తెలంగాణ(Telangana) మొదటి విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర(Praja Sangrama Pada Yatra) దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైందని... పార్టీ అధిష్ఠానం కూడా అన్ని రాష్ట్రాల్లో ఇలాంటి యాత్రలు చేయాలని సూచిందన్నారు తెలంగాణ(Telangana) బీజేపీ(BJP) అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay Kumar). అసలు పాతబస్తీలోకే బీజేపీ వెళ్లలేదన్న వారికి సమాధానంగా అక్కడే భారీ  బహిరంగ సభ పెట్టి సత్తా చాటామన్నారు. భాగ్యలక్ష్మీ అమ్మవారి(Bhagya Laxmi Temple) ఆశీస్సులతో బీజేపీ ఎక్కడికైనా పోగలదు ప్రజల కోసం ఎంతకైనా తెగించగలదనే సంకేతాలు పంపినామన్నారు. అక్కడి నుంచి మొదలైన పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారన్నారు. 


మొదటి విడత పాదయాత్ర స్ఫూర్తితో రెండో విడత యాత్రకు శ్రీకారం చుడుతున్నట్టు వెల్లడించారు బండి సంజయ్. ఏప్రిల్‌ 14న అష్టాదశ శక్తి పీఠమైన జోగులాంబ అమ్మవారి ఆలయం నుంచి రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టబోతున్నామన్నారు. అమ్మవారి ఆశీస్సులతో కార్యకర్తల పట్టుదల, ప్రజల మద్దతులో చేపట్టే ఈ యాత్ర తెలంగాణలో మరో చరిత్ర సృష్టిస్తుందన్నారు. 


రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టనున్న ప్రాంతాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయ కర్తలతో బండి సంజయ్‌ సమావేశమయ్యారు. ఈ కార్యక్రమానికి బండి సంజయ్‌తోపాటు పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ, మాజీ ఎంపీ చాడ సురేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కూన శ్రీశైలం గౌడ్, నందీశ్వర్ గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు దుగ్యాల ప్రదీప్ కుమార్, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, బంగారు శ్రుతి, మంత్రి శ్రీనివాసులు, పాదయాత్ర కమిటీ ప్రముఖ్ డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, కోశాధికారి బండారి శాంతి కుమార్, సహ ప్రముఖ్ లు టి.వీరేందర్ గౌడ్, కుమ్మరి శంకర్, కార్యదర్శి కొల్లి మాధవి, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్ హాజరయ్యారు. 


పాదయాత్ర జరిగే ప్రాంతాల్లో ప్రజా సమస్యల గుర్తింపుతోపాటు పాదయాత్ర  పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు. టీఆర్ఎస్ పాలనలో ప్రజలు పడుతున్న బాధలను మొదటి విడత పాదయాత్రలో చూశామన్నారు బండి సంజయ్. కేంద్ర పథకాల తీరు తెన్నులను పరిశీలించామన్నారు. ప్రజలకు ఎలాంటి పాలన కావాలో అడిగి తెలుసుకున్నామన్నారు. అందులో భాగంగానే ఉచిత విద్య, వైద్యం వంటి హామీలిచ్చినట్టు పేర్కొన్నారు. ప్రజల కోసం బీజేపీ నేతలు తెగించి కొట్లాడతారనే నమ్మకాన్ని కలిగించినట్టు అభిప్రాయపడ్డారు. 


రాజ్యాంగాన్ని తిరగరాయాలంటూ అంబేద్కర్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ అవమానించారని విమర్శించారు బండి సంజయ్. కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేయాలని కుట్ర చేస్తున్నారన్నారు. అంబేద్కర్‌ను అవమానించిన కల్వకుంట్ల కుటుంబ పాలనను అంతం చేయాలనే లక్ష్యంతోనే అంబేద్కర్ జయంతి రోజున రెండో విడత పాదయాత్ర చేపడుతున్నామన్నారు. 


పాదయాత్ర ముగింపు సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరవుతారని వెల్లడించారు బండి సంజయ్. పాదయాత్ర జరిగే రోజుల్లో వీలు చూసుకుని వస్తానని పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చెప్పారని.. కేంద్ర మంత్రులు, జాతీయ నాయకులు హాజరయ్యే అవకాశం కూడా ఉందన్నారు. కల్వకుంట్ల అరాచక పాలనపై ప్రజలు విసిగెత్తిన ఉన్నారని అందుకే పాదయాత్రలో ప్రజలు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనే సూచనలు కనిపిస్తున్నట్టు అభిప్రాయపడ్డారు బండి సంజయ్. 


ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని పాదయాత్ర జరిగే ప్రాంతాల్లో గడప గడపకు వెళ్లి ప్రచారం చేయాలని సమన్వయకర్తలకు సూచించారు బండి సంజయ్. స్థానికంగా పోలింగ్ బూత్ స్థాయి నుంచి ప్రజలు పాదయాత్రకు వచ్చేలా అవగాహన కల్పించాలన్నారు. తెలంగాణ కోసం పోరాటాలు చేసి కేసీఆర్ పాలనలో వివక్షకు గురవుతున్న తెలంగాణ ఉద్యమకారులు పెద్ద ఎత్తున బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారని వెల్లడించారు. పాదయాత్ర జరిగే ప్రాంతాల్లో గ్రామాల వారీగా తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి పార్టీలో చేర్చుకునేలా ప్రణాళిక రూపొందించారు. పాదయాత్ర జరిగే ప్రాంతాల్లో పెద్ద ఎత్తున జాయినింగ్స్ ఉండే అవకాశం ఉంది. పెద్ద నాయకులతోపాటు వార్డు మెంబర్ మొదలు సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీలు కూడా బీజేపీలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారని పేర్కొన్నారు బండి సంజయ్.