కొంగరకలాన్‌లో పర్యటించిన సీఎం కేసీఆర్‌.. బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశాన్ని అస్థిరపరిచే రాజకీయానికి తెరలేపిందని ధ్వజమెత్తారు. ఇప్పటికే తొమ్మిది రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూలగొట్టేసిన మోదీ ఆధ్వర్యంలోనే బీజేపీ... తెలంగాణపై పడిందన్నారు. అర్థంపర్థంలేని మత పిచ్చి లేపి ప్రజలను మభ్యపెట్టి రాజకీయం చేద్దామనుకుంటోందని విమర్శించారు. 


గతంలో జరిగిన చిన్న తప్పు కారణంగా యాభై ఎనిమదేళ్లు తెలంగాణ అనేక బాధలు అనుభవించిందని గుర్తు చేశారు కేసీఆర్. ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న తర్వాత క్రమంగా సమస్యల నుంచి బయటపడుతున్నామన్నారు. ఇలాంటి సందర్భంలో మరోసారి తప్పు చేస్తే మాత్రం ఇకపై కోలుకునే పరిస్థితి ఉండదని హెచ్చరించారు. దేశంలో నడుస్తున్న అసూయ రాజకీయలను గమనించాలని ప్రజలకు హితవు పలికారు. 


భారత్‌లో ఏ రాష్ట్రంలో లేని అద్భుత సంక్షేమ పథకాలు ఇక్కడ అందిస్తున్నామన్నారు కేసీఆర్.  రైతులతోపాటు అన్ని వర్గాలను కడుపులో పెట్టుకొని చూసుకోవడమే కాదు... వారిని అన్ని విధాలా ఆదుకుంటున్నామన్నారు. ఇలాంటి సదుపాయాలు వస్తాయన్ని ఎప్పుడైనా అనుకున్నామా అని ప్రశ్నించారు. సొంత పరిపాలన జరుగుతుంది కాబట్టి ఇదంతా సాధ్యమవుతుందన్నారు. ఇలాంటి సదుపాయాలు ఉండాలా.. వద్దా... ఇవి కాపాడుకోవాలా.. వద్దా అని ప్రశ్నించారు. నిద్రపోతే చాలా ప్రమాదానికి గురికాక తప్పదని హెచ్చరించారు. 


పంటలు పండే తెలంగాణ కావాలా.. మత పిచ్చితో మంటలు రేపే తెలంగాణ కావాలా అని ప్రజలను అడిగారు సీఎం కేసీఆర్.  సంకుచిత మత పిచ్చి మంటలు మండే రాష్ట్రమైతే భవిష్యత్‌ దెబ్బతింటుందని హెచ్చరించారు. ఇవాళ ఇండియా ఏం జరుగుతోందో చూడాలన్నారు. దీన్ని సహించుకొని మౌనంగా ఉందామా.. పిడికిలి ఎత్తి పోరాడదామా... అని సలహా అడిగారు.  కేంద్రం ఒక్కటంట్టే ఒక్కటైనా మంచి పని చేసిందా అని నిలదీశారు. ఆ చేసిన పని ఏమైనా కనిపిస్తుందా.. ఒక్కప్రాజెక్టైనా కట్టారా అని క్వశ్చన్ చేశారు. ప్రధాని, మంత్రులు చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నారని వారి చేసిన మంచి ఏంటో చెప్పాలన్నారు.  


తాను సీఎం అయిన తర్వాతే మోదీ పీఎం అయ్యారని గుర్తు చేశారు. తాము తెలంగాణంలో 24గంటలు కరెంటు ఇస్తున్నామని.. దేశంలో ఎందుకు ఇవ్వలేకపోతున్నారని నిలదీశారు. కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వడం లేదన్నారు. అలాంటి వాళ్లు మాత్రం ఇక్కడకు వచ్చి నీతులు చెప్పాలా.. డైలాగ్‌లు చెప్పాలా.. వాళ్ల మాటలు విని తెలంగాణ ప్రజలు మోసపోవాలా అని అడిగారు. 


హైదరాబాద్‌లో ఇరవై నాలుగు గంటల కరెంటు ఉంటుంది. దేశ రాజధాని దిల్లీలో కరెంటుతోపాటు నీళ్లు కూడా దొరకవన్నారు సీఎం కేసీఆర్. ప్రజలు అవకాశం ఇస్తే గెలవాలి.. పాలించాలి. అవకాశం ఇవ్వకుంటే మరోసారి వాళ్లను ఒప్పించే ప్రయత్నం చేయాలన్నారు. కానీ కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రైతే ప్రజస్వామ్యబద్దంగా ఏర్పడిన తొమ్మిది రాష్ట్రాల్లో ప్రభుత్వాలని కూలగొట్టారని ఆరోపించారు. నిన్నగాక మొన్న భారీ మెజారిటీతో విజయం సాధించిన తమిళనాడులో స్టాలిన్ గెలిస్తే అక్కడ కూలగొడతామంటున్నారన్నారు బెంగాల్‌లో మమత గెలిస్తే అక్కడ కూడా కూల్చేస్తామంటున్నారని తెలిపారు. ఇవాళ దిల్లీలో ఆప్‌ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. 20, 25 కోట్లు ఇచ్చి ఒక్కో ఎమ్మెల్యేను కొంటామంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేనా ప్రజాస్వామ్యం, ప్రజలు స్వాములుగా ఉన్నారా. ఇది రాజకీయమా. అరాచకత్వమా.. దాన్ని భరిస్తూ వెళ్తే మత పిచ్చి మంటలు వస్తాయన్నారు. 


ఇల్లు కట్టాలంటే చాలా సమయం పడుతుంది. ప్రాజెక్టు కట్టాలంటే చాలా సమయం పడుతుంది. కానీ మూర్ఖంగా దాన్ని కూలగొట్టాలంటే రెండు రోజులు చాలన్నారు కేసీఆర్. సిలికాన్ వ్యాలీగా ఉండే బెంగళూరు దేశంలోనే ఎక్కువ ఉద్యోగాలు కల్పించేదని ఇప్పుడు హైదరాబాద్‌ ఆ స్థానానికి వచ్చిందన్నారు కేసీఆర్. కారణం అక్కడ పరిణామాలేనని గుర్తు చేశారు.  హిజాబ్ అని హలాల్‌ అని రకారకాల మత పిచ్చి లేపి వాతావరణాన్ని కలుషితం చేశారన్నారు. అక్కడ ఉద్యోగాలు పోతున్నాయని.... తెలంగాణలో కూడా పరిశ్రమలు పోవాలా... ఐటీ పరిశ్రమలు వద్దా... పిల్లలకు ఉద్యోగాలు రావద్దా... అని అడిగారు.


రంగారెడ్డి జిల్లా తెలంగాణ బంగారు కొండగా అభివర్ణించిన కేసీఆర్... ఆ పరిస్థితి అలానే ఉండాలంటే... మాత్రం ప్రజలు జాగ్రత్తపడాలని సూచించారు. మత పిచ్చిలో పడితే ఇలాంటివి వ్యర్థం చేసుకోవాల్సి ఉంటుందన్నారు. కొంతమంది పిచ్చివాళ్లు... చిల్లర రాజకీయాల కోసం నీచ రాజకీయాల కోసం మతం పేరుతో అల్లకల్లోలం చేస్తే చూస్తూ ఊరుకోవాలా.. ఓట్ల కోసం చిల్లర రాజకీయాల కోసం దేశాన్ని భారత సొసైటీనే ఘోష పెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.