Hyderabad Cricket Association: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. గతంలో ఏసీబీలో నమోదైన కేసులపై విచారణలో భాగంగా ఈ సోదాలు జరిగాయి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో పలు కీలక ఫైళ్లు, దస్త్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ అవకతవకల విషయంలో హెచ్‌సీఏ అధ్యక్షుడు, సెక్రటరీల పాత్ర గురించి ఆరా తీశారు. ఇందుకోసం ప్రస్తుత సభ్యులను ఏసీబీ అధికారులు ప్రశ్నించారు.


గతంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో నిధులు గోల్ ​మాల్ జరిగినట్లుగా ఆరోపణలు గుప్పుమన్న సంగతి తెలిసిందే. అలా 2023 అక్టోబరులో హెచ్‌​సీఎపై నాలుగు కేసులు ఉప్పల్ లో నమోదయ్యాయి. 2019- 2022 మధ్య అపెక్స్‌ కౌన్సిల్‌ ఉన్న సమయంలో బీసీసీఐ నుంచి వచ్చిన ఫండ్స్, వాటిని ఖర్చు చేసిన విధానం, టెండర్లు పిలిచిన తీరు, కొటేషన్లు వంటివాటిపై ఫోరెన్సిక్‌ ఆడిట్‌లో అవకతవకలు గుర్తించారు. దీంతో ఫిర్యాదు నమోదైంది. 2019- 2022 మధ్య హెచ్‌సీఏ ​అధ్యక్షుడిగా మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ఉండేవారు. ఉపాధ్యక్షుడిగా జాన్‌మనోజ్, సెక్రటరీగా విజయానంద్, జాయింట్ సెక్రటరీగా నరేశ్‌ శర్మ, ట్రెజరర్ గా సురేందర్‌ అగర్వాల్, కౌన్సిలర్‌గా అనురాధ ఉండేవారు.