Telangana CM Revanth Reddy gave plot to Darshanam Mogilaiah | హైదరాబాద్: ప్రముఖ కిన్నెర మెట్ల వాయిద్యకారుడు, పద్మశ్రీ దర్శనం మొగిలయ్యకు తెలంగాణ ప్రభుత్వం చేయూత అందించింది. దర్శనం మొగిలయ్యకు తెలంగాణ ప్రభుత్వం ఇంటి స్థలాన్ని అందించింది. హయత్ నగర్ లో 600 చ. గజాల స్థలాన్ని కేటాయించి, ఇంటి స్థలం ధ్రువపత్రాలను మొగిలయ్యకు సీఎం రేవంత్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ పాల్గొన్నారు. తనకు ఇంటి స్థలం కేటాయించి, పత్రాలు అందించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి, ఎమ్మెల్యే వంశీకృష్ణకు దర్శనం మొగిలయ్య కృతజ్ఞతలు తెలిపారు. 


ఆ మధ్య పొట్ట కూటి కోసం మొగిలయ్య కూలీ పనులు చేయడం సంచలనంగా మారింది. తుర్కయాంజల్‌లో ఓ ఇంటి వద్ద పని చేస్తున్న సమయంలో తీసిన వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారాయి.  గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన కళాకారుల పెన్షన్ ఆపివేయడంతో పద్మశ్రీ మొగిలయ్య కూలీ పని చేస్తున్నారని ప్రచారం జరిగింది. దీనిపై స్పందించిన కేటీఆర్.. వాయిద్యకారుడు మొగిలయ్యను కలిసి అండగా నిలిచారు. మొగిలయ్యకు కొంత మేర ఆర్థిక సాయాన్ని అందించారు. కళాకారుల పెన్షన్ తో పాటు అన్ని రకాల హామీలను నెరవేర్చాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కేటీఆర్ కోరారు. మొగిలయ్య లాంటి కళాకారుడు ఉండటం రాష్ట్రానికి గర్వకారణం అన్నారు.






భీమ్లా నాయక్‌లో పాటతో సెన్సేషన్.. పద్మశ్రీ సైతం


మొగిలయ్యకు పవర్ స్టార్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ లో అవకాశం రావడంతో ఫేమస్ అయ్యారు. భీమ్లా నాయక్ పాట ద్వార రాత్రికి రాత్రే సెన్సేషన్ గా మారినా.. ఆయనకు ఆర్థిక కష్టాలు తీరలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కోటి రూపాయలు ఆర్థికసాయంతో పాటు 600 గజాలలో ఇంటి స్థలం ఇచ్చామని హామీ ఇచ్చింది. నగదు మొత్తాన్ని ఇచ్చారు. అంతలోనే ఎన్నికలు రావడం ప్రభుత్వం రావడంతో మొగిలయ్యకు సాయం అందలేదు. పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగిలయ్య ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకున్న తెలంగాణ ప్రభుత్వం హయత్ నగర్ లో ఇంటి స్థలాన్ని కేటాయించింది. ఆ ఇంటి పత్రాలను సీఎం రేవంత్ రెడ్డి మొగిలయ్యకు మంగళవారం అందజేశారు.


Also Read: Devara Runtime: 'ఆర్ఆర్ఆర్', 'యానిమల్' కంటే రన్ టైమ్ తక్కువే - మూడు గంటలోపే 'దేవర'!