Telangana CM Revanth Reddy | హైదరాబాద్: సొనాటా సాఫ్ట్‌వేర్ సంస్థ నూతన ఫెసిలిటీ సెంటర్‌ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సొనాటా సాఫ్ట్‌వేర్ (Sonata Software) అత్యాధునిక AI ని ఉపయోగించి పర్యావరణ వ్యవస్థలను రూపొందించడం గర్వకారణం అన్నారు. హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ రంగంతో పాటు లైఫ్ సైన్సెస్‌ రంగం, ఇంకా పలు రంగాల్లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్‌కు హబ్‌గా మారిందన్నారు. ఈ సందర్బంగా సొనాటా సాఫ్ట్‌వేర్ సంస్థ ఉద్యోగులు, యాజమాన్యం, అందరికీ అభినందనలు తెలిపారు.

అటు అభివృద్ధి, ఇటు సంక్షేమం

హైదరాబాద్ AI-రెడీ డేటా సెంటర్లు, తయారీ రంగాలకు కేంద్రంగా మారింది. మైక్రోసాఫ్ట్, HCL టెక్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, విప్రో వంటి ఐటీ దిగ్గజాలు తమ క్యాంపస్‌లను మన వద్ద విస్తరిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రైతులు, మహిళలు, విద్యార్థులు, యువత, సీనియర్ సిటిజన్ల సంక్షేమం కోసం పనిచేస్తూనే మరోవైపు పరిశ్రమలకు మద్దతిస్తూ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది.

రూ. 3 లక్షల కోట్ల పెట్టుబడులు, 1 లక్షకు పైగా ఉద్యోగాలు డిసెంబర్ 2023 నుంచి ఇప్పటివరకు తెలంగాణకు కొత్తగా రూ. 3 లక్షల కోట్ల పెట్టుబడులు తేవడంతో పాటు రాష్ట్రంలో 1 లక్షకు పైగా ఉద్యోగాలు సృష్టించాం. 2025లో స్విట్జర్లాండ్ లోని దావోస్‌లో జరిగిన ఆర్థిక సదస్సులో పాల్గొని తెలంగాణ రూ. 1.78 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా నిలిచింది. దేశీయంగా, అంతర్జాతీయంగా పెట్టుబడుల ఆకర్షణలో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. పోలీస్ వ్యవస్థ, శాంతిభద్రతలు, ద్రవ్యోల్బణం ఉద్యోగాల సృష్టి, పన్నుల వసూళ్లలో నంబర్ వన్ గా నిలిచాం. 

ఫ్యూచర్ సిటీలో ఏఐ సిటీ66 లక్షల స్వయం సహాయక బృందాల ద్వారా మహిళా సాధికారత, రాజీవ్ యువ వికాసం ద్వారా యువత వ్యాపారాలు, స్వయం ఉపాధికి అవసరమైన నిధులు ప్రభుత్వం అందిస్తోంది. హైదరాబాద్ ట్రాఫిక్ విధుల నిర్వహణలో ట్రాన్స్‌జెండర్ స్వచ్ఛంద సేవకులను నియమించిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఫ్యూచర్ సిటీలో AI నగరం, డ్రై పోర్టు నిర్మాణం, ఆంధ్రప్రదేశ్ సముద్ర ఓడరేవుతో అనుసంధానం, యంగ్ ఇండియా స్కిల్స్, స్పోర్ట్స్ యూనివర్సిటీలు, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం జరుగుతోంది. ప్రపంచంలోనే గొప్ప ఈవెంట్లలో ఒకటైన మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్‌ వేదికగా జరుగుతున్నాయి. మరిన్ని ప్రపంచ ఈవెంట్‌లను రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.

తెలంగాణ రైజింగ్ ప్రోగ్రామ్స్ ద్వారా ఆర్థికాభివృద్ధి, పెట్టుబడులు, ఉద్యోగాలు, మౌలిక సదుపాయాలు, సంక్షేమం రెండూ జరుగుతున్నాయి. ఒక ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా ఎదగడంలో, హైదరాబాద్‌ను అత్యద్భుత నగరంగా మార్చడంలో అందరి సహకారం కోరుతున్నాం. హైదరాబాద్‌కు బ్రాండ్ అంబాసడర్లుగా మారండి. రాష్ట్ర విజయాలను ప్రపంచానికి చూపాలని’ కోరారు. 

ఇన్వెస్టర్లకు ప్రభుత్వం సహకారం, ప్రోత్సహకాలు

తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల కల్పనతో పాటు మహిళలు, రైతులు అన్ని వర్గాల వారి సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చిందన్నారు రేవంత్ రెడ్డి. దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్‌గా నిలుస్తోందని.. ప్రజా ప్రభుత్వంలో హామీల అమలు చేసి తీరుతామని చెప్పారు. పెట్టుబడుదారులకు హైదరాబాద్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారిందని.. ఇస్వెస్టర్లకు తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహకాలు ఇస్తుందని రేవంత్ రెడ్డి ఆహ్వానించారు.