాబాద్‌ -రూ. 1.75 లక్షలు
వరంగల్‌ రూరల్‌ -రూ. 1.76 లక్షలు
జనగామ -రూ. 1.75 లక్షలు
పెద్దపల్లి -రూ. 1.74 లక్షలు
ములుగు -రూ. 1.68 లక్షలు
నాగర్‌కర్నూల్‌ -రూ. 1.63 లక్షలు
నిజామాబాద్‌ -రూ. 1.67 లక్షలు
రాజన్న సిరిసిల్ల -రూ. 1.56 లక్షలు
కామారెడ్డి -రూ. 1.55 లక్షలు
మంచిర్యాల -రూ. 1.55 లక్షలు
మహబూబాబాద్‌ -రూ. 1.53 లక్షలు
వనపర్తి -రూ. 1.51 లక్షలు
జోగులాంబ గద్వాల -రూ. 1.50 లక్షలు
జగిత్యాల -రూ. 1.50 లక్షలు
నారాయణపేట్‌ -రూ. 1.43 లక్షలు
వరంగల్‌ - రూ. 1.38 లక్షలు
కొమ్రంభీమ్‌ - రూ. 1.37 లక్షలు
వికారాబాద్‌ -రూ. 1.32 లక్షలు