స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ ఎయిర్ పోర్టు అధికారులు భద్రతను మరింత పటిష్ఠం చేశారు. ఆగస్టు 15 వరకూ శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో హైఅలర్ట్‌ విధించారు. ఈ క్రమంలో అప్పటి వరకూ కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్‌ఎఫ్‌), పోలీసులతో తనిఖీలను ముమ్మరం చేయనున్నారు. అంతేకాకుండా, ఆగస్టు 15 వరకు సందర్శకులకు అనుమతి నిరాకరిస్తున్నట్లుగా ప్రకటించారు.


విమానాలు ఎక్కే ప్రయాణికులతో పాటు వారిని సాగనంపడానికి కుటుంబ సభ్యులు ఎయిర్ పోర్టుకు వస్తుండే సంగతి తెలిసిందే. అయితే, ఈ హైఅలర్ట్ నేపథ్యంలో ఒకరిద్దరే రావాలని ఎయిర్ పోర్టు అధికారులు సూచిస్తున్నారు. అన్ని రకాల పాసులను ఆగస్టు 16 వరకూ రద్దు చేస్తున్నట్లు తెలిపారు.


విమానాశ్రయంలో పార్కింగ్, డిపాశ్చర్, ఆగమనాలు విభాగాల్లో సీఐఎస్ఎఫ్ పోలీసులు డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్‌తో తనిఖీలు మొదలు పెట్టారు. విదేశాలకు వెళ్తున్న ప్రయాణికులకు వీడ్కోలు పలకడానికి ఒకరు లేదా ఇద్దరు సందర్శకులు రావాలని.. అంతేకానీ, అధిక సంఖ్యలో వస్తే అనుమతించబోమని అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది హైయ్యర్ స్టడీస్ కోసం ఎక్కువ మంది విద్యార్థులు విదేశాలకు వెళ్తున్నారు. ఇలా విదేశాలకు వెళ్లే విద్యార్థుల రాకతో సందర్శకులు కూడా వస్తున్నారు. దీంతో ప్రయాణికుల సంఖ్య బాగా పెరుగుతోంది. ఒక్కరిని పంపించడానికి తల్లిదండ్రులతో పాటు బంధువులు కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు. అందుకే, భద్రత నేపథ్యంలో వచ్చే 15 రోజులు సందర్శకులు రావద్దని కేంద్ర బలగాలు అలర్ట్ చేస్తున్నాయి.






ఇటీవలే సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ కూలింగ్ అండ్ కోల్డ్ చైన్ సెంటర్ ప్రారంభం


శంషాబాద్‌ ఎయిర్ పోర్ట్ లో ఇటీవలే సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ కూలింగ్ అండ్ కోల్డ్ చైన్ సెంటర్ ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. దీన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. జీఎమ్ఆర్ ఇన్నోవెక్స్ సెంటర్ లో తెలంగాణ సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ కూలింగ్ అండ్ కోల్డ్ చైన్ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడిన కేటీఆర్.. ఆహారం, వ్యాక్సిన్ లు స్టోరేజ్ చేయడంలో ఈ కోల్డ్ చైన్ ఉపయోగపడుతుందని అన్నారు. ఫేస్ వన్ లో ఈ కేంద్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు.  


హైదరాబాద్ ఫార్మా రంగానికి క్యాపిటల్ గా మారిందని కేటీఆర్ అన్నారు. సస్టైనబుల్ కూలింగ్ ప్రమోట్ చేయడమే ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లక్ష్యం అని అన్నారు. లాబరేటరీ, కమ్యూనిటీ కూలింగ్ హౌస్ వంటివి కూడా ఈ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ లో  ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ తొమ్మిదేళ్లలో వ్యవసాయ రంగం ఉత్పత్తి ఎగుమతులు ఎంతో పెరిగాయని అన్నారు. రైతులు పండించే ఆహార పదార్థాల వంటివి భద్రపరచడానికి కూడా ఈ కేంద్రం ఉపయోగపడుతుందని అన్నారు.