భారీ అగ్ని ప్రమాదం కారణంగా దాదాపు 70 శాతం పటుత్వం కోల్పోయిన సికింద్రాబాద్ లోని డెక్కన్ మాల్ కూల్చివేత మొదలైంది. గురువారం (జనవరి 27) రాత్రి 11 గంటల ప్రాంతంలో అధికారులు భారీ యంత్రాల సాయంతో కూల్చివేత పనులు ప్రారంభించారు. అయితే, గురువారం రోజు టెండర్ దక్కించుకున్న సంస్థ విషయంలో పెద్ద మార్పులే జరిగాయి.


కూల్చివేత టెండర్‌ను ఎస్కే మల్లు అనే కంపెనీ నుంచి కృష్ణ ప్రసాద్‌ ఏజెన్సీ దక్కించుకుంది. ముందు టెండర్ దక్కించుకున్న ఎస్కే మల్లు కంపెనీ దగ్గర కూల్చివేతకు సంబంధించి సరైన యంత్రాలు లేకపోవడంతో దాన్ని అధికారులు రద్దు చేశారు. గురువారం ఉదయాన్నే మాల్‌ కూల్చివేతకు యంత్ర సామగ్రితో ఎస్కే మల్లు సంస్థ సిద్ధమైంది. భారీ క్రేనుతో కంప్రెషర్‌ యంత్రాన్ని భవనంపైకి తీసుకెళ్లి.. క్రేన్‌తో అలాగే పట్టి ఉంచి ఒక్కో స్లాబును కూల్చుతామని వెల్లడించింది. అధికారులు దానికి ఒప్పుకోలేదు. మంత్రి తలసాని కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో భారీ యంత్రాన్ని తెప్పించేందుకు సంస్థ ప్రయత్నాలు ప్రారంభించింది.


అయినా సాయంత్రానికి జీహెచ్‌ఎంసీ ఇంజినీరింగ్‌ విభాగం ఎస్కే క్రాంటాక్టును రద్దు చేసింది. టెండరులో పాల్గొని రూ.33 లక్షలకు పని చేస్తామన్న మాలిక్‌ ట్రేడర్స్‌కు పని అప్పగించింది. గుత్తేదారు  పొడవైన జేసీబీని తెచ్చి పనులు ప్రారంభించారు. కూల్చివేత వల్ల  సమీప బస్తీ వాసులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని మంత్రి తలసాని భరోసా ఇచ్చారు.


మళ్లీ చెలరేగిన మంటలు


డక్కన్‌ మాల్‌ భవనాన్ని కూల్చివేస్తున్న క్రమంలో గురువారం రాత్రి మళ్లీ మంటలు రేగాయి. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపకశాఖ సిబ్బంది ఫైరింజన్‌ను తీసుకొచ్చి మంటలను అర్పివేశారు. అగ్ని ప్రమాదం జరిగి వారం రోజులు గడిచాక కూడా ఇలా జరగడం పట్ల స్థానికులు ఆందోళనకు గురయ్యారు.