Telangana CM Revanth Reddy built his house in FTL | హైదరాబాద్‌: జీహెచ్ఎంసీ పరిధిలో జరుగుతున్న హైడ్రా కూల్చివేతలు రాజకీయ రంగు పులుముకున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సామాన్యుల ఇండ్లు కూల్చుతున్న సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు చెరువులో ఉందని, కానీ సుద్దపూస లెక్క మాటలు మాట్లాడుతున్నాడని విమర్శించారు. కొడంగల్ లో సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు కుంటలో ఉందని.. సర్వే నంబర్ 1138 రెడ్డికుంటలో రేవంత్ రెడ్డి ఇల్లు ఉండగా, సీఎం తమ్ముడి ఇల్లు అయితే FTL పరిధిలో ఉందని.. ముందు మీ ఇండ్లు కూల్చుకోండి తర్వాత పేద ప్రజల ఇండ్ల జోలికి రావాలని సెటైర్ వేశారు. అధికారం చేతిలో ఉంది కనుక మీకో న్యాయం, పేద ప్రజలకు ఒక న్యాయమా అని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై హరీష్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.


హస్తం గుర్తు తీసేసి, బుల్డోజర్ గుర్తు పెట్టుకోండి..
 
హైదర్‌షాకోట్‌లో మూసీ పరివాహక ప్రాంతాల్లోని ఇండ్లను మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పరిశీలించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసే పనులు చూస్తే, ఆ పార్టీ గుర్తు హస్తం తీసేసి బుల్డోజర్‌ గుర్తు పెట్టుకోవడం మంచిదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో పేదలకు ఇండ్లు లేకుండా చేయడటమే  లక్ష్యంగా సీఎం రేవంత్ నిర్ణయాలు ఉన్నాయని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి కొడంగల్‌లో కట్టుకున్న ఇల్లు చెరువులో ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ తమ్ముడి ఇల్లు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉందని నోటీసులు ఇచ్చారు. కానీ వాళ్లు కోర్టుకు వెళితే నెల రోజులు హైకోర్టు టైమ్ ఇచ్చింది. కానీ పేదల ఇండ్లు మాత్రం అప్పటికప్పుడు కూల్చివేసి వారికి నిలువు నీడ లేకుండా చేస్తున్నారు. పేదల ఇండ్ల జోలికి రాకుండా బీఆర్ఎస్ పోరాటం చేస్తుంది. మమ్మల్ని మీకోసం కేసీఆర్ పంపించారు. 


ఫోన్ చేస్తే 15 నిమిషాల్లో అక్కడ ఉంటా..
ప్రభుత్వం పేదల ఇండ్లు కూల్చివేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ కూర్చోదు. ప్రభుత్వం మీ ఇండ్లు కూల్చేందుకు బుల్డోజర్లు పంపితే మాకు ఒక్క ఫోన్ కాల్ చేయండి. 15 నిమిషాల్లో నేను అక్కడ ఉంటా. బాధితులకు అండగా ఉంటాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చితే ప్రజలకు మేలు చేసినవాళ్లు అవుతారు. హాస్పిటల్స్ లో మందులు లేవు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మరణాలు పెరిగిపోతున్నాయి. దానిమీద కాంగ్రెస్ సర్కార్ ఫోకస్ చేయాలి. కానీ పేదల ఇండ్లు కూల్చడమే టార్గెట్ గా పెట్టుకుంటే మాత్రం బీఆర్ఎస్ పోరాటం ఉధృతం చేస్తుందని’ హరీష్ రావు అన్నారు.



హైదరాబాద్ చుట్టూ ఖాళీ జాగా చాలా ఉందని, అభివృద్ధి మీద అంత ప్రేమ ఉంటే ఆ ప్రాంతాలను డెవలప్ చేయాలని హరీష్ రావు సూచించారు. దయచేసి పేదల ఇండ్లు కూల్చేందుకుగానూ మూసీ సుందరీకరణ లాంటి పనులు వద్దని హితవు పలికారు. ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, పేదల ఇండ్లూ కూల్చుతుందని తమకు అండగా నిలవాలని మూసీ పరివాహక ప్రాంతాల వారు బీఆర్ఎస్ నేతలకు తమ సమస్యలు చెప్పుకున్నారు. జీవితాంతం కష్టపడి పోగుచేసిన డబ్బుతో ఇండ్లు కట్టుకుండే నిమిషాల వ్యవధిలో కూల్చేసి తమ జీవితాలు రోడ్డు మీదకు తెస్తున్నారని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఏదైనా చేసి హైడ్రా తమ ఇండ్ల జోలికి రాకుండా చూడాలని, లేకపోతే ఆత్మహత్యలు శరణ్యమని బాధితులు వాపోతున్నారు.