Telangana DGP Anjani Kumar: హైదరాబాద్‌ లో ఈ నెల 28 నుంచి జూన్‌ 17 మధ్య అత్యంత ప్రతిష్టాత్మక జీ-20 వర్కింగ్‌ గ్రూప్‌ సమావేశాలు ( G20 meetings in Hyderabad) జరుగనున్నాయి. ఈ క్రమంలో భద్రతపై కార్యాలయంలో తెలంగాణ డీజీపీ అంజనీకుమార్‌ అధ్యక్షతన జీ-20 సెక్యూరిటీ సమన్వయ సమావేశం జరిగింది. సమావేశానికి రాష్ట్ర సీనియర్ పోలీస్ అధికారులతోపాటు, ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్ ఇండియా, రీజినల్ పాస్‌పోర్ట్‌ ఆఫీస్‌, ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌, ఎన్‌ఎస్‌జీ తదితర శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ ప్రపంచంలోని 85 శాతం జీడీపీ, 75శాతం గ్లోబల్ వాణిజ్యాన్ని శాసించే 29 దేశాలు సభ్యులుగా ఉన్న అత్యంత ప్రతిష్టాత్మక జీ-20 దేశాల అధినేతల అత్యున్నత సమావేశం ప్రధాని నేతృత్వంలో సెప్టెంబర్‌లో జరుగనుందని తెలిపారు.
హైదరాబాద్‌లో ఆరు సమావేశాలు
ఈ అత్యున్నత సమావేశానికి ముందస్తుగా దేశంలోని 56 నగరాల్లో 215 వర్కింగ్ గ్రూప్‌ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో ఆరు సమావేశాలు జరగనున్నాయని వెల్లడించారు. జనవరి 28న తొలి సమావేశం జరగనుండగా, మార్చి 6,7, ఏప్రిల్ 26, 27, 28, జూన్ 7, 8, 9, జూన్ 15, 16 ,17న వివిధ మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో వర్కింగ్ గ్రూప్ సమావేశాలు జరుగుతాయని తెలిపారు. ఈ సమావేశాలకు మంత్రులు, కార్యదర్శులు, జాయింట్ సెక్రెటరీ స్థాయి అధికారులు, నుంచి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు.
భద్రతా విభాగాల మధ్య సమన్వయం అవసరం
ఈ సమావేశాలు సజావుగా, ఎలాంటి భద్రతాపరమైన అవాంతరాలు లేకుండా నిర్వహించేందుకు భద్రతా విభాగాల మధ్య సమన్వయం అవసరమని అంజనీకుమార్‌ అన్నారు. ఈ సమావేశాలకు హాజరయ్యే ఉన్నతస్థాయి ప్రతినిధులు నగరంలో ప్రముఖ పర్యాటక ప్రాంతాలను కూడా సందర్శించే అవకాశం ఉందని, ఆయా ప్రాంతాల్లో విస్తృత భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ విషయంలో సమర్థవంతమైన సమన్వయం కోసం అంతర్గత వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకొని ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించాలని సూచించారు. ఈ సమావేశాలకు హాజరయ్యే ప్రతీ ఒక్కరి యాంటిడేన్స్‌లను పక్కాగా పరిశీలించాలని కోరారు.
నగరంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్‌
ప్రధానంగా ఎయిర్‌పోర్ట్‌, ప్రతినిధులు బస చేసే హోటళ్లు, సమావేశాలు జరిగే ప్రాంతాల్లో విస్తృత బందోబస్తు ఏర్పాటు చేయాలని హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లను ఆదేశించారు. ఎయిర్‌పోర్ట్‌తో పాటు నగరంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో అడిషనల్ డీజీలు అభిలాష బిస్త్, సంజయ్ కుమార్ జైన్, స్వాతి లక్రా, విజయ కుమార్, నాగిరెడ్డి, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, హైదరాబాద్ అడిషనల్ సీపీ విక్రమ్ సింగ్ మాన్, డీఐజీ తఫ్సీర్ ఇక్బాల్, ట్రాఫిక్ అడిషనల్ సీపీ సుధీర్ బాబు, హోం మంత్రిత్వ శాఖ ఎస్‌ఐబీ డీడీ సంబల్ దేవ్, రాజీవ్ గాంధీ ఎయిర్‌పోర్ట్‌ జీఎస్‌ఓ భారత్ కందార్, డిప్యూటీ పాస్ పోర్ట్ ఆఫీసర్ ఇందు భూషణ్ లెంక, ఎన్డీఆర్‌ఎఫ్‌ దామోదర్ సింగ్, సీఐఎస్‌ఎఫ్‌కు చెందిన సింగన రామ్, ఎన్ఎస్‌జీ కల్నల్ అలోక్ బిస్త్, జీఏడీ ప్రోటోకాల్ అధికారి కే తదితర సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు.