Rs 2 crore value sarees seized in bachupally ps limits:


హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల కట్టలు కట్టలు నగదు, మద్యంతో పాటు ఓటర్లకు పంచేందుకు సిద్ధం చేసిన వస్తువులు దొరుకుతున్నాయి. తాజాగా హైదరాబాద్ లో రెండు చీరల లోడ్ లారీలను పోలీసులు సీజ్ చేశారు. నగరంలోని బాచుపల్లి పియస్ పరిదిలోని ప్రగతినగర్ లో పంచవటి అపార్ట్మెంట్ పై పోలీసులు దాడి చేశారు. 743 బ్యాగ్ లలో ఉన్న రూ.2 కోట్లకు పైగా విలువ చేసే చీరలు ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. చీరల విలువ రూ. 2,25,98,590/- (రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల తొంబై ఎనిమిది వేల 5 వందల తొంబై రూపాయలు) అని సమాచారం.    


ప్రగతినగర్ లోని అపార్ట్మెంట్ లో ఓ డబుల్ బెడ్ రూమ్ లో 2లారీల లోడ్ చీరలను డంప్ చేస్తున్న సమయంలో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. తక్షణమే అక్డకి చేరుకున్న పోలీసులు లారీలను సీజ్ చేశారు. సంచులలో చీరలు ఉన్నాయని విలువ రెండు కోట్లకు పైగా ఉంటుందని పోలీసులు తెలిపారు. వరంగల్ ప్రాంతంలోని కాశంపుల్లయ్య, మాంగల్య  షాపింగ్ మాల్స్ నుంచి తాను చీరలు కొన్నానని వీటి యజమాని పోలీసులకు తెలిపారు. అయితే రిసీప్ట్ లాంటివి చూపించాలని, చీరల ఖరీదుకు సంబంధించి ఆధారాలు చూపించాలని పోలీసులు ఆయనకు సూచించారు. బాచుపల్లి పోలీసులు చీరలతో ఉన్న రెండు లారీలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఎన్నికల సమయం కావడంతో ఓటర్లకు చీరలు పంచి ప్రలోభపెట్టాలని చూస్తున్నారని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు.


తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి పోలీసులు నిఘా పెట్టారు. నేతలు ఓటర్లకు డబ్బుల పంపిణీ, ఇతర ప్రలోభాలపై పోలీసులు దృష్టి పెట్టారు. ఎక్కడికక్కడ తనిఖీలు చేపట్టగా భారీగా నగదు, బంగారు, వెండి, లిక్కర్ దొరుకుతోంది. షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికలు పారదర్శకంగా, ఎలాంటి ప్రలోభాలకు తావు లేకుండా జరిపేందుకు ప్రయత్నిస్తున్నారు. 


వారంలో వంద కోట్లు స్వాధీనం..
తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్‌ వచ్చి వారం రోజులు అవుతుంది. ఈ వారంలో రోజుల్లో లెక్కల్లోకి రాని నగదు, ఇతర సొత్తు భారీగానే పోలీసులు పట్టుకున్నారు. తెలంగాణ నలువైపుల మోహరించి క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే భారీగా సొత్తు లభిస్తోంది. వారం రోజుల వ్యవధిలోనే 101,18,17, 299 రూపాయలను పట్టుకున్నారు. వారం రోజుల్లో పట్టుకున్న సొత్తు గత ఎన్నికల్లో మొత్తంగా పట్టుకున్న దానికి సమానం. గతం ఎన్నికల్లో పోలింగ్‌ జరిగే వరకు పట్టుకున్న సొత్తు 103కోట్ల 89 లక్షల 22 వేల 753 రూపాయలుగా చెప్పారు. ఇందులో కేవలం నగదు 97 కోట్ల 33 లక్షల 61 వేల  72 రూపాయలు. ఇప్పుడు పట్టుకున్న 101 కోట్లలో లెక్కలు చూపని నగదే 55 కోట్ల 99 ల‌క్షల, 26వేల 994 రూపాయలుగా అధికారులు చెబుతున్నారు. మరింత నిఘా పెట్టినట్లు పోలీసులు చెబుతున్నారు.


Also Read: పవన్ కల్యాణ్‌తో కిషన్ రెడ్డి, లక్ష్మణ్ భేటీ - కలిసి పోటీ చేయబోతున్నారా ?