Telangana Elections 2023: రాష్ట్రంలో రాబోయే ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ మరోసారి చర్చించింది. ఏయే విషయాలను పరిగణలోకి తీసుకుని అభ్యర్థులను ఎంపిక చేసి టికెట్లు ఇవ్వాలనే విషయాలపై చర్చించేందుకు స్క్రీనింగ్ కమిటీ తాజాగా సమావేశమైంది. అయితే అభ్యర్థుల ఎంపిక పెద్ద విషయమని స్క్రీనింగ్ కమిటీలో చర్చించాల్సిన అంశాలు ఉన్నాయని కాంగ్రెస్ రాష్ట్ర ఇంఛార్జీ మాణిక్ రావు ఠాక్రే అన్నారు. మరోసారి సమావేశం అవుతామని చెప్పుకొచ్చారు. హైదరాబాద్ లోని తాజ్‌కృష్ణ హోటల్ లో ఏర్పాటు చేసిన స్క్రీనింగ్ కమిటీ సమావేశం ముగిసిన అనంతరం సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో కలిసి ఠాక్రే మాట్లాడారు.


పీఈసీ సభ్యులతో పాటు డీసీసీ, మాజీ మంత్రులు సీనియర్ నేతల నుంచి సలహాలు సూచనలు వచ్చాయని వాటిని పరిగణలోకి తీసుకుంటామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. అభ్యర్థుల ఎంపికలో ఎలాంటి విషయాలు పరిగణలోకి తీసుకోవాలనే అంశాలను సమావేశంలో చర్చించినట్లు భట్టి తెలిపారు. స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ మురళీధరన్ ను చాలా మంది కలిసి వారి వారి అభిప్రాయాలు చెప్పారని, వాటిని కూడా కమిటీ సేకరిస్తున్నట్లు చెప్పారు. ఆయా అంశాలను పరిగణలోకి తీసుకుని తదుపరి సమావేశంలో నిర్ణయిస్తారని అన్నారు. త్వరలోనే కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటిస్తామని వెల్లడించారు. సీడబ్ల్యూసీ సమావేశాలు ఉన్నందు వల్ల అవి పూర్తి అయ్యే వరకు తిరిగి స్క్రీనింగ్ కమిటీ సమావేశం అయ్యే అవకాశాలు లేవని చెప్పుకొచ్చారు. అయితే సెప్టెంబర్ 18 నుంచి పార్లమెంట్ సమావేశాలు ఉన్న సంగతి తెలిసిందే. అవి ముగిసిన తర్వాతే కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా ఉంటుందని రాజకీయ నిపుణులు అంటున్నారు. 


తెలంగాణలో విజయంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టిన కాంగ్రెస్ పార్టీ.. పార్టీ నేతలు మొత్తం హైదరాబాద్ కు తరలి వచ్చేలా సన్నాహాలు చేస్తున్నారు.  పార్టీ కేంద్ర నాయకత్వం రంగంలోకి దిగనుంది. ఈ నెల 16, 17 తేదీల్లో హైదరాబాద్‌ వేదికగా కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం జరపాలని నిర్ణయించింది. కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక మండలి అయిన  సీడబ్ల్యూసీ కార్యవర్గ పునర్‌ వ్యవస్థీకరణ అనంతరం జరుగుతున్న తొలి సమావేశం ఇదే కానుంది. ఈ సమావేశం హైదరాబాద్‌లో జరపాలని తెలంగాణ పీసీసీ ప్రతిపాదించింది. సమావేశంతో రాష్ట్ర కాంగ్రెస్ లో జోష్ వస్తుందని భావిస్తోంది.  దీనికి అధిష్ఠానం ఒప్పుకుంది. 


కాంగ్రెస్ మఖ్యనేతలంతా హైదరాబాద్ రాక 


సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంకాగాంధీతో పాటు కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా 39 మంది వర్కింగ్‌ కమిటీ సభ్యులు ఈ సమావేశం కోసం రాష్ట్రానికి రానున్నారు. అగ్రనేతల రాకతో తెలంగాణ కాంగ్రెస్ లో జోష్ రానుంది.  సీడబ్ల్యూసీ సమావేశం చివరి రోజు సెప్టెంబరు 17న హైదరాబాద్‌ సంస్థానం భారతదేశంలో విలీనమైన రోజు కావడంతో ఆ వేడుకల్లో సోనియాగాంధీ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ సమావేశాలతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సైరన్ మోగించనుంది. 


18వ తేదీన బీఆర్ఎస్ సర్కార్ పై చార్జిషీట్


పదహారో తేదీన సిడబ్ల్యూసీ ప్రతినిధుల సమావేశం  జరుగుతుందని కాంగ్రెస్ నేత కేసీ వేముగోపాల్ ప్రకటించారు. పదిహేడో తేదీన  సీడబ్ల్యూసీ సభ్యులు, పీసీసీ ప్రెసిడెంట్లు, సీఎల్పీ నేతలు సమావేశం అవుతారు.  17వ తేదీన మెగా ర్యాలీలో చేపడతామన్నారు. ఈ ర్యాలీలో ఐదు డిక్లరేషన్లను ప్రకటించనున్నారు. పద్దెనిమిదో తేదీన బీఆర్ఎస్ ప్రభుత్వంపై చార్జిషీటు విడుదల చేస్తామని వేణుగోపాల్ ప్రకటించారు. అభ్యర్థుల జాబితాను కూడా అప్పటికల్లా ఖరారు చేసే అవకాశం ఉంది.