హైదరాబాద్‌లోని సరూర్ నగర్‌లో పూజారి చేతిలో దారుణ హత్యకు గురైన అప్సరకు అసలు తమకు ఎలాంటి సంబంధం లేదని నిందితుడి తండ్రి వెల్లడించారు. అప్సరను హత్య చేసిన పూజారి సాయిక్రిష్ణ, ఆమె తన మేనకోడలు అని, కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, అప్సరతో తమకు ఎలాంటి బంధుత్వం లేదని తండ్రి చెబుతుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. గతంలో ఆమెను ఓ ఆలయంలో చూశానని, అప్పుడే వీరి విషయం తెలిసి ఆమెను హెచ్చరించానని చెప్పారు. గత కొన్ని నెలలుగా తన కొడుకును అప్సర వేధించి ఉండడం వల్ల హత్య చేసి ఉండవచ్చని నిందితుడు సాయిక్రిష్ణ తండ్రి చెబుతున్నారు. పోలీసులు అప్సర ప్రవర్తనతో పాటు, హత్యకు సంబంధించిన పూర్తి వివరాలను తేల్చాలని ఆయన కోరారు.


‘‘సాయిక్రిష్ణ హత్య చేశాడో లేదో మాకు తెలియదు. పోలీసులు ఉత్తినే ఏమీ చెప్పరు కదా? వాళ్లు ఇన్వెస్టిగేట్ చేసే చెప్పి ఉంటారు. ఎందుకు హత్య చేసి ఉంటాడనే విషయం వాడే (సాయిక్రిష్ణ) చెప్పాలి. అప్సర ఎవరో మాకు తెలియదు. అప్సరతో మాకు ఏరకమైన బంధుత్వమూ లేదు. బంధుత్వం ఉంటే జనరల్ గా ఎందుకు చంపుకుంటారు? ఆ అమ్మాయిని నేనోసారి ఆలయంలో చూశాను. అబ్బాయిలతో చాలా క్లోజ్ గా మూవ్ అయ్యేది. ఆడపిల్లలతో జాగ్రత్తగా ఉండాలని నేను నా కొడుక్కి ఎప్పుడూ చెప్తుంటాను. 


మూడో తారీకు నుంచి నాకొడుకు ఇంట్లోనే ఉన్నాడు. మూడో తారీకు రాత్రి వచ్చినట్లు లేడు. మర్నాడు పొద్దున 5 గంటలకు వచ్చినట్లున్నాడు. రకరకాల సమస్యలతో విదేశాల నుంచి తెలుగు వారు నా కొడుక్కి ఏవేవో సమస్యలతో ఫోన్లు చేస్తుంటారు.. అమెరికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా నుంచి. సరూర్ నగర్ వెంకటేశ్వర కాలనీ 15 రోడ్లలో నాకొడుకు అంటే తెలియని వ్యక్తి లేరు. మావాడు నిత్యాన్నదానం ఏడాది నుంచి నడుపుతున్నాడు రోజుకు 300 మందికి. 


నాకొడుకు, వాడి భార్య, నాలుగేళ్ల కూతురు మా ఇంట్లోనే ఉంటారు. పరాయి ఆడపిల్ల గురించి ఎలాంటి మాటలు మా ఇంట్లో ఉండవు. అప్సర అనే అమ్మాయే తనను పెళ్లి చేసుకొమ్మని మా అబ్బాయిని వేధించి ఉంటుంది. అందుకే వాడు హత్య చేసి ఉండొచ్చు’’ అని సాయిక్రిష్ణ తండ్రి మీడియాతో చెప్పారు.


హత్య జరిగిన తీరు!


హైదరాబాద్‌ సరూర్ నగర్ లో అప్సర అనే యువతిని పూజారి సాయిక్రిష్ణ చంపేసి మ్యాన్‌హోల్‌లో పడేసి పైన సిమెంటు వేశాడు. తర్వాత ఏమీ తెలియనట్టు మిస్సింగ్ కంంప్లైంట్ ఇచ్చాడు. సరూర్‌ నగర్ ప్రాంతానికి చెందిన వెంకటసాయి సూర్యకృష్ణ వృత్తి రీత్యా పూజారి. పెళ్లైంది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయినా వేరే మహిళతో ఏర్పడిన వివాహేతర సంబంధం చిక్కుల్లో పడేసిందని భావిస్తున్నారు.
 
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. వెంకటసాయికి అప్సర అనే యువతి పరిచయం ఏర్పడింది. వరుసకు ఆమె మేనకోడలు అవుతుందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలోనే పెళ్లి చేసుకోవాలని ఆమె ఒత్తిడి తెచ్చినట్టు తెలుస్తోంది. ఇద్దరు పిల్లలు ఉన్న వెంకటసాయి ఆమెను వదలించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ ఆమె పెళ్లి చేసుకోవాల్సిందే అని పట్టుబట్టాడు. చివరకు ఒత్తిడి ఎక్కువయ్యేసరికి ఆమెను హతమార్చాడు. పూర్తి వివరాలు


Also Read: ప్రియురాలిని హత్య చేసి మ్యాన్‌హోల్‌లో పడేసిన పూజారి