ఉక్రెయన్‌లో పరిస్థితులు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని కుటుంబాలకు కనుకు లేకుండా చేస్తున్నాయి. చదువు కోసం వెళ్లి చిక్కుల్లో పడ్డ తమ బిడ్డలు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో అని ఆందోళన చెందుతున్నాయి. వీడియో కాల్స్‌, ఫోన్‌లో మాట్లాడుతున్నా ఎక్కడో తెలియని భయం వాళ్లను వెంటాడుతోంది. ఏ క్షణం ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందో అన్న టెన్షన్ వాళ్లందరిలో ఉంది. 


ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తమ బిడ్డలను విలైనంత త్వరగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ప్రభుత్వాలను వేడుకుంటున్నాయి బాధిత కుటుంబాలు. ప్రథమ ప్రాధాన్యతగా దీన్ని తీసుకోవాలని రిక్వస్ట్ చేస్తున్నాయి. ఎప్పటికప్పుడు పరిస్థితులు తెలుసుకుంటున్న విద్యార్థుల ఫ్యామిలీస్‌ వార్తలు చూసి మరింత కంగారు పడుతున్నాయి. 


విద్యార్థుల కుటుంబాల్లో ఉన్న భయాందోళనలు తగ్గించడానికి ప్రభుత్వాలు తగిన యాక్షన్ ప్లాన్ చేపట్టాయి. ఉక్రెయిన్ లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులకు సహకారం అందించటానికి ఇద్దరు అధికారులను నియమించింది ఏపీ ప్రభుత్వం.
నోడల్ అధికారిగా రవి శంకర్ తీసుకొచ్చింది. ఆయన ఫోన్ నెంబర్‌  9871999055. అంతర్జాతీయ సహకారం ప్రత్యేక అధికారిగా రిటైర్డ్ ఐఎఫ్‌ఎస్‌ గీతేష్ శర్మను నియమించింది. సంప్రదించాల్సిన నెంబర్ 7531904820. ఇదే విషయంపై రెండు రోజుల క్రితం విదేశాంగ శాఖ మంత్రికి ముఖ్యమంత్రి జగన్ లేఖ కూడా రాశారు. తెలుగు విద్యార్థులను క్షేమంగా వాళ్ల ఇళ్లకు చేర్చాలని రిక్వస్ట్ చేశారు. 


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఉక్రెయిన్ లో చిక్కుకున్న తెలంగాణా విద్యార్థులకు సహాయం అందించేందుకు ప్రత్యేక ఏర్పాటు చేశారు అధికారులు.  దిల్లీతోపాటు తెలంగాణ సచివాలయంలో ప్రత్యేక హెల్ప్ లైన్ కేంద్రాలను రెడీ చేశారు.


ఉక్రెయిన్‌లోని భారత రాయబారి పార్థ సత్పతికి కూడా విద్యార్థుల క్షేమ సమాచారం తెలుసుకుంటున్నారు. ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయులు ఎక్కడివారు అక్కడే ఉండాలని సూచించారు. రాజధాని 'కీవ్' చేరుకునే ప్రయత్నం అసలు చేయొద్దన్నారు. ప్రయాణంలో ఉన్నవారు కూడా  తిరిగి వెళ్లిపోవాలన్నారు. వాళ్ల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు హెల్ప్‌లైన్లు, సోషల్ మీడియా ఖాతాలు చెక్‌ చేస్తూనే ఉన్నారు. 


స్థానికంగా కూడా ఆయా పార్టీలు ప్రత్యేక ప్లాన్‌ ఆఫ్‌ యాక్షన్ రెడీ చేశాయి. తెలంగాణ విద్యార్థినీ, విద్యార్థుల వివరాలు సేకరించేందుకు తెలంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నంబర్(8333871818) ఏర్పాటు చేసింది. ఈ నంబర్ కు ఫోన్ చేసి ఉక్రెయిన్ లో చిక్కుకున్న వారి వివరాలు తెలిపినట్లైతే విదేశాంగ శాఖ కార్యాలయ అధికారులను సంప్రదించి స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు బండి సంజయ్‌.






భారతీయులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ రిక్వస్ట్ చేశారు. విద్యార్థినీ, విద్యార్థులందరినీ స్వదేశానికి రప్పించేందుకు మోదీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. తెలంగాణ విద్యార్థినీ, విద్యార్థులు ఎంతమంది ఉన్నారు? వారిని రప్పించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై విదేశాంగ మంత్రిత్వశాఖతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. సంబంధిత కేంద్ర మంత్రికి లేఖ కూడా రాశామని తెలిపారు.