Dairy Milk: మంచిని ఆశిద్దాం.. తియ్యని వేడుక చేసుకుందాం ఇదీ క్యాడ్ బరీ(Cadbury) డైరీమిల్క్(Dairy Milk) చాక్లెట్ స్లోగన్. పిల్లల నుంచి పెద్దల వరకు దీని రుచికి దాసోహం అవ్వని వారు ఉండరు. నోట్లోవేసుకోగానే వెన్నలా కరిగిపోయే ఈ చాక్లెట్ చుట్టూ  తీవ్ర వివాదం నడుస్తోంది. తెలంగాణ(Telangana) స్టేట్ ఫుడ్ ల్యాబోరేటరీ ఏకంగా ఈ చాక్లెట్ సురక్షితం కాదు..తినొద్దంటూ హెచ్చరించడం సంచలనం రేకెత్తిస్తోంది.


సురక్షితం కాదంటున్నారు అధికారులు
ఆకర్షణీయమైన కవర్ తో చూడగానే ఆకట్టుకునేలా మిళమిళ మెరిసిపోతూ కనిపించే డైరీమిల్క్(Dairy Milk) చాక్లెట్లు తినడం అంత సురక్షితం కాదని తెలంగాణ ఫుడ్ సేప్టీ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఆ తళుకుబెళుకు కవర్ల వెనక కంటికి కనిపించని పురుగులే కాదు... కనిపించే పురుగులు సైతం ఉన్నాయని తెలిపింది.. ఇటీవల హైదరాబాద్ మెట్రో(Hyderabad Metro) స్టేషన్‌లో ఓ కస్టమర్‌కు తన పిల్లల కోసమని క్యాడ్ బెరీ కంపెనీకి చెందిన డైరీ మిల్క్ చాక్లెట్ కొనగా.. లోపల పురుగు కనిపించింది. దీంతో.. ఇందుకు సంబంధించిన వీడియోను ఆ వినియోగదారుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


ఈ ఘటనపై స్పందించిన జీహెచ్ఎంసీ(GHMC) అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. వినియోగదారుడు కొనుగోలు చేసిన షాపుపై దాడి చేశారు. అతను కొన్న చాక్లెట్ల నమూనాలను ల్యాబ్‌ కు పంపించి పరీక్షలు నిర్వహించగా  షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ కంపెనీకి చెందిన చాక్లెట్లు తినటం ఆరోగ్యానికి అంత సురక్షితం కాదని అభిప్రాయపడుతూ.. తెలంగాణ స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ రిపోర్టు విడుదల చేశారు. ఈ చాక్లెట్లలో.. ఆరోగ్యానికి హాని చేసే కారకాలు చాలా ఉన్నాయని తెలిపారు.



ఆడేసుకున్న సోషల్ మీడియా
 రాబిన్ చేసిన ట్వీట్‌కు నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. చిన్న పిల్లలు తినే చాక్లెట్‌లో ఇలా పురుగు కనిపించడం దారుణమని.. ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కంపెనీని కోర్టుకు ఈడ్చాలని, ఫుడ్ సేఫ్టీ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కామెంట్లు పెట్టారు. దీనిపై స్పందించిన ఫుడ్ సేప్టీ అధికారులు దుకాణంపై దాడి చేసి మిగిలిన చాక్లెట్ల నమూనాలు తీసుకున్నారు. క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం డైరీమిల్క్ చాక్లెట్లు తినడం అంత సురక్షితం కాదని తెలిపారు. అయితే క్యాడ్‌బరీకి చెందిన అన్ని రకాల చాక్లెట్స్ కాకుండా కేవలం రోస్ట్ ఆల్మండ్, ఫ్రూట్ అండ్ నట్ చాక్లెట్స్ మాత్రమే సురక్షితం కాదని తెలంగాణ స్టేట్ ఫుడ్ ల్యాబోరేటరీ స్పష్టం చేసింది. అమీర్ పేట మెట్రోస్టేషన్ లో కొనుగోలు చేసిన క్యాడ్ బరీ చాక్లెట్ లో పురుగులున్న ఆ శాంపిల్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ల్యాబ్ లో విశ్లేషణ చేసిన అధికారులు అందులో తెల్ల పురుగులు ఉన్నట్లు గుర్తించారు.


కంపెనీ వివరణ
డైరీమిల్క్ చాక్లెట్లపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తుండటంతో ఆ చాక్లెట్ల తయారీ సంస్థ మాండెలెజ్ ఇండియా (Mondelez India) వివరణ ఇచ్చింది.  తమ ఉత్పత్తులు పూర్తి సురక్షితం అని స్పష్టం చేసింది.  ఆరోపణలు ఎదురైన బ్యాచ్‌కు సంబంధించిన అన్ని నమూనాలను పరీక్షించామని ఎక్కడా లోపం లేదని వెల్లడించింది. పంపిణీదారు వద్ద స్టోరేజ్‌కి సంబంధించిన లోపం కారణంగా ఈ ఘటన జరిగి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేసింది. వారు చేసిన తప్పిదం వల్లే కంపెనీకి చెడ్డ పేరు వచ్చిందన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలను అనుసరించే తాము ఉత్పత్తులు తయారు చేస్తామని తెలిపింది.