Telangana CM Revanth Reddy:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి బనకచర్ల ప్రాజెక్టుపై సలహా ఇచ్చి తెలంగాణ గొంతు కోశారని కేసీఆర్పై తెలంగాణ సీఎం మరోసారి విరుచుకుపడ్డారు. రైతు భరోసా విజయోత్సవ సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి... ప్రజాప్రభుత్వంలో మొదటి ప్రాధాన్యత రైతులేనని ఆ తరువాత ఆడబిడ్డలు, ఉద్యమకారులు, విద్యార్థులని తెలిపారు. రాష్ట్రంలో 70 లక్షల మంది రైతులు పండుగ చేసుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణ రైతాంగం అండతో చిన్న వయసులో తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశం దక్కిందని అన్నారు. తెలంగాణకు అన్యాయం చేసిన వాళ్లంతా ఇప్పుడు గోదావరి నీళ్లను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణ చరిత్ర, పోరాటాలు, త్యాగాలు భూమి చుట్టూనే సాగాయన్నారు ముఖ్యమంత్రి. ఉన్న ఊరిని, సొంత భూమిని తల్లిదండ్రులతో సమానంగా చూసుకుంటామన్నారు. నాడు కెసీఆర్ రైతు బంధు ఎగ్గొడితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రూ.7625 కోట్ల నిధులను విడుదల చేశామని గుర్తు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం అప్పుల్లో కూరుకుపోయిన రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి ఆత్మగౌరవాన్ని నిలబెట్టామన్నారు. 25 లక్షల 35 వేల 964 మంది రైతులకు రూ. 20 వేల 617 కోట్లు వారి ఖాతాల్లో వేసి రుణవిముక్తులను చేశామని లెక్కలు వివరించారు.
ఆగస్టు 15, 2024న రైతులను రుణ విముక్తులను చేశామని రేవంత్ రెడ్డి చెప్పారు. ఆనాడు వరి వేసుకుంటే ఉరి వేసుకున్నట్టే అని కేసీఆర్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వం వ్యాపారం చేయదు.. వడ్లు కొనం అని మాట్లాడారని ఎద్దేవా చేశారు. కానీ ప్రజా ప్రభుత్వంలో వరి పండించండి.. చివరి గింజ వరకు కొనడమే కాదు, మద్దతు ధరతో పాటు బోనస్ ఇస్తామని మాట ఇచ్చామన్నారు. ఆ మాటపై నమ్మకంతో రైతులు దేశంలోనే అత్యధికంగా వరి పండించే రాష్ట్రంగా నిలబెట్టారన్నారు. 2 కోట్ల 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించి దేశంలోనే తెలంగాణను మొదటి స్థానంలో నిలిపారన్నారు.
దళారుల దోపిడీని నిలువరించి రైతును ఆదుకున్న చరిత్ర ప్రజాప్రభుత్వానిదిగా రేవంత్ చెప్పుకొచ్చారు. సాంబ వడ్లకు మద్దతు ధరతోపాటు రూ. 500 బోనస్ అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే అన్నారు. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను క్యాన్సర్ బారిన పడేసి అప్పగించారని కేసీఆర్పై మండిపడ్డారు. మామ శకుని అయితే అల్లుడు శనీశ్వరుడని విమర్శించారు. శకుని మామకు తగ్గట్టు శనీశ్వర అల్లుడు జమై రైతులకు ఏం చేశారని మాట్లాడతుండ్రని ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి. ఆనాడు రైతు భరోసా ఇవ్వాలంటే కోకాపేటలో భూములు అమ్మారని గుర్తు చేశారు. రైతు రుణమాఫీ చేయాలంటే ఔటర్ రింగ్ రోడ్డును కూడా అమ్మేశారని అన్నారు. రైతుల పేరుతో అప్పులు చేసి దోచుకున్నారని... రైతులకు నీళ్లిస్తామని కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లు కొల్లగొట్టిండ్రని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ముసుగులో, రైతు సెంటిమెంట్ ఆదాయ వనరుగా మార్చుకున్నారని.. వేల కోట్లు సంపాదించుకున్నారని మండిపడ్డారు.
తెలంగాణ రాష్ట్రం రాకముందు కేసీఆర్ కుటుంబ ఆర్ధిక పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఏంటీ అని రైతు భరోసా విజయోత్సవ సభ నుంచి ప్రశ్నించారు. "మొయినాబాద్లో హరీష్ రావుకు ఫామ్ హౌస్ ఎట్లా వచ్చింది? జన్వాడలో కేటీఆర్కు, గజ్వేల్లో కేసీఆర్కు ఫామ్ హౌస్లు ఎట్లా వచ్చినయ్? మీరు వేల కోట్ల అధిపతులయ్యారు? రాష్ట్రానికి 8 లక్షల కోట్ల అప్పు ఎలా వచ్చింది?" అని నిలదీశారు. పదేళ్లలో నిజాం నవాబుల కంటే ధనవంతులయ్యారు.. కానీ ధనిక రాష్ట్రమైన తెలంగాణ ఇవాళ దివాళా తీసిందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
పదేళ్లు బీఆర్ఎస్ వాళ్లు చేయలేనిది మేం మొదటి ఏడాదిలోనే 60 వేల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేశామన్నారు రేవంత్ రెడ్డి. లెక్కబెట్టుకుంటమంటే ఎల్బీ స్టేడియంలో తలలు లెక్కగట్టి అప్పచెప్పి నిరూపిస్తానన్నారు. పదేళ్లలో మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో ప్రజలకు సమాధానం చెప్పగలవా అని కేసీఆర్ను ప్రశ్నించారు. 18 నెలల్లో 1 లక్షా 4 వేల కోట్లు కేవలం రైతుల కోసం ఖర్చు చేసిన రైతు ప్రభుత్వం తమదని చెప్పారు. రైతును రాజుగా చేసి వ్యవసాయాన్ని పండుగ చేసిన ప్రజా పాలన తమదని వివరించారు. దీనిపై చర్చకు కేసీఆర్ సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నించారు.
కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లు కొల్లగొడితే.. 18 నెలల్లో రైతుల కోసం 1 లక్షా 4 వేల కోట్లు ఖర్చు చేసి రైతులను ఆదుకున్న చరిత్ర తమదని వివరించారు రేవంత్ రెడ్డి. వ్యవసాయాన్ని పండుగ చేయాలన్న ఉక్కు సంకల్పంతో ప్రజాప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ఆలోచన చేసి అంచనాకు రావాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
పదేళ్ల వాళ్ల పాలన ఎలా ఉందో.. 18 నెలల మా పాలన ఎలా ఉందో చర్చ పెట్టాలని ప్రజలకు రేవంత్ పిలుపునిచ్చారు. కెసీఆర్.. కుట్రలు కుతంత్రాలతో కాంగ్రెస్ హయాంలో మొదలుపెట్టిన సాగునీటి ప్రాజెక్టులను ఒక్కటి కూడా పూర్తి చేయలేదన్నారు. కాళేశ్వరం కూలేశ్వరమై లక్ష కోట్లు గోదావరిలో కలిసిపోయినాయ్ అన్నారు. ప్రాజెక్టు కూలిపోయినందుకు నిన్ను కాళేశ్వరంలోనే ఉరి తీసినా తప్పు లేదని అక్కడి రైతాంగం అంటున్నది నిజం కాదా? అని ప్రశ్నించారు. కెసీఆర్ కాంట్రాక్టర్లకు 2 లక్షల కోట్లు చెల్లించారని, మరి వెయ్యి కోట్లతో పూర్తి కావాల్సిన కల్వకుర్తి ఎందుకు ఆగిపోయిందని ప్రశ్నించారు. 300 కోట్లతో పూర్తి కావాల్సిన భీమా, 200 కోట్లతో పూర్తి కావాల్సిన నెట్టెంపాడు ఎందుకు పూర్తి కాలేదన్నారు. 6 వేల కోట్లతో పూర్తి కావాల్సిన సీతారామ ప్రాజెక్టు ఎందుకు ఆగిపోయిందని నిలదీశారు. దేవాదుల పూర్తి చేస్తే 4 వేల ఎకరాలు సాగయ్యేవి.. ఎందుకు పూర్తి చేయలేదని అడిగారు.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టులపై సీమాంధ్రులు నిర్లక్ష్యం వహించారన్న కేసీఆర్.. పదేళ్లలో ఇంకొక్క ప్రాజెక్టునైనా పూర్తి చేశారా అని రేవంత్ ప్రశ్నించారు. ఈ దుర్మార్గానికి ఆయన, ఆయన కుటుంబం కారణం కాదా? అని నిలదీశారు. లక్ష కోట్లు దోచుకుని, వేల ఎకరాలు ఆక్రమించుకుని బనకచర్ల విషయంలో తనపై దుర్మార్గపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను చంద్రబాబుతో అంటకాగాలనుకుంటే అక్కడే ఉండేవాణ్ణి కదా? రాజీవ్ గాంధీ ఆశీర్వాదం తీసుకునేందుకు ఇక్కడికి ఎందుకు వచ్చేవాడిని కేసీఆర్ అని ప్రశ్నించారు. సోనియమ్మను నమ్మకద్రోహం చేసిన చరిత్ర నీదైతే… తెలంగాణలో ప్రజా ప్రభుత్వం తేవాలని చంద్రబాబును కాదని కాంగ్రెస్ లో చేరి ప్రజలతో కదం కదం కలిపామని గుర్తు చేశారు.
నీకు చిత్తశుద్ధి ఉంటే.. గోదావరి బనకచర్లపై శాసనసభలో చర్చ పెడదాం.. స్పీకర్కు లేఖ రాయాలని కేసీఆర్కు రేవంత్ సవాల్ చేశారు. ఆయన చెప్పిన తేదీన అసెంబ్లీ పెట్టించే బాధ్యత మంత్రి శ్రీధర్ బాబు తీసుకుంటారని అన్నారు. గోదావరి జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసిందెవరో ఇద్దరం చర్చిద్దామని అన్నారు.