Mahalakshmi Scheme: తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తోంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు దిశగా అడుగులు వేస్తోంది.  ఆరు గ్యారెంటీల్లో ఉప్పటికే రెండింటిని అమలు చేస్తున్నారు రేవంత్‌రెడ్డి సర్కార్‌... మహిళ కోసం మరో పథకాన్ని త్వరలోనే అమలు చేయనుంది. నెలఖారులోగా ప్రతి  మహిళకు 2వేల 500 రూపాయలు ఇచ్చే స్కీమ్‌ను అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది.


అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే... ఆరుగ్యారెంటీలు అమలు చేస్తామన్ని ఎన్నికల ముందు హామీ ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీ. ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు  ప్రయత్నిస్తోంది. పవర్‌లోకి వచ్చిన మూడు రోజుల్లోనే రెండు హామీలను అమలు చేసి చూపించింది. ఇప్పటికే తెలంగాణలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం  కల్పిస్తోంది. అందుకోసం జీరో టికెట్‌ విధానం కూడా తెచ్చింది. ఆధార్‌ కార్డుతోపాటు.. ఏదైనా ఐడెంటీ కార్డు చూపించి.. ఆర్టీసీ బస్సులు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఉచితంగా  ప్రయాణించే అవకాశం కల్పిస్తోంది. ఈ అవకాశాన్ని దాదాపుగా రాష్ట్ర మహిళలంతా వినియోగించుకుంటున్నారు. దీంతో ఆర్టీసీ బస్సులన్నీ ఎప్పుడూ ఫుల్లుగానే  కనిపిస్తున్నాయి. ఇక రెండోది... రాజీవ్‌ ఆరోగ్యశ్రీ బీమా. ఈ పథకం కింద పరిమిమితిని ఐదు లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచింది కాంగ్రెస్‌ ప్రభుత్వం. పేద  ప్రజలంతా ఈ పథకాన్ని వినియోగించుకోవాలని సూచించింది. ఇక ఇప్పుడు మరో ప్రధానమైన హామీని అమలు చేసేందుకు సిద్ధమవుతోంది కాంగ్రెస్‌ పార్టీ. ఈ జనవరి  నెలాఖరులోగా ఈ పథకానికి శ్రీకారం చుట్టాలని భావిస్తోంది. 


నెలాఖరులోగా మహాలక్ష్మీ పథకం కింద రూ.2,500మహాలక్ష్మీ పథకంలో భాగంగా మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయాన్ని అందిస్తామని ఎన్నికల ముందు హామీ  ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీ. ఆ హామీని అమలు చేసేందుకు అడుగులు ముందుకు వేస్తోంది. నెలాఖరులో మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయాన్ని అందించే పథకాన్ని  ప్రాంరభించాలని ప్లాన్‌ చేస్తోంది. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ రాకముందే ఈ పథకాన్ని అమలు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే ఆర్థక శాఖతో చర్చించినట్లు సమాచారం.  వచ్చే నెలలో మహిళల ఖాతాల్లో రూ.2,500 జమ చేసేలా చూడాలని అధికారులు ఆదేశించినట్లు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. 


ఆరు గ్యారెంటీ పథకాల అమలు కోసం.. ఇప్పటికే దరఖాస్తు ఫారాలు తీసుకుంటోంది కాంగ్రెస్‌ ప్రభుత్వం. అన్ని పథకాలకు ఒకే దరఖాస్తు విధానాన్ని తీసుకొచ్చింది.  ప్రజాపాలన పేరుతో గ్రామ, వార్డు సభలు ఏర్పాటు చేసి.. దరఖాస్తులు స్వీకరిస్తోంది. దరఖాస్తుల స్వీకరణకు జనవరి 6వ తేదీ వరకే సమయం ఉంది. అర్హులంతా ఆలోగా  సంక్షేమ పథకాలకు అప్లై చేసుకోవాలని సూచించింది. దరఖాస్తుల ఆధారంగా... మహాలక్ష్మి పథకానికి లబ్దిదారులను ఎంపిక చేసి.. నెలకు రూ.2,500 ఇచ్చే పథకాన్ని అమలు  చేయబోతోంది రేవంత్‌రెడ్డి సర్కార్‌. తెలంగాణ మహిళలు కూడా నెలకు రూ.2,500 పథకం ఎప్పుడెప్పుడు అమలు చేస్తారా అని ఎదురుచూస్తున్నారు. దీంతో... వీలైంత త్వరగా  ఈ స్కీమ్‌ను అమల్లోకి తెచ్చేందుకు కసరత్తు మొదలుపెట్టింది. 


ఒకవేళ లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్‌ వస్తే... ఎన్నిక కోడ్‌ అమల్లోకి వస్తుంది. దీంతో పథకాల అమలు ఆలస్యమవుతుంది. అదే జరిగితే... లోక్‌సభ ఎన్నికల వేళ ప్రతిపక్షాలు  ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేసే అవకాశం ఉంటుంది. ఆ అవకాశం ప్రతిపక్షాలకు ఇవ్వకుండా... మహిళలకు ఇచ్చిన మాట ప్రకారం నెలకు రూ.2,500 ఆర్థిక సాయాన్ని త్వరగా  అమలు చేసే పనిలో ఉంది తెలంగాణ ప్రభుత్వం. లోక్‌సభ నోటిఫికేషన్‌ వచ్చేలోగా ఈ పథకాన్ని ఆచరణలో పెట్టాలని.. వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే కర్ణాటక,  మధ్యప్రదేశ్‌తో పాటు మరికొన్ని రాష్ట్రాల్లోనూ ఇలాంటి పథకాలే అమల్లో ఉన్నాయి. దీంతో ఆ పథకాలపై అధ్యయం చేసి, ఎంత ఖర్చు అవుతుందో తెలపాలని అధికారులకు  సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించినట్టు సమాచారం.