Tarun Chugh Comments: గత ప్రభుత్వాల నిర్వాకం వల్ల మూత పడిన ఎరువుల కర్మాగారాన్ని పునరుద్ధరించి జాతికి అంకితమిచ్చేందుకు నవంబర్ 12వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలంగాణకు వస్తున్న విషయం అందరికీ తెలిసిందేనని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్ అన్నారు. అయితే మోడీ రామగుండం పర్యటనకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, తన కొత్త మిత్రులు సీపీఐ, సీపీఎంలతో కలిసి సమస్యలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎరువుల ఫ్యాక్టరీ తెరవడాన్ని కేసీఆర్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు. ఈ కర్మాగారం వల్ల తెలంగాణ రైతులకే కాకుండా యావత్ దేశానికి విశేష ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. 


ఫ్యాక్టరీని తెరిపించేందుకు కేసీఆర్ ఏం చేశారు..?


ఎరువుల ఫ్యాక్టరీపై కేసీఆర్ మరోసారి అసత్య ప్రచారం చేస్తున్నారని తరుణ్ చుగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఎన్ని అబద్ధాలు చెప్పినా విజ్ఞత గల తెలంగాణ ప్రజలు నమ్మరని అన్నారు. కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే ఈ ఫ్యాక్టరీ మూతపడిన విషయం ఆయన గుర్తించాలని చెప్పారు. ఫ్యాక్టరీని తెరిపించేందుకు ఆయన కానీ, ఆయన మంత్రిగా ప్రాతినిధ్యం వహించిన ప్రభుత్వం కానీ ఏమీ చేయలేదని గుర్తు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ చొరవ తీసుకుని రూ. 6,500 కోట్లతో ఈ ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తున్నారని వివరించారు. తెలంగాణకు కేంద్రప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని కేసీఆర్ అంటున్నారని... 2014లో తెలంగాణ ఏర్పడే సమయానికి, రాష్ట్రంలో జాతీయ రహదారుల మొత్తం నిడివి 2,511 కి.మీ.లు అని చెప్పారు. కానీ ఇప్పుడు 4,996 కి.మీ.లకు పెరిగిందని వెల్లడించారు.


రాష్ట్రం వాటాగా ఇవ్వాల్సిన 699 కోట్లు రూపాయలు చెల్లించట్లే!


2014-2022 కాలంలో కొత్తగా 2,485 కి.మీ.లు జాతీయ రహదారులు నిర్మించారని తరుణ్ చుగ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల నిడివిలో 99 శాతం వృద్ధి నమోదైందని అన్నారు. ఇంకా హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యను పరిష్కరిస్తూ అంబర్‌పేట్ వద్ద రూ.186.71 కోట్లతో 4-లేన్ ఫ్లైఓవర్‌ను నిర్మిస్తోందని వివరించారు. ఉప్పల్ నుండి నారపల్లి వరకు రూ.628.8 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్‌ నిర్మిస్తోందన్నారు. రైల్వేల్లోనూ తెలంగాణకు కేంద్రం కేటాయింపులు భారీగా పెరిగాయన్నారు. 2014-19లో ప్రతి సంవత్సరం సగటున రూ.1,110 కోట్ల కేటాయింపులు జరిగేవని గుర్తు చేశారు. రూ.4,200 కోట్లతో కేంద్రం పలు అభివృద్ధి పనులు చేపట్టినా రాష్ట్రం తన వాటాగా ఇవ్వాల్సిన రూ.699 కోట్లు చెల్లించడం లేదని ఆరోపించారు. 2014-21 కాలంలో రాష్ట్రంలో 177 కిలో మీటర్ల పొడవు మేర రైల్వే లైన్లు నిర్మాణం అయ్యాయన్నారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో రూ.31,281 కోట్ల విలువ గల పలు ప్రాజెక్టులను రైల్వేశాఖ చేపట్టిందని చెప్పుకొచ్చారు.


రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే ప్రతి కార్యక్రమంలోనూ కేంద్రం భాగస్వామ్యం ఉందన్నారు. తెలంగాణలో రోజురోజుకు ప్రాబల్యాన్ని కోల్పోతున్న కేసీఆర్ నిరాశ నిస్పృహలో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. మునుగోడులో ఆశించిన భారీ మెజారిటీ దక్కకపోవడంతో, రానున్న ఎన్నికల్లో ఓటమి ఖాయమవడంతో, కేసీఆర్ ఆందోళనలో కూరుకుపోయారని అన్నారు. కేసీఆర్ కు దమ్ముంటే ఆయన కేంద్రమంత్రిగా ఉన్న కాలంలో రాష్టానికి వచ్చిన నిధులు, 2014 తర్వాత వచ్చిన నిధులపై బహిరంగ చర్చకు రావాలని తరుణ్ చుగ్ సవాలు చేశారు.