తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ 2కే రన్ ను ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ తో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో ఉత్సాహంగా రన్ కొనసాగింది. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ రన్ లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్డులో అంబేడ్కర్ విగ్రహం వద్ద మంత్రి మహమూబ్ అలీ 2కే రన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి, క్రీడాకారులు నిఖత్ జరీన్, ఈషా సింగ్, గాయకులు మంగ్లీ, రామ్ మిర్యాల, సినీ నటి శ్రీలీల పాల్గొన్నారు. నాలుగు వేలకుపైనా జనాలు ఈ రన్ లో పాల్గొన్నారు. ఈ తెలంగాణా రన్ ప్రారంభోత్సవానికి ముందు ప్రముఖ గాయకులు మంగ్లీ, రామ్ లు ఆలపించిన తెలంగాణా పాటలు హాజరైన యువతీ, యువకులను పెద్ద ఎత్తున ఆకట్టు కున్నాయి. దాదాపు 4 వేలకు పైగా రన్నర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సంస్కృతి ప్రతిభింబించేలా బోనాలు, బతుకమ్మలతో సహా పోలీస్ అశ్విక దళం, డప్పులు, ఇతర నృత్యాలతో హోరెత్తించారు. 2K, 5K తెలంగాణా రన్ లను రాష్ట్ర మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్ గౌడ్, నగర మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి, ఎమ్మెల్యే దానం నాగేందర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్ లు జండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా పలువురు ప్రముఖులు ప్రసంగించారు.


దేశంలోనే నెంబర్ వన్ సీఎం కేసీఆర్: మంత్రి మహమూద్ అలీ


రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. తెలంగాణా రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో శరవేగంగా పురోగమనానికి ప్రధాన కారణమైన రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ దేశంలోనే నెంబర్ వన్ సీఎం అని ప్రశంసించారు. మరే ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధితో తెలంగాణా రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా నిలిచిందని పేర్కొన్నారు.  


తెలంగాణా కు మంచి కీర్తి, ప్రతిష్టలు తేవాలి: మంత్రి శ్రీనివాస్ గౌడ్


ఐటీ పారిశ్రామిక రంగాల్లో తెలంగాణా రాష్ట్రంతో మరే రాష్ట్రం పోటీ పడడం లేదని, ఇదే విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలులో యువత బాగస్వామ్యం వహించాలని రాష్ట్ర యువజన, సాంస్కృతిక శాఖ మంత్రి వీ. శ్రీనివాస గౌడ్ పిలుపునిచ్చారు. అన్ని రంగాల్లో సంస్కరణలు, అభివృద్ధి కార్యక్రమాలను అంత్యంత సమర్దవంతంగా అమలు చేస్తూ తెలంగాణా రాష్ట్రానికే తెలంగాణా ఆదర్శనంగా నిలిచిందని అన్నారు. మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి మాట్లాడుతూ.. దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహ స్ఫూర్తిగా తెలంగాణా రన్ ను నిర్వహించడం గర్వకారణమని పేర్కొన్నారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ.. గత తొమ్మిదేళ్లుగా రాష్ట్రంలో జరిగిన అప్రతిహాత అభివృద్ధిని మరోసారి ప్రజలకు వివరించేందుకు దశాబ్ది ఉత్సవాలు ప్రారంభించామని తెలిపారు. 


రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మాట్లాడుతూ.. తెలంగాణా రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని తెలిపారు. డీజీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ.. దేశంలోనే తెలంగాణా రాష్ట్రం సురక్షిత నగరంతోపాటు ఆరోగ్యవంతమైన రాష్ట్రమని అన్నారు. వివిధ రంగాల్లో అభివృద్ధి చెందుతూ దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే మేటిగా నిలిచిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారిణి ఈషా సింగ్, సినీ నటి శ్రీలీలలు కూడా పాల్గొని మాట్లాడారు. అలాగే జీహెచ్ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్, అడిషనల్ డీజీలు విజయ్ కుమార్, సంజయ్ కుమార్ జైన్, స్వాతి లక్రా, ఐజీ రమేష్ రెడ్డిలతో సహా పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


అలాగే సూర్యాపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ రన్ ను ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ తో కలిసి మంత్రి జగదీశ్ రెడ్డి ప్రారంభించారు. మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడలో మంత్రి మల్లారెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్ తెలంగాణ రన్ ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ కలెక్టర్ అమయ్ కుమార్, రాచకొండ సీపీ చౌహాన్ పాల్గొన్నారు. అంతేకాకుండా వనపర్తి జిల్లా కేంద్రంలో నిర్వహించిన తెలంగాణ రన్ ను మంత్రి నిరంజన్ రెడ్డి, రంగారెడ్డిలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, జగిత్యాల జిల్లా ధర్మపురిలో మంత్రి కొప్పుల ఈశ్వర్, నల్లగొండ పట్టణంలో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, నిర్మల్ జిల్లా కేంద్రంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, కామారెడ్డిలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ప్రారంభించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి ఖిల్లాపై తిరంగా యాత్ర నిర్వహించారు. కోట వద్ద జాతీయ జెండా ఎగురవేశారు.