Ujjain Mahankali Bonalu Rangam 2025 | హైదరాబాద్: రాబోయే రోజుల్లో అగ్నిప్రమాదాలు సంభవిస్తాయని, మహమ్మారి వెంటాడుతుందని.. భక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలని మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన రంగం (భవిష్యవాణి) కార్యక్రమాన్ని సోమవారం ఉదయం నిర్వహించారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, పాటి పండలు బాగా పండుతాయని చెప్పారు. నా రూపాన్ని పెట్టడానికి అడ్డుపడుతున్నారు. త్వరలో రక్తం కక్కుకొని చచ్చిపోతారు అని హెచ్చరించారు.
రంగంలో మాతంగి స్వర్ణత భవిష్యవాణిలో ఏం చెప్పారంటే..
‘నా ప్రజలందరూ సంతోషంగా బోనాలు చేశారు. ప్రతి ఏడాది ఏదో ఒకటి మాత్రం తక్కువ చేస్తున్నారు. ఎన్నిసార్లు కోరినా నా కోరిక మాత్రం మీరు నెరవేర్చడం లేదు. తల్లి దండ్రులు లేని పిల్లలను ఆదరించడం లేదు. కొండంతా వరాలు తెచ్చినా నాకు గోరంత కూడా ఖర్చు పెట్టడం లేదు. అయినా నేనెప్పుడూ కోపం చూపించండం లేదు. నా బిడ్డలైన మిమ్మల్ని శాంతంగా కడుపులో పెట్టుకొని కాపాడుకుంటున్నాను. కానీ కాలం తీరిందంటే ఎవరైనా వెళ్లాల్సిందే, అందులో నా పాత్ర కూడా ఉంటుందని తెలుసుకోండి.
ఈ ఏడాదిలో నాకు చేయాల్సినవి చేయకపోతే అడ్డుపడుతున్న వారు రక్తం కక్కుకొని చస్తారు, అది చూస్తారా లేక చేయాల్సినవి చేస్తారో వారికే వదిలేస్తున్నా. రాష్ట్రాన్ని కాదు దేశాన్ని కూడా కాపాడుకుంటా. రాబోయే రోజుల్లో ఓ మహమ్మరి రాబోతుంది భక్తులంతా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఏడాది వర్షాలు సరిగా కురిసి పంటలు బాగానే పండుతాయి. 5 వారాలు నాకు శాఖ సమర్పించండి’ అని మాతంగి స్వర్ణలత భవిష్యవాని వినిపించారు.
ప్రశ్న: అకాల మరణాలను ఆపడానికి మార్గం చెప్పు తల్లి.మాతంగి: ఈ ఏడాది నా రూపం నిలబెట్టే సరికి నాకు రక్తం చూపించండి. నాకు కనుక రక్తం చూపించకపోతే ఊరు మొత్తం ఇబ్బంది ఇబ్బంది పడుతుంది. ప్రాణానికి నష్టం చేయను కానీ రక్తం మాత్రం మీకు చూపిస్తాను. నాలుగు కాళ్ల పెద్దది కాకున్నా, చిన్నది అయిన నాకు రక్తం చూపించండిరా బాలకా..
ప్రశ్న: తల్లి మమ్మల్ని అనుగ్రహించేది నువ్వే.. మా మీద కోపం చేయకుండా కాపాడు తల్లి.. పూజలు దగ్గరుండీ జరిపిస్తాం.
ప్రతి ఏడాది మాటలు చెబుతున్నారు. కానీ చేతల్లో చూపించడం లేదు. మీరు నా బిడ్డలు కనుక మీపై కోపం చూపించను. పూజలు సక్రమంగా నిర్వహించండి. నాకు ఇవ్వాల్సినవి నాకు ఇచ్చేయండి. కరుణించి కనికరిస్తాను. మీకు ఏ కష్టం లేకుండా చూస్తాను.