CM KCR: పార్టీ వ్యవస్థాపకులు, సిద్ధాంత కర్తలు, తాతలు, తండ్రుల పేర్లు చెప్పుకుంటూ ఓట్లేయమంటే ప్రజలు పట్టించుకునే అవకాశమే లేదని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశ ప్రజలకు పేర్లతో పని లేదని. పని చేయగల్గిన వాళ్లతోనే పని అంటూ చెప్పుకొచ్చారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఇప్పటికీ కేంద్రంలో పాలన నిర్లక్ష్యంగా, దశ దిశ లేకుండా కొనసాగుతోందని విమర్శించారు. ఈ తీరు దేశ భవిష్యత్తును నాశనం చేస్తుందని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఆదివారం ప్రగతి భవన్ లో మధ్య ప్రదేశ్ బీఆర్ఎస్ సమన్వయకర్త, మాజీ ఎంపీ బుద్ధసేన్ పటేల్ ఆధ్వర్యంలో ఆ రాష్ట్రానికి చెందిన మాజీ ఎమ్మెల్యే సహా 200 మంది నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. చాంద్వాడా జిల్లా జున్నార్ దేవ్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే రామ్ దాస్ యికే, సర్వజన్ కల్యాణ్ పార్టీ జాతీయ అధ్యక్షుడు సంజయ్ యాదవ్, గోండ్వానా పార్టీ అధ్యక్షుడు శోభారామ్ బాలావి, భువన్ సింగ్ కోరం, లక్ష్మణ్ ముస్కోలే తదితరులకు సీఎం కేసీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 


ప్రకృతి వనరులు అన్నీ ఉన్నా.. రైతుల ఆత్మహత్యలు ఆగట్లేదు!


దేశంలో వ్యవసాయం చేసేందుకు కావాల్సిన ప్రకృతి వనరులన్నీ అందుబాటులో ఉన్నాయని.. అయినా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే ప్రభుత్వానిదే బాధ్యత అని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లే  రైతులకు బతుకులు ఇలా మారాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దళితులు, బహుజనులు సహా అన్ని వర్గాల ప్రజలు అప్పటికీ అన్యాయానికి గురవుతున్నారని పేర్కొన్నారు. ఈ దుస్థితి పోవాలంటే కేంద్రంలో పార్టీలను మార్చడం కాకుండా తమ ఆకాంక్షలను గెలిపించుకునే దిశగా ప్రజలు చైతన్యం కావాలన్నారు. ఒక పార్టీని ఓడించి ఇంకో పార్టీని గెలిపిస్తే... పార్టీలు, వాటి నాయకుల పేర్లే మారుతాయని అన్నారు. ప్రజలకు ఒరిగేదేమీ లేదని.. పని విధానంలో మార్పు తీసుకువచ్చే ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. 


మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో బీఆర్ఎస్ కార్యాలయం ఏర్పాటు


బీఆర్ఎస్ కేవలం రాజకీయ పార్టీ మాత్రమే కాదని.. దేశాన్ని మార్చేందుకు ఏర్పాటు చేసిన ఒక మిషన్ అని వెల్లడించారు. మన కోసం పని చేసుకునే వారికి ఓటు వేస్తేనే మన ఆకాంక్షలు నెరవేరుతాయన్నారు. తెలంగాణలో అమలు అవుతున్న పథకాలు మధ్యప్రదేశ్ లో ఎందుకు అమలు కావని ప్రశ్నించారు. ఆదివాసీలు, దళితులు, బహుజనులు పీడితులుగానే కొనసాగే దుస్థితి ఇంకెన్నాళ్లు అని ప్రశ్నించారు. ఆ వర్గాల వారు ఉత్తర భారతంలో కనీస జీవన ప్రమాణాలకు నోచుకోకుండా వివక్షకు గురవుతున్నారని తెలిపారు. తప్పుడు వాగ్దానాలతో, విద్వేషాలు రెచ్చగొడుతూ ఏం చేసైనా ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా కొనసాగుతున్న దుర్మార్గాలను నిలువరించడంలో ఎన్నికల సంఘం విఫలమైందన్నారు. మధ్య ప్రదేశ్ లోని భోపాల్ లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. దీని ద్వారానే ఆ రాష్ట్రంలోని గ్రామ గ్రామానికి తమ పార్టీ భావజాలాన్ని తీసుకెళ్లాలని కొత్తగా చేరిన నేతలకు సూచించారు.