Chamakura Malla Reddy Land Encroachment Issue : భూకబ్జాల ఆరోపణలపై మాజీ మంత్రి,  ఎమ్మెల్యే మల్లారెడ్డి (Chamakura Malla Reddy) స్పందించారు. భూకబ్జాలు (Land Occupation ) చేయాల్సిన అవసరం తనకు లేదన్నారు. భూకబ్జా చేసినట్లు తనపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమన్నారు. ఈ ఘటనలో ప్రభుత్వ కక్ష సాధింపు చర్య ఉన్నట్లు భావించడం లేదన్నారు. గిరిజనుల 47 ఎకరాలకు సంబంధించిన భూమి విషయంలో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. కొంతమంది మధ్యవర్తులు కొనుగోలు, అమ్మకాల్లో ఉన్నారని తెలిపారు. గిరిజనుల భూమిని వారే కబ్జా చేసి ఉంటారని ఆరోపించారు. 


మల్లారెడ్డి, అనుచరులపై భూకబ్జా కేసులు
మాజీ మంత్రి, మేడ్చల్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డిపై బుధవారం కేసు నమోదు అయ్యింది. గిరిజనుల భూములు కబ్జా చేశారని ఫిర్యాదు మేరకు శామీర్‌పేట్ పోలీస్‌స్టేషన్‌లో మల్లారెడ్డిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు చేశారు. మల్లారెడ్డితో పాటు ఆయన అనుచరులు తొమ్మిది మందిపై కేసులు పెట్టారు. మేడ్చల్ మల్కాజిరి జిల్లా మూడు చింతలపల్లి మండలంలోని కేశవరం గ్రామంలో లంబాడీలకు చెందిన సర్వేనెంబర్ 33, 34, 35లో గల 47 ఎకరాల 18 గుంటల ఉంది. వారి  వారసత్వ భూమిని మాజీ మంత్రి మల్లారెడ్డి, అతని అనుచరులు 9 మంది అక్రమంగా కబ్జా చేసి, కుట్రతో మోసగించి భూమిని కాజేశారు. దీనికి సంబంధించి శామీర్‌పేట పోలీస్టేషన్‌లో ఫిర్యాదు నమోదు అయ్యింది.  మొత్తం 47 ఎకరాలు కబ్జా చేశారని ఫిర్యాదులో బాధితులు తెలిపారు. లంబాడీల వారసత్వ భూమిని మాజీ మంత్రి మల్లారెడ్డి, అతని బినామీ అనుచరులు 9 మంది అక్రమంగా కబ్జా చేసి కాజేశారు. బాధితుల ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు మాజీ మంత్రి, అతని అనుచరులు, మల్లారెడ్డి బంధువు శ్రీనివాస్ రెడ్డి, కేశవాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ భర్త గోనె హరి మోహన్ రెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా జిల్లా సహకార సంఘం వైస్ చైర్మన్ శామీర్‌పేట్ మండల వ్యవసాయ సహకార సేవా సంఘం చైర్మన్ రామిడి మధుకర్ రెడ్డి శివుడు, స్నేహ రామిరెడ్డి, రామిడి లక్ష్మమ్మ, రామిడి నేహా రెడ్డిలపై శామీర్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ 420 చీటీంగ్ కేసు నమోదు చేశారు. 


250 కోట్ల భూమి లాక్కున్నారు
మూడు చింతలపల్లి మండలం కేశవరం గ్రామ పరిధిలోని సర్వేనెంబర్ 33, 34, 35లో గల 47 ఎకరాల 18 గుంటల భూమి, తమ పెద్దల నుంచి వారసత్వ హక్కుగా వచ్చిందన్నారు కేతావత్ బిక్షపతి నాయక్. తమ కుటుంబ సభ్యులైన ఆరుగురి పేరు మీద మొత్తం భూమి ఉందని తెలిపాడు. ఈ భూమిపై కన్నేసిన స్థానిక ఎంఎల్‌ఎ, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి ఈ భూమిని ఎలాగైనా కాజేయాలని కుట్రతో తన అనుచరులతో కలిసి కుట్రకు పాల్పడ్డారని వాపోయారు. తమకు మాయ మాటలు చెప్పి నమ్మించి ఏడుగురితో 250 కోట్ల విలువ చేసే భూమిని పిటి సరెండర్ చేయించారని ఫిర్యాదులో తెలిపారు. తమ భూమిపై మేము హక్కులు కోల్పోయేలా చేసి...ఏడుగురికి ఒక్కొక్కరికి మూడు లక్షల చొప్పున డబ్బు ఇచ్చి భూమి లాక్కున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 


రిజిస్ట్రేషన్ చేయలేదన్న తహసీల్దార్
కేశవరం రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్‌లు 33,34,35లలో 40 ఎకరాల భూమిలో పిటి దారులమంటూ...పది మంది హైకోర్టు ఉత్తర్వులతో దరఖాస్తు చేసుకున్నారని తహసీల్దార్ వాణిరెడ్డితెలిపారు. వారికి నోటీసులు ఇచ్చి పిలిపించి స్టేట్మెంట్ రికార్డు చేసుకున్నామని, ఎలాంటి రిజిస్ట్రేషన్ చేయలేదన్నారు. ఈ సర్వే నెంబర్లలో గత 2019లో 7 ఎకరాల 18 గుంటల భూమిని పిటి సరెండర్ చేసి ప్రొసీడింగ్ ఇచ్చారని వెల్లడించారు.