Scientific Healing Eformation: యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు, ఒక యోగి ఆత్మకథ రచయిత పరమహంస యోగానంద రచించిన 'సైంటిఫిక్ హీలింగ్ ఎఫర్మేషన్స్' తెలుగు అనువాదం “శాస్త్రీయమైన స్వాస్థ్యకారక దివ్యసంకల్పాలు” పుస్తకం విడుదలైంది. స్వామి ప్రజ్ఞానంద హైదరాబాద్ బుక్ ఫెయిర్ లోని యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా' స్టాల్ లో ఈ పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ పుస్తకంలో సాధకుడిలోని స్వస్థతా శక్తిని అర్థం చేసుకొని నిత్యజీవితంలో ఆచరించడానికి ఈ పుస్తకం ఓ మార్గదర్శినిగా ఉపయోగపడుతుందని స్వామీజీ తెలిపారు. ఆత్మసాక్షాత్కారం కోసం క్రియాయోగ ధ్యాన ప్రక్రియను అభ్యాసం చేయాలని స్వామి ప్రజ్ఞానంద సూచించారు. క్రియాయోగ పాఠాల కోసం హైదరాబాద్ లోని యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా ధ్యాన కేంద్రాన్ని సందర్శించాలని కోరారు. పరమహంస యోగానంద పశ్చిమ దేశాల్లో క్రియాయోగ ధ్యానానికి రాయబారిగా దాదాపు 30 ఏళ్లకు పైగా సనాతన భారతదేశపు ఆధ్యాత్మిక బోధనలను అందించడానికి అమెరికాలో ఉండిపోయారు. క్రియాయోగ మార్గం ఓ సమగ్ర జీవన విధానం, ఆత్మ సాక్షాత్కారానికి ‘విమాన మార్గం’గా చెప్పబడింది. యోగానంద అనుయాయులు ఆయన క్రియాయోగ సంబంధిత బోధనలను అనుసరించి అపరిమితమైన లాభాన్ని పొందారు.


యోగానంద 1952లో తన శరీరాన్ని వదిలివేయగా, ఆయన బోధనలను వ్యాప్తి చెందించే కార్యభారం ఆయన స్థాపించిన జంట సంస్థలైన - యోగదా సత్సంగ్ సొసైటీ ఆఫ్ ఇండియా(వై.ఎస్.ఎస్), ప్రపంచవ్యాప్తంగా సెల్ఫ్ - రియలైజేషన్ ఫెలోషిప్ (ఎస్.ఆర్.ఎఫ్)లపై ఉంది. యోగానంద జీవితంలో, ఆయన వ్యక్తిత్వంలో ప్రతిఫలించిన స్వచ్ఛమైన ప్రేమ, శాంతి, ఆనందంతో ప్రభావితులైన అనేక మంది ఆయన చూపించిన మార్గాన్ని అనుసరిస్తున్నారు. యోగానంద మూర్తీ భవించిన ప్రేమ స్వరూపులుగా పేరొంది ‘ప్రేమావతారులు’గా నేటికీ పిలవబడుతున్నారు. 


యోగానంద శిష్యులైన వారిలో లూథర్ బర్బాంక్, అమెలిటా గల్లి-కుర్చి వంటి ప్రముఖ వ్యక్తులు ఉండగా, గురుదేవుల దేహత్యాగం తరువాత ఆయన బోధలకు గాఢంగా ప్రభావితులైన వారిలో ఎందరికో ఆరాధ్యులైన జార్జ్ హారిసన్, పండిత రవిశంకర్, స్టీవ్ జాబ్స్ వంటి వారున్నారు. 1952లో తాను ఈ భూమిని విడిచిపై లోకాలకు తరలిపోయేనాటికి తనలోని దివ్యప్రేమ అనే శక్తివంతమైన సందేశం ద్వారా ఈ ప్రపంచంపై ఆయన సూక్ష్మరీతిలోను, ప్రత్యక్షంగానూ కూడా ప్రభావం చూపారు. తన శిష్యులకు ఆయన స్పష్టమైన రీతిలో ఇచ్చిన సందేశం ఏమిటంటే — మిగిలినవన్నీ ఆలస్యం చెయ్యవచ్చు గాక; కానీ మీ దైవాన్వేషణను మాత్రం ఆలస్యం చెయ్యడానికి వీలులేదు. ఆయన చేసిన విస్తారమైన రచనల్లో ‘విస్పర్స్ ఫ్రమ్ ఎటర్నిటీ,’ ‘మెటాఫిజికల్ మెడిటేషన్స్,’ ‘సాంగ్స్ ఆఫ్ దసోల్’ వంటి ఉత్తమ గ్రంథాలున్నాయి. ఆయన ప్రసంగాలు ‘ఆత్మ సాక్షాత్కారం వైపు ప్రయాణం,’ ‘దివ్య ప్రణయం,’ ‘మానవుడి నిత్యాన్వేషణ’ వంటి సంచికలుగా సంకలనం చేశారు. ఇంట్లోనే ఉండి అధ్యయనం చేయగలిగే వై.ఎస్.ఎస్. – ఎస్.ఆర్.ఎఫ్. పాఠాలు సత్యాన్వేషకులందరికీ ధ్యాన ప్రక్రియలనే కాక, జీవించడం ఎలాగో నేర్పే కళను కూడా ఉపదేశిస్తూ అంచెలంచెలుగా మార్గదర్శకత్వాన్ని అందిస్తాయి. 


ఈ భూమిపై యోగానంద జీవన ప్రమాణం కొద్ది దశాబ్దాలకే పరిమితమయినా, ఆయన ఏకాగ్ర దైవకేంద్రిత జీవనం వల్ల జనించిన శక్తివంతమైన ఆధ్యాత్మిక తరంగాలు నేటికి మహాసాగరంవలె అయ్యాయి. ఆయన బోధనలు శ్రద్ధగా అనుసరించే శిష్యులు ఈ జీవితంలోనూ, మరణానంతరమూ కూడా గొప్ప భాగ్యశాలురవుతారు. మరింత సమాచారం కోసం yssofindia.org ను సందర్శించగలరు.