Revanth Reddy: రాహుల్ గాంధీ మాట ప్రకారం మాదిగలకు న్యాయం చేసి తీరుతాం- రేవంత్ రెడ్డి
Global Madiga Day 2024 | ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ ఇచ్చిన మాట మేరకు తెలంగాణలో మాదిగలకు కచ్చితంగా న్యాయం చేస్తామని గ్లోబల్ మాదిగ డే కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Telangana News | హైదరాబాద్: మాదిగలకు సంబంధించి అనుకూల నిర్ణయం తీసుకుంటామని సార్వత్రిక ఎన్నికల సమయంలో, తెలంగాణలో ఎన్నికల ప్రచారంలోనూ రాహుల్ గాంధీ స్పష్టమైన ప్రకటన చేశారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ అంశంలో కాంగ్రెస్ పార్టీ విధానం స్పష్టంగా తెలియజేశామన్నారు.
తెలంగాణ ప్రభుత్వం కీలక పాత్ర
గ్లోబల్ మాదిగ డే-2024 కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ‘తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సుప్రీంకోర్టు (Supreme Court)లో పెండింగ్ లో ఉన్న మాదిగ ఉపకులాల రిజర్వేషన్ల కేసులో బలమైన వాదనలు వినిపించేలా మంత్రి దామోదర రాజనర్సింహ నేతృత్వంలో లాయర్లను నియమించాం. సుప్రీంకోర్టులో తీర్పు దానంతట అదే రాలేదు. తెలంగాణ ప్రభుత్వం క్రియాశీలక పాత్ర పోషించింది. సుప్రీంకోర్టు తీర్పును తూచా తప్పకుండా అమలు చేస్తుందని తెలంగాణ శాసనసభ వేదికగా స్పష్టంగా ప్రకటించాం.
ప్రజల ఆకాంక్ష మేరకు నిర్ణయాలు
తెలంగాణ సమస్యలా మాదిగల సమస్య జఠిలం అయింది. కానీ ప్రజల ఆకాంక్ష మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మీ వాదనలో బలం ఉంది. మాదిగలకు న్యాయం చేయాలన్న ఆలోచన మా ప్రభుత్వానికి ఉంది. న్యాయపరమైన చిక్కులు రాకుండా అమలు చేసేలా అధ్యయనం చేసేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటు చేశాం. 60 రోజుల్లో నివేదిక ఇవ్వాలని జ్యుడీషియల్ కమిషన్ ను మా ప్రభుత్వం నియమించింది. మరో వారం రోజుల్లో కమిషన్ తమ నివేదిక ప్రభుత్వానికి ఇచ్చే అవకాశం ఉంది.
సీఎం పేషీలో మాదిగలు ఉండాలన్న ఆలోచనతో డా.సంగీతని నియమించుకున్నాం. 100 ఏళ్ల ఉస్మానియా యూనివర్సీటీ (Osmania University) చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వీసీగా ఒక మాదిగని నియమించాం. IIT వీసీగా, విద్యా కమిషన్ మెంబర్ గా, ఉన్నత విద్యా శాఖలో మాదిగ సామాజిక వర్గానికి అవకాశం కల్పించాం. స్కిల్ యూనివర్సిటీ బోర్డు డైరెక్టర్ గా పగిడి పాటి దేవయ్యను నియమించుకున్నాం.
మాదిగ సామాజిక వర్గానికి అందరికంటే ఎక్కువ అవకాశాలు కల్పిస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగలకు అన్యాయం జరగనివ్వదు. న్యాయం చేసేందుకు అన్ని విధాలా కృషి చేస్తాం. కొన్ని నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేయడంలో కొంత ఆలస్యం కావచ్చు. కానీ మీకు తప్పక న్యాయం చేస్తాం. నా రాజకీయ ప్రస్థానంలో మాదిగ సామాజిక వర్గం పాత్ర ఎంతో ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో మీకు న్యాయం చేసే బాధ్యత నాది’ అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Also Read: Jamili Elections: 2029 కూడా కాదు పూర్తి స్థాయి జమిలీ 2034లోనే - బిల్లులో బయటకు రాని సంచలన విషయం ఇదే!