తెలంగాణలో మరో కంపెని పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని ఐటీ మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపారు. 160 ఏళ్ల నాటి బీమా సంస్థ స్విస్ రే కంపెనీ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అంగీకారం తెలిపింది. స్విట్జర్లాండ్లోని జ్యూరిక్ కేంద్రంగా ఆ సంస్థ తన కార్యకలాపాలను ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 80 ప్రాంతాల్లో తమ కార్యకలాపాలను నిర్వహిస్తోంది.
కేటీఆర్ ఏమన్నారంటే... బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాలకు హైదరాబాద్ కేంద్రంగా ఉందని చెప్పడానికి చాలా ఆనందంగా ఉంది. స్విస్రే కంపెనీకి సాదర స్వాగతం పలుగుతున్నాను. ఈ ఆగస్టులో హైదరాబాద్లో స్విస్ రే కంపెనీ తన కార్యకలాపాలను ప్రారంభించనుంది. హైదరాబాద్లో ఈ కంపెనీ 250 మందితో ప్రారంభంకానుంది. డాటా, డిజిటల్ కెపబిలిటీస్, ప్రొడెక్ట్ మోడలింగ్, రిస్క్ మేనేజ్మెంట్పై ఫోకస్ చేయనుంది. అని
ట్వీట్ చేశారు.
వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో లైఫ్ సైన్సెస్ రంగంపై జరిగిన చర్చలో పాల్గొన్న మంత్రి కేటీఆర్... తెలంగాణ: ఆర్ &డీ అండ్ ఇన్నోవేషన్ హాట్స్పాట్ ఆఫ్ ఆసియా అనే అంశంపై చర్చించారు. మంత్రి కేటీఆర్తోపాటు డాక్టర్ రెడ్డీస్ చెందిన జివి. ప్రసాద్ రెడ్డి, పీడబ్ల్యూసీకి చెందిన మహ్మమద్ అథర్ ప్యానల్ డిస్కషన్ లో పాల్గొన్నారు.
కరోనా సంక్షోభంతో లైఫ్ సైన్సెస్ మెడికల్ రంగానికి ప్రాధాన్యత మరింతగా పెరిగిందన్నారు కేటీఆర్. ఈ రంగానికి ఉతం ఇచ్చేందుకు అవసరమైన ప్రభుత్వ విధానాలకు భారత దేశంలో కొంత తక్కువమద్దతు ఉందని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి పోటీలో తట్టుకుని నిలబడాలంటే భారత లైసెన్స్ బలోపేతానికి విప్లవాత్మకమైన సంస్కరణలకు అవసరమని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే హైదరాబాద్ నగరం లైఫ్ సైన్స్ రంగంలో తన బలాన్ని మరింతగా పెంచుకుంటుందన్నారు.
లైఫ్ సైన్సెస్ క్యాపిటల్గా హైదరాబాద్ ఉందన్న కేటీఆర్.. దీన్ని మరింతగా బలోపేతం చేసేందుకు ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్ని హైదరాబాద్ ఫార్మా సిటీ పేరుతో ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యత ఉన్న ఈ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి సరైన మద్దతు లభించడం లేదని ఆరోపించారు.
భవిష్యత్తులో లైసెన్స్ ఫార్మా రంగం మరింతగా విస్తరించాలంటే ఇన్నోవేషన్కు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు కేటీఆర్. ప్రస్తుతం లైఫ్ సైన్సెస్లో ఇతర నగరాల కంటే హైదరాబాద్ ముందున్నదన్నారు. భవిష్యత్తులో నూతన మందుల ఆవిష్కరణ ప్రయోగశాలను దాటి డిజిటల్ డ్రగ్ డిస్కవరీ వైపు లైఫ్ సైన్సెస్ ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఐటి, ఫార్మా రంగం కలిసి పనిచేయాల్సి ఉంటుందన్నారు. ఇప్పటికే హైదరాబాద్లో ఉన్న నోవర్టిస్ అతిపెద్ద రెండో కార్యాలయం కలిగి ఉందని గుర్తు చేశారు.
భారతదేశంలో పరిశోధన రంగాన్ని అభివృద్ధి చేసేందుకు విదేశాల నుంచి వచ్చే పెట్టుబడులకు సులభతరంగా విధానాలు ఉండాలని తెలిపారు కేటీఆర్. ఈ రంగంలో పెట్టే పెట్టుబడులు అత్యంత రిస్క్తో కూడుకున్నవని, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం మరింత చొరవగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ దిశగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, వాణిజ్య శాఖ మంత్రి మరిన్ని చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందని సూచించారు కేటీఆర్.
కనీసం రానున్న దశాబ్ద కాలంపాటు భారత లైఫ్ సైన్సెస్ రంగం అభివృద్ధి పథంలో నడిచే అవకాశం ఉందని అంచనా వేశారు కేటీఆర్. ప్రస్తుతం ఉన్న కేవలం మందుల తయారీపై మాత్రమే కాకుండా నూతన మాలిక్యుళ్లను తయారు చేసే దిశగా కృషి చేస్తే బాగుంటుందని సూచించారు. భారతదేశంలో నైపుణ్యానికి కొదవలేదన్న కేటీఆర్... ప్రభుత్వాలు లైఫ్ సైన్సెస్ రంగంలో పరిశోధన, అభివృద్ధి ఇన్నోవేషన్కి ప్రాధాన్యత ఇస్తూ ఆ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దిశగా తెలంగాణ ప్రభుత్వం ఔత్సాహిక పరిశోధకులకు సహకారం అందించేందుకు కార్యక్రమాలను చేపట్టిందని వివరించారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రముఖ సంస్థలతో కలిసి పని చేస్తోందని తెలిపారు.