TSRTC Bill: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ రూపొందించిన బిల్లులో అభ్యంతరాలు ఉన్నాయంటూ గవర్నర్ తమిళసై బిల్లును అడ్డుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ముఖ్యంగా ఐదు అంశాలపై వివరణ కావాలని గవర్నర్ తమిళసై ప్రభుత్వాన్ని కోరింది. ఇందుకు స్పందించిన సర్కారు.. రాజ్ భవన్ కు వివరణ ఇచ్చింది. ఈక్రమంలోనే రాజ్ భవన్ ప్రభుత్వం వివరణ కాపీని పంపింది. కార్పొరేషన్ కంటే మెరుగైన జీతాలు ఉంటాయని పేర్కొంది. విలీనం అయిన తర్వాత రూపొందించే గైడ్ లైన్సులో అన్ని అంశాలు ఉంటాయని వివరించింది. కేంద్ర ప్రభుత్వ వాటా, 9వ షెడ్యూల్ ఇష్యూ ఆంధ్రప్రదేశ్ లో ఎలా చేసిందో వాటికి అనుగుణంగా ఉంటుందని వెల్లడించింది.


ఐదు అంశాలపై వివరణ కోరిన గవర్నర్ తమిళసై


ఆర్టీసీలో కేంద్ర గ్రాంట్లు, వాటాలు, లోన్ల వివరాలు లేవని అన్నారు. ఉద్యోగుల ప్రయోజనాలు ఎలా కాపాడతారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వారికి పింఛన్ ఇస్తారా అని ప్రశ్నించారు. విభజన చట్టం ప్రకారం ఆర్టీసీ స్థితిని మార్చడంపై వివరాలు లేవన్నారు. పదోన్నతులు, క్యాడర్ నార్మలైజేషన్ లో న్యాయం ఎలా చేస్తారని అడిగారు. అలాగే ఆర్టీసీ కార్మికుల భద్రత, ప్రయోజనాలపై స్పష్టమైన హామీలను తమిళసై కోరారు. ప్రభుత్వం నుంచి తక్షణమే సమాధానం వస్తే బిల్లుపై నిర్ణయం త్వరగా తీసుకునే అవకాశం ఉంటుందని రాజ్ భవన్ వెల్లడించింది. గవర్నర్ కోరిన వివరణలపై ప్రభుత్వం కసరత్తు చేసింది. గవర్నర్ లేవనెత్తిన అభ్యంతరాలపై వివరణ ఇచ్చినట్టు  తెలుస్తోంది. రాజ్ భవన్ కు వివవరణ పంపినట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. 






మరోవైపు ఆర్టీసీ యూనియన్ నాయకులను గవర్నర్ తమిళసై రాజ్ భవన్ ఆహ్వానించారు. ఉదయం 11.30 గంటలకు పుదుచ్చేరి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నాయకులతో చర్చిస్తానని అన్నారు. అలాగే ఆర్టీసీ ఉద్యోగులు చేస్తున్న సమ్మె సామాన్య ప్రజలకు అసౌకర్యం కలిగిస్తోందని తెలుసుకుని బాధపడ్డట్లు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. మొన్నటి సమ్మెలో కూడా వారి వెంటే ఉన్నానని.. ఇప్పుడు కూడా శ్రద్ధగా అధ్యయనం చేస్తున్నానని చెప్పారు. హక్కులను కాపాడాలని సూచించారు. 


మరోవైపు రాజ్‌భవన్ వద్ద బైఠాయించిన కార్మిక సంఘాలు ప్రభుత్వం పంపిన ఆర్టీసీ విలీనం బిల్లు ఆమోదానికి పట్టుబడుతున్నారు. వెంటనే ఆమోదించి ప్రభుత్వానికి తిరిగి పంపించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే బిల్లుపై సందేహాలు ఉన్నాయన్న గవర్నర్‌ ఆఫీస్‌ ఆమోదానికి టైంకావాలని శుక్రవారం నుంచి సమాచారం అందిస్తున్నారు. ఏకంగా కార్మికులు రాజ్‌భవన్‌కు ముట్టడికి పిలుపునివ్వడం, ఆ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తతలు చోటు చేసుకోవడంతో గవర్నర్ నేరుగా స్పందించారు. తాను ఎప్పుడూ కార్మికుల పక్షమేనని అన్నారు. గతంలో సమ్మె జరిగినప్పుడు కూడా కార్మికుల తరపున మాట్లాడినట్టు గుర్తు చేశారు. కార్మికులకు మంచి జరగాలన్న ఉద్దేశంతోనే విలీనం బిల్లుపై అధ్యయనం చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాలకు గవర్నర్‌ చర్చలకు పిలిచారు. బిల్లుపై ఉన్న సందేహాలు చర్చించేందుకు రావాలని తాను ఎందుకు ఆ బిల్లును ఆమోదించకుండా స్టడీ చేస్తున్నానో చెప్పబోతున్నారు. వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా కాసేపట్లో కార్మిక సంఘాల నాయకులతో గవర్నర్‌ తమిళి సై మాట్లాడారు.