NEET-UG Counselling Schedule 2024: దేశంలో మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన నీట్ యూజీ కౌన్సెలింగ్‌కు రంగం సిద్ధమైంది. కౌన్సెలింగ్ కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగస్టు మొదటివారంలో ప్రారంభంకానుంది. ఈ మేరకు నేషనల్ మెడికల్ కమిషన్(NMC) ఆధ్వర్యంలోని మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) జులై 29న ఒక ప్రకటనలో తెలిపింది. తాజా సమాచారం కోసం ఎంసీసీ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించింది. ఆలిండియా కోటా 15 శాతం సీట్లతోపాటు సెంట్రల్ యూనివర్సిటీలు, ఎయిమ్స్, జిప్‌మెర్‌లోని ఎంబీబీఎస్ సీట్ల భర్తీ ప్రక్రియను ఎంసీసీ నిర్వహించనుంది. దేశవ్యాప్తంగా 710 వైద్య కళాశాలల్లోని సుమారు 1.10 లక్షల ఎంబీబీఎస్‌ సీట్ల ప్రవేశాల కోసం కౌన్సెలింగ్‌ చేపట్టనున్నట్టు చెప్పారు. అలాగే 21,000 బీడీఎస్‌ సీట్లతోపాటు ఆయుష్‌, నర్సింగ్‌ సీట్లను భర్తీచేయనున్నారు. పేపర్‌ లీక్‌ నేపథ్యంలో ఈ సారి నీట్‌ యూజీ పరీక్ష వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గత శుక్రవారం నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ తుది ఫలితాలను ప్రకటించింది. తాజాగా కౌన్సెలింగ్ షెడ్యూలును ప్రకటించింది.


➥ నీట్ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులు ఆలిండియా కోటా సీట్ల భర్తీకి తొలిదశ కౌన్సెలింగ్ కోసం ఆగస్టు 14 నుంచి 21 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 23న సీట్ల ఎంపిక ఫలితాలను వెల్లడిస్తారు. సీట్లు పొందిన విద్యార్థులు ఆగస్టు 24 నుంచి 29లోపు సంబంధిత కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది. 


➥ రెండోదశ సీట్ల భర్తీకి సెప్టెంబరు 5న రిజిస్ట్రేషన్ ప్రారంభం కానుంది. సెప్టెంబరు 13న సీట్లకు ఎంపికైన వారి ఫలితాలను వెల్లడిస్తారు. సీట్లు పొందినవారు సెప్టెంబరు 14 నుంచి 20లోపు కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది. 


➥ మూడో రౌండ్ కౌన్సెలింగ్‌కు రిజిస్ట్రేషన్ ప్రక్రియ అక్టోబరు 16 నుంచి 20 వరకు కొనసాగనుంది. అక్టోబరు 23న సీట్ల కేటాయింపు ఉంటుంది. సీట్లు పొందినవారు అక్టోబరు 24 నుంచి 30లోపు సంబంధిత కాలేజీల్లో చేరాల్సి ఉంటుంది. 


అర్హులెవరు..?
నీట్ యూజీ 2024 ప్రవేశ పరీక్షలో 50 శాతం మార్కులు పొందిన అభ్యర్థులు కౌన్సెలింగ్‌కు హాజరవడానికి అర్హులు. అయితే రిజర్వ్‌డ్ కేటగిరీకి చెందిన అభ్యర్థులు ఉత్తీర్ణత శాతంలో సడలింపు పొందుతారు. దివ్యాంగులకు 40 శాతం మార్కులు, అన్ రిజర్వ్‌డ్ కేటగిరీ దివ్యాంగులకు 45 శాతం మార్కులు ఉండాలి. మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) 15 శాతం ఆల్ ఇండియా కోటా సీట్లు డీమ్డ్ యూనివర్సిటీలు, సెంట్రల్ యూనివర్శిటీలు, ESIC, AFMC, BHU, AMU సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.


కౌన్సెలింగ్‌కు కాళోజీ వర్సిటీ ఏర్పాట్లు..
మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ ప్రకటనతో కన్వీనర్ కోటా ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రస్థాయి ర్యాంకుల ఆధారంగా.. కౌన్సెలింగ్ తేదీలను వర్సిటీ ఖరారు చేయనుంది. ఈమేరకు రాష్ట్రంలో కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియకు నోటిఫికేషన్ జారీ చేసి, రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టనుంది. ధ్రువపత్రాల పరిశీలన అనంతరం విద్యార్థులకు సీట్లను కేటాయించనున్నారు. తెలంగాణలో మొత్తం 26 ప్రభుత్వ వైద్య కళాశాలలు, 30 ప్రైవేటు వైద్య కళాశాలలు ఉన్నాయి. వీటిలో మొత్తం 8,490 సీట్లు ఉన్నాయి. వీటిలో 26 ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని ఎంబీబీఎస్ సీట్లలో 15 శాతం జాతీయ కోటాలో భర్తీ చేయనున్నారు. మిగిలిన సీట్లను రాష్ట్ర విద్యార్థులతో భర్తీచేస్తారు. రాష్ట్రంలో కొత్తగా మరో 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రతిపాదనలు ఎన్‌ఎంసీ అనుమతికి పరిశీలనలో ఉన్నాయి. అనుమతి వస్తే.. సీట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. 



మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..