Telangana Job News: తెలంగాణ నిరుద్యోగులకు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ గుడ్ న్యూస్ చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖలో ఏడు వేల పోస్టులు భర్తీ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు . ల్యాబ్ టెక్నీషియన్ (గ్రేడ్–2) పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను సోమవారం ఆయన విడుదల చేశారు. ప్రభుత్వ హాస్పిటళ్లలోని 1,284 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి గతేడాది చివరిలో మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి 24,045 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 23,323 మంది బోర్డు నిర్వహించిన పరీక్షకు (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) హాజరయ్యారు. పోస్టులకు ఎంపికైన వారి జాబితాను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు సిద్ధం చేసింది.
సెక్రటేరియట్లో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా, ఇతర అధికారులతో కలిసి మంత్రి దామోదర రాజనర్సింహ సోమవారం ఆ జాబితాను విడుదల చేశారు. అనంతరం, ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల వివరాలు, వారు సాధించిన మార్కుల వివరాలను బోర్డు వెబ్సైట్లో అధికారులు అప్లోడ్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ ఉద్యోగం సాధించిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 9 వేలకుపైగా పోస్టులను భర్తీ చేశామని, మరో 7 వేలకుపైగా పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు.
డాక్టర్లు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ వంటి ముఖ్యమైన పోస్టులతో పాటు, వైద్య సేవలు మెరుగుపరచడానికి అవసరమైన అన్ని రకాల పోస్టులనూ భర్తీ చేస్తున్నామని దామోదర్ రాజనర్సింహ పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చే నాటికి డాక్టర్లు, సిబ్బంది లేక వెలవెలబోయిన హాస్పిటళ్లు ఇప్పుడు కలకలలాడుతున్నాయని మంత్రి వ్యాఖ్యానించారు. డాక్టర్లు, సిబ్బంది రాకతో ప్రభుత్వ హాస్పిటళ్లకు వచ్చే పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయన్నారు. వీలైనంత త్వరలో మిగిలిన పోస్టుల భర్తీ ప్రక్రియను కూడా పూర్తి చేస్తామని, ఈ దిశగా వైద్య ఆరోగ్య శాఖ చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి దామోదర రాజనర్సింహ తెలియజేశారు.