Old City Metro Project: హైదరాబాద్ ఓల్డ్ సిటీ ప్రాంతానికి కూడా మెట్రో లైనుకు విస్తరించే ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఫలక్ నుమా సమీపంలో ఫరూక్ నగర్ బస్ డిపో వద్ద రేవంత్ రెడ్డి  శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సహా ఇతర ఎంఐఎం నేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం జేబీఎస్ టూ ఎంజీబీఎస్‌ వరకు ఉన్న మెట్రో లైనును ఫలక్‌నుమా వరకు ఇంకో 5.5 కిలోమీటర్లు పొడిగించనున్నారు. ఈ రైలుమార్గంలో 5 మెట్రో స్టేషన్లు ఉంటాయి. 


ఈ మెట్రో లైను నిర్మాణం కనుక పూర్తయితే సికింద్రాబాద్‌ నుంచి జేబీఎస్‌, ఎంజీబీఎస్‌ మీదుగా పాతబస్తీకి నేరుగా ప్రయాణం చేసే వీలుంటుంది. ఎంజీబీఎస్ నుంచి సాలార్ జంగ్ మ్యూజియం, చార్మినార్, శాలిబండ, షంషిర్ గంజ్, ఫలక్ నుమా మెట్రో స్టేషన్లు ఉంటాయి. అయితే, ఈ విస్తరణ కోసం రూ.2 వేల కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు. కేటాయించిన నిధుల్లో రూ.వెయ్యి కోట్లు స్థల సేకరణకే ఖర్చు అవుతుందని అధికారులు చెబుతున్నారు. ఓల్డ్ సిటీ మెట్రో అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ కష్టాలు తీరడంతోపాటు పాతబస్తీ మరింత అభివృద్ధి దిశలో దూసుకుపోనుందని రేవంత్ రెడ్డి అన్నారు.


రాజకీయాలు ఎన్నికల టైంలోనే


శంకుస్థాపన అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడారు. రాజకీయాలు ఎన్నికల వరకే ఉంటాయని.. అభివృద్ధి కోసం అందరం కలిసి పని చేస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పాతబస్తీ ఓల్డ్ సిటీ కాదని.. హైదరాబాద్ కు ఒరిజినల్ సిటీ అని అన్నారు. పాతబస్తీకి వీలైనంత త్వరగా మెట్రోను తీసుకురావడానికి కృషి చేస్తామని అన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని.. హైదరాబాద్ కు కృష్ణా, గోదావరి నీళ్ళు, ఔటర్ రింగ్ రోడ్డు, ఎయిర్ పోర్ట్ తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎంని ఓడించాలని ప్రయత్నించామని.. కానీ ఆ పార్టీ హైదరాబాద్ ప్రాంతంలో మళ్లీ తన పట్టు నిలుపుకుందని అన్నారు.