Telangana: తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం రాత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణా జలాలపై కీలక చర్చ జరగింది. తెలంగాణలోనే 70 శాతం నది ఉన్నందున కచ్చితంగా 70 శాతం నీళ్లు సాధించాలని అధికారులకు ఆదేశించారు. ప్రస్తుతానికి నిర్మాణ దశలో ఉన్న ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని పేర్కొన్నారు. రాబోయే రెండేండ్లలో అంటే 2027 జూన్ నాటికి కృష్ణాపై అసంపూర్తిగా ఉన్న సాగు నీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని తెలిపారు. అందుకు అనుగుణంగా నిర్ణీత గడువుతోపాటు లక్ష్యాలను నిర్దేశించుకోవాలని చెప్పారు.

వాటిపై మొదట ఫోకస్

తక్కువ ఖర్చుతో పూర్తి అయ్యే ప్రాజెక్టుల పనులను మొదట వేగంగా చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. కృష్ణా బేసిన్‌లో ప్రాధాన్యంగా ఎంచుకున్న ప్రాజెక్టులకు నిధులకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆర్థిక శాఖను సీఎం ఆదేశించారు. భూసేకరణ వేగంగా పూర్తి అయ్యేందుకు రెవెన్యూ విభాగంతోనూ సమన్వయం చేసుకోవాలని.. స్పెషల్ ఆఫీసర్లు పనులను వేగవంతం చేయాలని చెప్పారు. 

జలసౌధలోనే సమీక్ష

ఇటీవల కొత్తగా ఉద్యోగాలకు ఎంపికైన 244 మంది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, 199 మంది జూనియర్ టెక్నికల్ ఆఫీసర్లకు బుధవారం సాయంత్రం జలసౌధ ప్రాంగణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రాలను అందించారు. అనంతరం రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి జలసౌధలోనే సమీక్ష నిర్వహించారు. 

సూదిని జైపాల్ రెడ్డి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఉద్దండాపూర్ వరకు మొదటి ప్రాధాన్యంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఉద్దండాపూర్ వరకు పెండింగ్‌లో ఉన్న పనులు 18 నెలల్లో పూర్తి చేయాలని, అందుకు వీలుగా కార్యాచరణ ప్రణాళిక చేసుకోవాలని చెప్పారు. కోయిల్ సాగర్ లిఫ్ట్ ప్రాజెక్టును కూడా వచ్చే ఏడాది జూన్‌లోగా పూర్తి చేయాలని చెప్పారు.

వాటాల సాధనలో రాజీ పడొద్దు

మహాత్మగాంధీ కల్వకుర్తి లిఫ్ట్, జహహర్ నెట్టెంపాడు లిఫ్ట్, రాజీవ్ బీమా లిఫ్ట్ ప్రాజెక్టులను ఈ ఏడాది డిసెంబర్‌లోపు పూర్తి చేయాలని నిర్ణయించారు. వీటికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న పనులు, కావాల్సిన నిధుల వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణ‌కు న్యాయ‌బ‌ద్ధంగా రావాల్సిన వాటాల సాధనకు చేస్తున్న ప్రయత్నాలను మరింత ముమ్మరం చేయాలని  ఆదేశించారు. తెలంగాణ ప్రయోజనాలకే ప్రాధాన్యత  ఇవ్వాలని అన్నారు.

కృష్ణలో 70 శాతం మనదే!

కృష్ణా న‌ది ప‌రివాహ‌క ప్రాంతం సుమారు 70 శాతం తెలంగాణ‌లో ఉంటే కేవ‌లం 30 శాతం మాత్రమే ఏపీలో ఉన్నందున.. కృష్ణా జ‌లాల్లో 70 శాతం వాటా తెలంగాణ రాష్ట్రానికి తెచ్చుకునేలా ట్రైబ్యునల్ ఎదుట పట్టుబట్టాలని చెప్పారు. గోదావరి బేసిన్ నుంచి పట్టిసీమ ద్వారా ఏపీ తీసుకుంటున్న 90 టీఎంసీలను ఎగువన వాడుకునేలా నీటి కోటా పెంచుకోవాలని చెప్పారు. ఈ అంశాలన్ని కృష్ణా బోర్డు దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నాటికి కృష్ణాపై నిర్మాణంలో ఉన్న అన్ని ప్రాజెక్టులకు కేటాయించిన నిర్ణీత నీటి వాటాల విషయంలో ప్రభుత్వ వాదనలు సమర్థంగా ఉండాలని అప్రమత్తం చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు చేపట్టేటప్పుడు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం నీటి వాటాల  అనుమతులు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు.