రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం అప్పుడే మొదలైంది. శాంతి భద్రతల పరిరక్షణలో మరింత అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు. నగరంలో ఏర్పాటు చేసిన అతిపెద్ద 125 అడుగుల డా. బీ.ఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన CPలు, SPలతో డీజీపీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. అడిషల్ డీజీలు మహేష్ భగవత్, సంజయ్ కుమార్ జైన్, విజయ్ కుమార్, షికా గోయల్, సందీప్ శాండిల్య, రాచకొండ CP చౌహాన్, IGలు కమలాసన్ రెడ్డి, చంద్ర శేఖర్ రెడ్డి, షా నవాజ్ కాసీం, డీఐజీ రమేష్ రెడ్డి తదితర సీనియర్ పోలీస్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.


సరిహద్దు రాష్ట్రాల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలి


ఎన్నికలు సమీపిస్తున్నందున రాష్ట్రంలో వివిధ రాజకీయ పక్షాలు, సంస్థలు పాదయాత్రలు, బహిరంగ సభలు ఎక్కువగా నిర్వహిస్తాయని, ఈ క్రమంలో శాంతిభద్రతల విభాగం, స్పెషల్ బ్రాంచిల పనితీరు అత్యంత కీలకమని డీజీపీ అంజనీ కుమార్ సూచించారు. లా అండ్ ఆర్డర్‌ పరిరక్షణలో ప్రతీ బందోబస్తు ప్రతీసారి ఒక పరీక్షగా ఉంటుందని అన్నారు. ప్రతీసారి ఎదురయ్యే కొత్త సవాళ్లకు అనుగుణంగా సరికొత్త వ్యూహంతో పనిచేయాలని డీజీపీ సూచించారు. సరిహద్దు రాష్ట్రాలైన ఛత్తీస్ గఢ్, ఝార్ఖండ్ రాష్ట్రాల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా అతివాద పార్టీల సానుభూతిపరులు, మాజీలు, మిలిటెంట్లపై ప్రత్యేక దృష్టిసాధించాలని చెప్పారు.


ప్రజలతో మర్యాదగా ఉండండి! 
సామాన్య ప్రజలు, పోలీస్ స్టేషన్‌కు వచ్చే వారితో పోలీస్ శాఖ సిబ్బంది, అధికారుల ప్రవర్తన మర్యాదపూర్వకంగా ఉండాలని డీజీపీ స్పష్టం చేశారు. ఏ ప్రాంతంలోనైనా పోలీస్ అధికారులు అమర్యాద పూర్వకంగా ప్రవర్తిస్తే అది మొత్తం పోలీస్ శాఖకే మచ్చగా ఉంటుందని హెచ్చరించారు. పోలీస్ అధికారుల గ్రామాల సందర్శన కార్యక్రమానికి ప్రజల నుండి విశేష ఆదరణ లభిస్తోందని, ఈ విధానాన్ని మరింత పటిష్టంగా కొనసాగించాలని పోలీసు ఉన్నతాధికారులను డీజీపీ ఆదేశించారు.


గ్రామాలకు వ్యాపించిన సైబర్ నేరాలు 
మన రాష్ట్రంలోనూ  సైబర్ నేరాలు పెరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు డీజీపీ అంజనీకుమార్. సైబర్ నేరాల పట్ల ప్రజలను చైతన్య పర్చడానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆయన పేర్కొన్నారు. సైబర్ క్రైమ్ కేవలం నగరాలు, పట్టణాలకే పరిమితం కాలేదని ఇది గ్రామాలకూ వ్యాపించిందని అన్నారు. సైబర్ నేరాల నివారణకు కేవలం ప్రజల చైతన్యమే మార్గమని తెలిపారు. ఇందుకు రాష్ట్రంలోని ప్రతీ పోలీస్ స్టేషన్లో కనీసం పదిమంది పోలీస్ అధికారులకు సైబర్ క్రైమ్ నివారణలో ప్రత్యేక శిక్షణ నివ్వాలని ఆదేశించారు. ఇటీవల కాలంలో సోషల్ మీడియా విస్తృతి గణనీయంగా పెరిగిందని, ఈ క్రమంలో పోలీస్ విభాగాల్లోని సోషల్ మీడియాను మరింత పటిష్ట పర్చుకోవాలని డీజీపీ సూచించారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలతో ఎక్కువ మంది చనిపోతున్నారని, సంబంధిత రోడ్లు, భవనాల శాఖ అధికారులతో కలసి ప్రమాదాలు జరిగే హాట్ స్పాట్లను గుర్తించి,  రోడ్ ఇంజనీరింగ్ చేపట్టాలని పోలీస్ అధికారులకు సూచించారు. రంజాన్ పండగ నేపథ్యంలో గోవుల అక్రమ రవాణా జరగకుండా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లతో పాటు అన్ని జిల్లాల పోలీస్ అధికారులు ప్రత్యేక నిఘా వహించాలని ఆదేశించారు.


నవ సమాజ నిర్మాణానికి పోలీసులు పునరంకితం కావాలి


డా. బీ.ఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో నవసమాజ నిర్మాణానికి రాష్ట్రంలోని పోలీస్ అధికారులు పునరంకితం కావాలని డీజీపీ అంజనీ కుమార్ పిలుపునిచ్చారు. డీజీపీ కార్యాలయంలో డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలర్పించి నివాళులర్పించారు. దేశంలో మరెక్కడా లేనంతగా అతిపెద్ద 125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం ఒక అదృష్టమని తెలిపారు.