TSPSC Paper Leakage: టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో నలుగురు నిందితుల కస్టడీ పూర్తయింది. నలుగురు నిందితులు ప్రవీణ్, రాజశేఖర్, రాజేశ్వర్, డాక్య లను నాంపల్లి కోర్టుకు సిట్ అధికారులు తరలించారు. నాంపల్లి కోర్టు లో నలుగురు నిందితులను సిట్ హాజరు పరిచింది. వీరితో పాటు రంజిత్, శ్రీకాంత్, ఆనంద్, శ్రీనివాస్, సుధీర్, విజయ సారధి, హరీష్, కిషోర్ లను సైతం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. మూడు రోజుల పాటు కొనసాగిన సిట్ విచారణ పూర్తయింది. 


TSPSC లీకుల వ్యవహారంలో నిజాలు నిగ్గుతేల్చేందుకు సిట్ విచారణ వేగంవంతం చేసిన సిట్ అధికారులు ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్ 1లో వంద మార్కులకు పైగా ప్రిలిమ్స్ లో సాధించిన అభ్యర్థులను జల్లెడపట్టే పనిలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో సైతం నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. వంద మార్కులు దాటిన వారిని తమదైన శైలిలో ప్రశ్నలు సంధిస్తూ నిజాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆయా అభ్యర్థులు లీకైన పేపర్ ద్వారా మార్కులు సాధించలేదని నిర్దారించుకునేందుకు 15 ప్రధాన ప్రశ్నలు సంధిస్తున్నట్లుగా తెలుస్తోంది. లీకేజీ వ్యవహారానికి ఏమాత్రం సంబంధం లేదని నిర్దారించుకున్నతారువాత మాత్రమే ఆ అభ్యర్థుల విషయంలో ఓ క్లారిటీకి వస్తున్నట్లు తెలుస్తోంది.


సిట్ విచారణలో భాగంగా ఇప్పటివరకూ పదిహేను మంది నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రధాన నిందితులులైన ప్రవీణ్, రాజశేఖర్, డాక్యా నాయక్, రాజేశ్వర్ చుట్టూ ప్రస్తుతం లీక్ ల వ్యవహారంలో విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే సీన్ రికన్ స్ట్రక్షన్ లో భాగంగా  CCS నుండి నిందితులను TSPSC కి తరలించి విచారించడంతోపాటు బోర్డు  నుంచి లీకైన పేపర్ ఆ తరువాత ఎక్కడ నుంచి ఎవరెవరికి చేరింది, ఎందరి చేతులు మారింది. ఒక్కోపేపర్ కు ఎంత మొత్తంలో నగదు ముట్టింది అనే కోణాల్లో విచారణ వేగవంతం చేశారు. 


గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసిన వారిలో 25వేల మంది మెయిన్స్ కు అర్హత సాధించారు. వీరిలో 100 మార్కులు సాధించిన వారే ఇప్పడు సిట్ కు టార్గెట్ గా మారారు. కేసు మూలాలను ఛేదించే పనిలో భాగంగా ద్యాప్తు ముమ్మరం చేశారు సిట్ అధికారులు. ఇప్పటికే ప్రధాన పార్టీల అధ్యక్షులకు సైతం మీ వద్ద సమాచారం ఇవ్వాలంటూ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిద్వారా సిట్ పై నిరాధార ఆరోపణలకు చెక్ పెడుతున్నామనే సంకేతాలు ఇస్తూనే మరోవైపు విచారణ విషయంలో వేగంగా ముందుకు దూసుకుపోతోంది. రాజకీయ విమర్శలు ,ప్రతి విమర్శలు పక్కనపెడితే TSPSC పేపర్ల లీకేజి కేసులో సిట్ తనదైన శైలిలో నిజాలను నిగ్గుతేల్చే పనిలోపడింది. 


TSPSC ప్రశ్నాపత్రాల లీకుల వ్యహారంలో ప్రవీణ్ ,రాజశేఖర్ రెడ్డి చుట్టూ ఉచ్చుబిగుస్తోంది. వీరిద్దరి నుంచి ఏఈ, గ్రూప్ 1, టౌన్ ప్లానింగ్ పేపర్లు బయటకు వెళ్లాయి. ఇక్కడ వీరు డబ్బుకు ఆశపడి రేణుకకు పేపర్లు అమ్మిన సంగతి తెలిసిందే. అయితే ఆ తరువాత ఓ చైన్ సిస్టమ్ లా పేపర్లు వాటి జిరాక్స్ లు చేతులు మారుతూ ఎంత మంది అభ్యర్దులకు చేరాయనేది ఇప్పడు ప్రధాన ప్రశ్నగా మారింది.  ఈ క్రమంలో విచారణ ఎదుర్కొంటున్న ప్రధాన నిందితుల బంధువుల, స్నేహితుల, లేదా వారి సంబంధికులను విచారిస్తున్నారు సిట్ అధికారులు. మొదట ప్రవీణ్ కు డబ్బు ఆశచూపి పేపర్లు బయటకు తెచ్చిన రేణుక నుండి తన భర్త డాక్యనాయక్ అతని ద్వారా మరో ఇద్దరు వ్యక్తులు రాజేంద్రకుమార్, ప్రశాంత్ లకు పేపర్ చేరినట్లు గుర్తించారు. వీరు డాక్యానాయక్ తోపాటు ఉపాధిహామీ పథకంలో సహోద్యోగులుగా ఉన్నారు. రేణుక తమ్ముడు రాజేష్ నాయక్ నుంచి గోపాల్ నాయక్, నీలేష్ నాయక్ పేరు చేరినట్లు ప్రాథమికంగా సిట్ అధికారులు నిర్దారణకు వచ్చినట్లు సమాచారం.


అయితే ఇప్పడు వీరి నుండి మరెంత మందికి గ్రూప్ 1 తో పాటు ఇతర పేపర్లు చేరాయనేది ప్రధాన ప్రశ్నగా మిగిలింది. నిందితులు కొందరి పేర్లు మాత్రమే చెప్పగలరు వారి నుంచి వాట్సప్ ద్వారా మరికొంత మందికి చేరిందని ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో సిట్ అధికారులు ఓవైపు నిందితులను ప్రత్యక్షంగా విచారిస్తూనే మరోవైపు TSPSC గ్రూప్ 1లో వంద మార్కులు దాటిన అభ్యర్దులను విచారిస్తోంది. ఇప్పటికే మహబూబ్ నగర్ జిల్లా గండీడ్, పంచాగుల తండాల్లో విచారణ పూర్తి చేశారు సిట్ అధికారులు.