ఎల్బీ స్టేడియం నుంచి ప్రజా యుద్ద నౌక గద్దర్‌ అంతిమ యాత్ర ప్రారంభమైంది. పోలీసులు గౌరవ వందనం..స్లో మార్చ్‌, డెత్‌ మార్చ్‌ లతో గన్‌ పార్క్‌ కు అంతిమ యాత్ర బయల్దేరింది. ఎల్బీ స్టేడియం నుంచి గద్దర్‌ పార్థివ దేహాన్ని అమరవీరుల స్థూపానికి తీసుకెళ్లారు. అమరవీరుల స్థూపం వద్ద ఆయన భౌతికకాయానికి అభిమానులు నివాళులు ఆర్పించారు.


ఈ అంతిమ యాత్రలో వేలాది మంది గద్దర్‌ అభిమానులు పాల్గొన్నారు. అల్వాల్ లోని ఇంటి వరకు గద్దర్‌ అంతిమ యాత్ర కొనసాగింది. అక్కడి నుంచి మహాబోధి మహా విద్యాలయంలో ఆయన దహన సంస్కారం నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మహాబోధి స్కూల్‌ గ్రౌండ్‌ లో అంత్యక్రియలు జరగనున్నాయి.


గన్‌ పార్క్‌, అసెంబ్లీ, అమరవీరుల స్మారక స్థూపం, నెక్లెస్‌ రోడ్‌ లోని అంబేడ్కర్‌ విగ్రహం, ట్యాంక్‌ బండ్‌, జేబీఎస్‌, అల్వాల్‌ మీదుగా గద్దర్‌ అంతిమ యాత్ర కొనసాగుతుంది. దీంతో ఆ  ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను మళ్లించారు.


గత కొంత కాలంగా గుండె జబ్బుతో బాధపడుతున్న గద్దర్‌..ఆదివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఆదివారం సాయంత్రం ఆయన పార్థివదేహాన్ని హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియం కు ప్రజల సందర్శనార్థం తరలించారు. 


నిన్న సాయంత్రం నుండి గద్దర్ ను కడసారి చూసేందుకు ప్రజలు, రాజకీయ నేతలు , కళాకారులు , ఉద్యమకారులు పోటెత్తారు. గద్దర్ మనమధ్య లేకపోయినా ఆయన పాటలు ఎప్పటికి అలాగే ఉంటాయని ప్రతి ఒక్కరు అంటున్నారు.