మన ఊరు - మన బడి, మన బస్తీ కార్యక్రమంలో మంజూరైన పనులకు శంకుస్థాపన చేశారు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. షాద్ నగర్ నియోజకవర్గం పరిధిలో కొత్తూరు ప్రభుత్వ పాఠశాలలో ఈ కార్యక్రమం జరిగింది. మన ఊరు, మన బస్తీ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఆప్యాయంగా ఓ చిన్నారి విద్యార్థిని ఆప్యాయంగా ముద్దుపెట్టింది. స్థానిక ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాలలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ఓ యజ్ఞంలా ముఖ్యమంత్రి కేసీఆర్ మన ఊరు- మన బడి, మన బస్తీ-మన బడికి శ్రీకారం చుట్టారని తెలిపారు. రూ.7,289 కోట్ల భారీ బడ్జెట్ తో 26 వేల పాఠశాలల్లో 12 రకాల పనులు చేపడుతున్నామని అన్నారు.


చాలా వరకు ప్రైవేటు పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ఉండటం, తల్లిదండ్రులు ఆ వైపే మొగ్గు చూపుతుండటంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలల్లో ఈ సంవత్సరం నుండి ఆంగ్ల బోధనకు ఆదేశాలు ఇచ్చారని మంత్రి సబిత తెలిపారు. మన విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడేలా, తెలంగాణ విద్యార్థి ఎక్కడకు వెళ్లిన రాణించేలా తయారు కావాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం అన్నారు.
విద్యా శాఖలో తీసుకుంటున్న సంస్కరణలు, మార్పులతో ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా నమోదు పెరిగిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం భోజనం, ఉచితంగా పుస్తకాలు, యూనిఫామ్ లు అందిస్తున్నామని తెలిపారు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చాక వెయ్యికి పైగా గురుకులాలు ప్రారంభించారని అన్నారు. ఒక్కో విద్యార్థిపై లక్ష 25 వేలు ప్రభుత్వం ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు.


ప్రైవేటు కన్నా మంచి ఫలితాలు సాధిస్తూ గురుకులాలు నేడు ఆదర్శంగా నిలిచాయన్నారు. ప్రవేశాలకు భారీగా డిమాండ్ ఏర్పడిందని తెలిపారు. 1,050 వరకు గురుకులాలను జూనియర్ కళాశాలలుగా, 80 డిగ్రీ, రెండు పీజీ, రెండు కళాశాలలుగా అప్ గ్రేడ్ చేశామన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి.